యు.పి. రాజకీయాలపై కులగణన ప్రభావం

కోల్పోయిన ఓబీసీల్లో పట్టుకు బీజేపీ వ్యూహం

‘హిందూత్వ’ నుంచి ‘కుల రాజకీయాల’వైపు మారక తప్పని పరిస్థితి

దీర్ఘకాలంలో ప్రాంతీయ పార్టీలకే అనుకూలమయ్యే అవకాశం

కులరహిత సమాజం లక్ష్యం నెరవేరదు

కులవ్యవస్థ మరింత బలోపేతమవుతుంది

దేశంలో 50వేల కులాల్లో కేటగిరీలుగా విభజన ఎలా సాధ్యం?

బీజేపీకి అచ్చొచ్చిన ‘కలిసుంటే లాభం’ నినాదం

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

జనగణనతో పాటు కులగణన కూడా చేపడతామని కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కులగణన చేపట్టిన ఘనత, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దీన్ని తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితి కల్పించింది కూడా తామేనని కాంగ్రెస్‌ చెప్పుకోవడం సహజమే. దీన్ని బీజేపీ కొట్టిపారేస్తున్న సంగతి వేరేవిషయం. ఈ కులగణన ద్వారా రాజకీయంగా లబ్దిపొందాలని రెండు కూటములు యత్నిస్తున్నాయనేది నిష్టుర సత్యం. ఇదిలావుండగా ఇప్పటి వరకు కులాలపేరుతో హిందూ సమాజాన్ని విడదీయవద్దంటూ ‘హిందూత్వ’ రాజకీయాలకు పరి మితమైన బీజేపీ కులగణన చేపట్టాలని నిర్ణయించడానికి కొన్ని బలమైన కారణాలే వున్నాయను కోవాలి. త్వరలో బిహార్‌లో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నాయకత్వంలో విపక్షాలు ఈ కులగణను ఒక ప్రధాన అస్త్రంగా మలచుకోవడం ఒక కారణం కాగా, రెండోది గత లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో కేవలం 33 సీట్లకే పరిమితం కావడం మరో కారణమన్న విశ్లేషణలు వస్తున్నాయి. మొత్తం 80 స్థానాలు కలిగిన యు.పి.లో 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ 62 స్థానాల్లో గెలుపు సాధించగా గత ఎన్నికల్లో దాదాపు సగం సీట్లు కోల్పోవడం పార్టీ నాయకత్వా న్ని పునరాలోచనలో పడేసింది. ముఖ్యంగా 400 సీట్లు లక్ష్యంతో ఎన్నికల ప్రచారం చేసిన బీజేపీ యూపీలో ఘోరంగా దెబ్బతినడానికి కారణం ఇక్కడి కుల రాజకీయాలు, రిజర్వేషన్లను రద్దుచే స్తారని విపక్షాలు ప్రతికూల ప్రచారం చేయడం, పార్టీ టిక్కెట్ల జారీలో లోటుపాట్లుగా పార్టీ గుర్తిం చి ఆ దిశగా దిద్దుబాటు చర్యలకు దిగింది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చేది యు.పి. లో గెలుచుకున్న స్థానాలే నిర్ణయిస్తాయన్నది తెలిసిన విషయమే. ఇవే ఎన్నికల్లో అఖిలేష్‌ యాదవ్‌ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ 37 స్థానాలు గెలుచుకొని బీజేపీని వెనక్కి నెట్టేసింది. ఇక కాం గ్రెస్‌ ఆరు స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ మార్పుకు కారణమేంటన్న ప్రశ్నకు, గత దశాబ్దకా లంగా బీజేపీకి వెన్నుదనున్నగా వున్న ఓబీసీ మరియు దళిత ఓటర్లు దూరం కావడమన్నది నిపుణులు చెబుతున్న సమాధానం. 

