`కమిషనర్ చౌహన్ ను అందరూ కలిసి మభ్యపెడుతున్నారా!
`మిల్లర్ అసోసియేషన్ అంతర్లీనంగా జగన్ ను ఎందుకు కాపాడుతున్నట్లు!
`జగన్ వెనుక ఉండి మిల్లర్ల అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు నడిపిస్తున్నాడా?
`కమీషనర్ కు హన్మకొండ జేసి రాసిన లేఖతో బట్టబయలు.
`రైతులను ఒప్పించిన తర్వాతే బస్తాలలో కోత అని జగన్ వాదనలు.
`హన్మకొండ జిల్లాకు వడ్లను పంపించింది ఖమ్మం జేసి.
`వడ్లను అప్పగిస్తూ హన్మకొండ లోని ఇతర మిల్లులకు ఆర్వోలు.
`హన్మకొండ అధికారుల అత్యుత్సాహంతో జగన్ మిల్లులకు చేరిన వడ్లు.
`రైతుల వద్ద జగన్ వడ్లు కొనుగోలు చేయలేదు.
`అలా అయితే నేరుగా జగన్ మిల్లుల పేరు మీదే వడ్లు వచ్చేవి.
`ఇంతటి గందరగోళం నెలకొని వుండకపోయేది.
`అసలు ఖమ్మం నుంచి వచ్చింది వడ్లకు జగన్కు సంబంధమే లేదు.
`కనీసం మధ్య వర్తిత్వం కూడా జరగలేదు.
`జగన్ అసలు ఖమ్మం వెళ్లనే లేదు. రైతులను కలిసిందే లేదు.
`అలాంటప్పుడు జగన్ రైతులను ఎలా ఒప్పించినట్లు!
`జగన్ చెప్పిన విషయాలకు హన్మకొండ జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు ఎలా తలూపినట్లు?
`కమీషనర్ కు హన్మకొండ జేసి లేఖలో ఈ ప్రస్తావన ఎందుకు చేసినట్లు?
`జేసిని హన్మకొండ సివిల్ సప్లయ్ అధికారులు తప్పు దోవ పట్టించారా?
`జగన్ను కాపాడతామని గతంలో అధికారులు అన్నంత పని చేశారా?
`కులమే ముఖ్యమని గతంలో చెప్పిన అధికారులు జగన్ను కాపాడుతున్నారా!
`రైతులను అడ్డంగా మోసం చేసిన జగన్ను ఎందుకు వెనకేసుకొస్తున్నట్లు?
హైదరాబాద్,నేటిధాత్రి:
ఒక తప్పు వంద తప్పులు చేయిస్తుంది. ఒక మోసం వంద మోసాలు చేసేలా చేస్తుంది. ఒక అబద్దం వెయ్యి అసత్యాలను చెప్పిస్తుంది. కాని తప్పు చేయొద్దన్న భావన వుంటేనే మనిషంటారు. లేకుంటే మోసగాడంటారు. రైతులను మోసం చేసిన వారిని దుర్మార్గులంటారు. ఆరు గాలం కష్టపడి ఎండననక, వాననక, రాత్రి పగలు తేడా లేకుండా ఒక్కొ గింజను అపురూపంగా చూసుకుంటాడు. చేలు నుంచి ఒక్క వడ్ల గింజ రాలినా కన్నీరు కారుస్తాడు. వరి చేలును కంటికి రెప్పలా చూసుకుంటాడు. కన్న బిడ్డలను పెంచుకున్నట్లు పెంచుకుంటాడు. అలాంటి రైతులను మోసం చేయడం పాపం. చట్టపరంగా నేరం. అన్నీ తెలిసినా కొంత మంది జగన్ లాంటి మిల్లర్లు మోసాలు చేస్తూనే వుంటారు. రైతుల గోస పుచ్చుకుంటూనే వుంటారు. అలాంటి వారిని