భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేసిన ఆలయ కమిటీలు..
రాములోరి కళ్యాణంలో మహా అన్నదాన కార్యక్రమాలు..
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
గజకేసరి యోగం తో పాటు, ఆశ్లేష నక్షత్రంలో శ్రీరామనవమి వేడుకలు క్యాతనపల్లి పుర పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల కోదండ రామాలయంలో ఘనంగా జరిగాయి.రామాలయంలో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణ మహోత్సవం ఆలయ కమిటీ నిర్వహించింది, రాములోరి వివాహ మహోత్సవానికి చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దంపతులు, మందమర్రి ఏరియా జిఎం మనోహర్ దంపతులు హాజరై సీతారాముల ఆశీర్వాదం పొందారు. పెద్దపల్లి పార్లమెంట్ బిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ సీతారాముల కళ్యాణం లో హాజరయ్యారు. పట్టణంలోని రాజీవ్ చౌక్ విజయ గణపతి ఆలయంలో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. పుర పరిధిలోని గద్దెరాగడి, శేషుపల్లి, దుబ్బపల్లి, కుర్మపల్లి, అమరవాధి, క్యాతనపల్లి ఎక్స్ రోడ్డు వద్ద గల ఆంజనేయ స్వామి ఆలయాల్లో సైతం సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీల సభ్యులు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. భారీ కూలర్లు మంచినీటి సౌకర్యం మజ్జిగ పంపిణీ క్యూ లైన్ లు ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ ఎస్సై రాజశేఖర్ ఆలయాల సమీపాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాములోరి కళ్యాణం అనంతరం ఆలయాలలో మహాఅన్నదాన కార్యక్రమాలు ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి రాములోరి కళ్యాణంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అన్నదాన కార్యక్రమాలలో పాల్గొన్నారు.