కులగణనవైపు బీజేపీ మొగ్గు

సమాజ్‌వాదీ పార్టీకి ప్రధాన ఓటు బ్యాంకు ముస్లింలు, యాదవులు కాగా దీన్ని మరింత విస్తరిం చేందుకు అఖిలేష్‌ యాదవ్‌ వెనుకబడిన, ఆదివాసి, దళిత, అల్పసంఖ్యాక (పీడీఏ) వర్గాల ఓట్లకోసం అనుసరించిన వ్యూహం ఫలించడం కూడా బీజేపీ సీట్లు కోల్పోవడానికి ఒక కారణం. ఈ నేపథ్యంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌. రంగంలోకి దిగి బీజేపీ ఓటమికి కారణాలను విశ్లేషించడం మొదలుపెట్టింది. ఇందుకోసం వివిధ సమావేశాలు నిర్వహించి, ‘తాము కులగణనకు వ్యతిరేకం కాదని, కాకపోతే ఇది రాజకీయ ప్రేరేపితం కారాదు’ అని గత ఏడాది సెప్టెంబర్‌లో తన అభిప్రాయం వ్య క్తం చేసింది. సెప్టెంబర్‌ 2న పాలక్కాడ్‌ (కేరళ)లో జరిగిన మూడురోజుల సదస్సులో ఆర్‌.ఎస్‌.ఎస్‌. పబ్లిసిటీ ఇన్‌చార్జ్‌ సునీల్‌ అంబేద్కర్‌ సంస్థ అభిప్రాయాన్ని బహిర్గతం చేశారు. అదేనెల సె ప్టెంబర్‌ 17న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ జనగణనతో పాటు కులగణన జరిపే అంశాన్ని కొట్టిపారేయలేదు. దీనికి సంబంధించిన వివరాలను తర్వాత వెల్లడిస్తానని ఆయన చెప్పారు. కులగణనపై బీజేపీ వైఖరిలో వస్తున్న మార్పును గుర్తించిన అఖిలేష్‌ యాదవ్‌ అప్పటివరకు యు.పి. ప్రభుత్వాన్ని ‘ఠాకూర్‌ అనుకూలం’ అంటూ చేస్తున్న విమర్శలవాడిని తగ్గించారు. 2024 నంబర్‌ నెలలో యుపీపీఎస్‌సి ఛైర్మన్‌ సంజయ్‌ శ్రీనెట్‌కు వ్యతిరేకం గా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలో పాల్గన్న అఖిలేష్‌ యాదవ్‌ ఉత్తరప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ఏకంగా ‘‘ఠాకూర్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌’’ అంటూ ఆరోపించారు. 2025లో ఆయన రాజ్‌పుత్‌ల వివిధ ప్రభుత్వ సంస్థల్లో రాజపుత్‌ల ఆధిపత్యంపై దాడులను మరింత తీవ్రం చేశారు. ముఖ్యంగా ప్రయాగ్‌రాజ్‌, ఆగ్రా, మెయిన్‌పురి, చిత్రకూట్‌, మహోబాల్లో నియమించిన పోలీసు అధికార్లలో అధిక సంఖ్యాకులు రాజ్‌పుత్‌ వర్గంవారేనంటూ ఆయన చేసిన ఆరోపణలను పోలీసువర్గాలు ఖండిరచడం తర్వాతి పరిణామం.

 మోహన్‌ భాగవత్‌ నరేంద్రమోదీ సమావేశం

జనగనణతో పాటు కులగణన కూడా చేపట్టాలని కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఏప్రిల్‌ 30న తీసుకున్న నిర్ణయాన్ని యు.పి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్వాగతించారు. ఈ మంత్రివర్గ నిర్ణయానికి ముందు ప్రధాని నరేంద్రమోదీని మొట్టమొదటిసారి ఆర్‌.ఎస్‌.ఎస్‌. చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ సమావేశమవడం కీలక పరిణామం. 7`లోక్‌ కళ్యాణ్‌మార్గ్‌లోని ప్రధాని అధికార నివాసం లో వీరిద్దరూ దాదాపు గంటసేపు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య చర్చకు వచ్చిన కీలక అంశాల్లో కులగణన కూడా వుండవచ్చు. ఎందుకంటే అంతకుముందు ఈ సామాజిక`ఆర్థిక సర్వేను, సంపద పంపిణీ వంటి కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో పేర్కొన్న అంశాలను ‘అర్బన్‌నక్సల్స్‌’ ఆలోచనా సరళిగా ప్రధాని నరేంద్రమోదీ విమర్శిస్తూ వచ్చారు. ఇప్పుడు కులగణన ద్వారా గత పార్లమెంట్‌ ఎన్నికల్లో తాను కోల్పోయిన పీడీఏ మరియు ఓబీసీ ఓట్లను తిరిగి తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ముఖ్యంగా కులగణన తర్వాత కుల జనాభాను బట్టి సం క్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా ఆయా వర్గాల ఓట్లను పొందవచ్చనేది ఏ రాజకీయ పార్టీ అయినా అనుసరించే వ్యూహం. ఇందుకు బీజేపీ అతీతం కాదు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి మరో 24 నెలల సమయం వున్న నేపథ్యంలో, కోల్పోయిన వర్గాల ఓట్లను తిరిగిపొందడానికి కులగణన వ్యూహాన్ని బీజేపీ ఉపయోగించుకునే అవకాశాలే ఎక్కువ. అదీకాకుండా కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఉత్తరప్రదేశ్‌ ఎంతో కీలకమని ప్రధాని నరేంద్రమోదీ వి శ్వసించినంతగా మరే ఇతర నాయకుడు విశ్వసించడని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఇదిలావుండగా కేంద్ర కేబినెట్‌ నిర్ణయాన్ని యూపీలోని చాలామంది బీజేపీ కీలక నేతలు సమర్థిస్తున్నారు. ముఖ్యంగా 2024లో కోల్పోయిన ఓట్లను తిరిగి పొందడానికి ఇది ఎంతో ఉపయోగకరమని అభిప్రాయపడుతున్నారు. 