ప్రభుత్వాలు ఉపేక్షించకూడదు. రైతులు చెమట కష్టంతో పండిరచే ఒక్కవడ్ల గింజను మోసం చేసినా, అది క్షమించరానిదే. ఇప్పుడున్న టెక్నాకలజీ ప్రకారం వడ్లలో వున్న తేమను క్షణాల్లో గుర్తించే అవకాశంవుంది. గతంలో వ్యాపారులు చెప్పిందే రైతు వినేవారు. రైతులను బెదిరించేవారు. ఇప్పుడున్న సదుపాయలు రైతులకు అప్పుడు లేవు. రైతులే తమ ఎడ్ల బండ్ల ద్వారా రైస్ మిల్లులకు, వ్యాపారులు వడ్లను తీసుకెళ్లేవారు. అప్పుడు వ్యాపారి చెప్పిందే చేసేవారు. అయినా అప్పుడు ఇంతగా మోసాలు లేవు. అరచేతిలో వడ్లుపట్టుకొని రైతుల రెండు చేతులతో నలిపి బియ్యం తీసి చూపించి, వ్యాపారుల నోరు మూయించేవారు. ఇప్పుడు ఆపరిస్దితి అవసరం కూడా లేదు. వడ్లలో వున్న తేమను ఖచ్చితంగా కొలిచే యంత్రాలు వచ్చాయి. అయినా రైతులను మోసంచేసేందుకు జగన్ లాంటి వ్యాపారులు చూస్తూనే వున్నారు. అయితే అవి అలాంటి ఇలాంటి మోసాలు ఏకంగా ప్రభుత్వం కల్లుగప్పే మోసం. రైతులకు తీరని అన్యాయంచేసే మోసానికి పాల్పడుతున్నారు. ఇక్కడ మిల్లర్ చేసిన మోసం గురించి వివరంగా చెప్పుకుందాం..తప్పుల మీద తప్పులు చేసి ఎలా తప్పించుకోవాలనుకుంటున్నాడో చూద్దాం..ఖమ్మం జిల్లాకు చెందిన జాయింట్ కలెక్టర్ హన్మకొండ సివిల్ సప్లయ్కు మిల్లర్ల పేరు మీద పంపింపిన ఆర్వోలను రికవరీ చేశారు. ఇది ముమ్మాటికీ నేటిధాత్రి దినపత్రిక విజయం. రైతులకు మేలు చేసే విషయంలో అలుపెరగని అక్షర పోరాటం చేసిన నేటిధాత్రి వల్ల రైతులకు మరింత మేలు జరిగింది. అందుకు రైతులు కూడా నేటిధాత్రి దినపత్రికకు ధన్యవాదాలు తెలిపారు. ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్తోపాటు, సవిల్ సప్లై సిబ్బంది కూడా అభినందలు తెలిపారు. ఇది రైతుల కోసం నేటిధాత్రికి దక్కిన గౌరవం. ఇక అసలు విషయానికి వద్దాం. ఇటీవల హన్మకొండ జాయింట్ కలెక్టర్ కూడా మిల్లర్ జగన్ వడ్లను మాయం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ సివిల్ సప్లైశాఖ కమీషనర్ కు లేఖ రాశారు. దాంతో జగన్ బండారం పూర్తిగా బైటపడిపోయింది. జగన్ చేసిన మోసం రుజువైంది. అయినా జగన్ తన వితండవాదాన్ని వదిలిపెట్టడం లేదు. తాను రైతులను ఒప్పించిన తర్వాతే వారి అనుమతితోనే వడ్లలో కోత పెట్టడం జరిగిందంటున్నాడని సమాచారం. అందువల్లనే బస్తాలను మాయం చేసినట్లు కూడ చెప్పినట్లు