కులాల ఆధారంగా పార్టీలు

నిజం చెప్పాలంటే యు.పి.లోని దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలు కులాలపై ఆధారపడి ఏర్పడిన వే కావడం విశేషం. ఉదాహరణకు సమాజ్‌వాదీ పార్టీ యాదవులకు, బహుజన్‌ సమాజ్‌వాది పార్టీ జాతవ్‌లకు, సుహల్దేవ్‌ భారతీయ సమాజ్‌వాదీ పార్టీ రాజ్‌భార్లకు, నిషాద్‌ పార్టీ నిషాదులకు, రాష్ట్రీయ లోక్‌దళ్‌ జాట్‌లకు, అప్నాదళ్‌ కుర్మీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. వాస్తవానికి బీజేపీ ‘హిందూత్వ’ అనే సిద్ధాంతానికి తప్ప ఏ ఒక్క కులానికి మద్దతివ్వదు. కానీ కులగణన నేప థ్యంలో జనాభా ఆధారంగా కులాలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడటం ఖాయం. కులగణన వల్ల కలిగే మరో పరిణామమేంటంటే, ప్రస్తుతం ఆధిపత్యం వహిస్తున్న తక్కువ జనాభా కలిగిన కులాలకు ప్రాతినిధ్యం తగ్గి, ఇప్పటివరకు రాజకీయ ప్రాధాన్యత లేని అధిక జనాభా కలిగిన కులాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. అంటే యాదవులు, రాజ్‌పుత్‌వర్గాల ప్రాధాన్యం తగ్గే అవకా శాలే ఎక్కువ. మరోవిషయమేంటంటే అట్టడుగున వున్న వెనుకబడిన వర్గాలు, జాతవ్‌ యేతర ఎస్సీ వర్గాల ఓట్లు తమ ఖాతాలో పడతాయని బీజేపీ అంచనా. ఇదే సమయంలో 2024లో స మాజ్‌వాదీ పార్టీకి ఓటు వేసిన కుర్మీల రాజకీయ ప్రాబల్యం కూడా తగ్గే అవకాశముంది. ఇది బీజేపీకి లాభదాయకమవుతుందని స్థానిక బీజేపీ నేతల అంచనా.

వ్యూహం మార్చిన అఖిలేష్‌ యాదవ్‌

2024లో అఖిలేష్‌ యాదవ్‌ పీడీఏను ప్రధాన అజెండాగా తీసుకొని ఎన్నికల ప్రచారం కొనసా గించారు. కులగణన నేపథ్యంలో 2027 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు ఈ వ్యూహం పనిచేయదు. దీన్ని గుర్తించిన అఖిలేష్‌ యాదవ్‌ లోక్‌సభ ఎన్నికల తర్వాత, అప్పటివరకు అనుసరిస్తున్న ‘ఠాకూర్‌’లను వ్యతిరేకిస్తూ అనుసరించిన వ్యూహాన్ని మార్చి ఇప్పుడు రాజ్‌పుత్‌లపై దృష్టిపెట్టారు. ఎస్‌.పి. ఎం.పి. రాంజీలాల్‌ సుమన్‌ రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా మేవార్‌ (రాజస్థాన్‌) రాజ్‌పుట్‌ రాజు రాణా సంగాను ‘‘ద్రోహి’’గా వర్ణించడం ఇందులో భాగమే అనుకోవాలి. దీన్ని ఎస్సీలు, రాజ్‌పుత్‌లకు మధ్య ఉన్న సయోధ్యను చెడగొట్టడానికి చేసే కుట్రగా రాజ్‌పుత్‌ నాయకు లు పరిగణిస్తున్నారు. నిజం చెప్పాలంటే యు.పి.లో ఠాకూర్‌ (రాజ్‌పుత్‌ల్లో ఒక వర్గం)లంటే తీవ్రవ్యతిరేకత వ్యక్తమవుతుంటుంది. దీన్ని అనుకూలంగా మలచుకోవడానికే అఖిలేష్‌ యాదవ్‌ ప్ర యత్నిస్తున్నారనుకోవాలి. ఇంతగా ఠాకూర్‌లపై విమర్శలు గుప్పిస్తున్న అఖిలేష్‌ యాదవ్‌, ఆయనతండ్రి ములాయంసింగ్‌ యాదవ్‌ల హయాంలో ప్రభుత్వంలోని అన్ని ముఖ్యమైన పోస్టుల్లో యాదవ్‌లతో నింపేశారన్న ఆరోపణలు విపరీతంగా వెల్లువెత్తాయి. సమాజ్‌వాదీ పార్టీ ఓటమికి ‘యాదవ్‌ రాజ్‌’ ప్రధాన కారణమన్న విశ్లేషణలు కూడా వచ్చాయి. ఇదిలావుండగా కులగణన కారణంగా రాష్ట్రంలోని అగ్రవర్ణాల (బ్రాహ్మణులు, బనియాలు) వారు తమ హక్కులను కోల్పోయామన్నభావనకు లోనుకాకుండా బీజేపీ జాగ్రత్తపడాల్సి వుంటుంది. పార్టీకి ఈ వర్గాల్లో గట్టి పట్టుంది. 

కులగణన వల్ల బీజేపీ తాను సంప్రదాయంగా అనుసరిస్తూ వస్తున్న ‘హిందుత్వ’ సిద్ధాంతానికి దూరం కావలసి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేసే నాయకులు లేకపోలేదు. ఇది శాశ్వతంగాపార్టీని కుల రాజకీయ ఊబిలోకి నెట్టేస్తుందన్న భయం వారిలో వ్యక్తమవుతోంది. ఇందుకు ఉదాహరణగా వి.పి.సింగ్‌ అమలుచేసిన మండల్‌ కమిషన్‌ నివేదిక ఉదంతాన్ని వివరిస్తున్నారు. ఈ కమిషన్‌ నివేదిక ప్రకారం ఓబీసీలకు 27% రిజర్వేషన్‌ను వి.పి.సింగ్‌ ప్రభుత్వం అమలుచేసింది. కానీ తర్వాతికాలంలో దీనివల్ల బాగా లాభపడిరది ప్రాంతీయ పార్టీలు మాత్రమే! ఈ నేపథ్యంలో కులగణన వల్ల రాబోయేకాలంలో బీజేపీకి నష్టం కలుగుతుందన్న ఆందోళన వారిలో వ్యక్తమవు తోంది. 

ఉత్తరప్రదేశ్‌ లోక్‌సభ ఎన్నికల్లో జరిగిన నష్టం నేపథ్యంలో, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ హిందూత్వపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. ‘విడిపోతే నష్టపోతాం’ అన్న నినాదం హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో బాగా పనిచేసి, బీజేపీ అధికారంలోకి రావడానికి దోహదం చేసింది. కుల రాజకీయం అనేది ‘సైద్ధాంతిక పోరాటం లేకుండానే ఓటమి పాలవడం తప్ప మరోటికాదు’ అ న్నది బీజేపీలోని కొందరు నాయకుల అభిప్రాయం. కాంగ్రెస్‌ అనుసరించే కుల రాజకీయాలు బీజేపీకి సరిపోవన్నది వారి దృఢవిశ్వాసం. అసలు దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడం ఎంతవరకుసాధ్యముతుందనేది మరి కొందరు సంధిస్తున్న ప్రశ్న. దేశవ్యాప్తంగా 50వేల కులాలున్నప్పుడు ఎన్ని కేటగిరీలుగా విడగొడతారు? అదీకాకుండా ఒక వ్యక్తి తాను ఫలానా కులానికి చెందినవాడినని చెప్పినప్పుడు ఏవిధంగా దాన్ని నిర్ధారిస్తారు? ఒకవేళ కులగణన సమాచారం ప్రకారం రిజర్వేషన్‌ కోటాను 50శాతం కంటే పెంచుతారా? అనేది మరో ప్రశ్న. ఎస్సీ/ఎస్టీల్లో ఉపకుల వర్గీ కరణ చేయవచ్చని 2024 ఆగస్టులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. అయితే ఈవిధమైన వర్గీకరణ అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగానికి వ్యతిరేకమని బీజేపీ వాదిస్తోంది. మొత్తంమీద చెప్పాలంటే కులగణన వల్ల కులవ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. కులరహిత వ్యవస్థకోసం కృషిచేయాలన్న మన నాయకుల ఆశయాలకు ఇది గండికొట్టే అవకాశాలే ఎక్కువ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!