తెలుస్తోంది. ఇక్కడే జగన్ మరోసారి తప్పులో కాలేశాడు. ఖమ్మంజిల్లా జాయింట్ కలెక్టర్ హన్మకొండకు చెందిన మిల్లర్ జగన్కు వడ్లు పంపలేదు. ఇది మొదటి అంశం. ఖమ్మం జేసి జగన్కు ఎలాంటి ఆర్వోలు కూడా జారీ చేయలేదు. ఆర్వోలు హన్మకొండ జిల్లాలోని ఇతర మిల్లుల పేరు మీద ఆర్వోలు జారీ చేయడం జరిగింది. మిల్లర్ జగన్కు వ్యాపార పరంగా అత్యంత అనుకూలమైన కొంత మంది సివిల్ సప్లై అధికారులు ఆర్వోలు అందిన మిల్లర్ అన్ లోడ్ చేయాల్సిన బస్తాలను జగన్ మిల్లుకు మళ్లించారు. ఆర్వోలు జారీ అయిన మిల్లుల వద్దకు చేరిన వడ్ల బస్తాలను సంబంధిత మిల్లర్లు అన్ లోడ్ చేసుకోవడం లేదంటూ హన్మకొండ జిల్లా కలెక్టర్కు తప్పుడు సమాచారం అందించి, వాటిని జగన్ మిల్లులకు మల్లించారు. ఆర్వోలు జారీ అయిన మిల్లర్లు అడ్డుకున్నా, నిర్ధాక్షిణ్యంగా వాటిని జగన్ మిల్లులకు మళ్లించడం అదికారులు చేసిన పెద్ద పెరపాటు. అయినా ఇతర మిల్లర్లు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. ఆర్వోలు జారీ అయిన మిల్లర్లు కూడా ఎదిరించలేదు. అధికారుల వద్ద జగన్కు వున్న పలుకుబడితో వారు కూడా సైలెంట్ అయ్యారు. ఒకప్పుడు వడ్లు వద్దే వద్దు అని మొండికేసిన జగన్ ఇప్పుడు కొట్లాడి మరీ వడ్లు తీసుకున్నాడు. జగన్కు వున్నవి రా రైస్ మిల్లులుకాదు. బాయిల్డ్ రైస్ మిల్లులు. అయినా ఇప్పుడు రా రైస్ మిల్లర్ల పొట్టగొట్టి వారి వ్యాపారానికి అడ్డు తగిలి మరీ వడ్లు తీసుకున్నాడు. పైగా రైతులను మోసం చేశాడు. వడ్ల బస్తాల మాయంపై హన్మకొండ జాయింట్ కలెక్టర్ విచారణకు ఆదేశించారు. దాంతో జగన్ తాను రైతులను ఒప్పించి, మెప్పించి వడ్లలో తేమ శాతం ఎక్కువ వుండడంతో కోత కోశానని వివరణ ఇచ్చుకున్నాడని సమాచారం. అసలు హన్మకొండ జిల్లా మిల్లులకు ఖమ్మం నుంచి వడ్లు వస్తున్న సంగతే జగన్కు తెలియదు. హన్మకొండ జిల్లాకు చెందిన ఇతర రైస్ మిల్లుల వరకు లారీలు చేరే దాకా జగన్కు సమాచారమే లేదు. ఖమ్మం జేసి నుంచి ఆర్వోలు జగన్కు మిల్లులకు వచ్చింది కాదు. అలాంటప్పుడు జగన్ రైతులను ఎప్పుడు కలిసినట్లు? ఎలా కలిసినట్లు? అదే నిజమైతే ఖమ్మం జేసి మొదట నేరుగా జగన్కే ఆర్వోలు జారీ చేసేవారు. జగన్కు కాదని ఇతర మిల్లులకు జారీ చేసేవారు కాదు. ఇతర మిల్లులకు జారీ చేసిన వడ్లను తన మిల్లులకు తోలుకుపోవాల్సిన అవసరమే వచ్చేది కాదు. జగన్ ఒప్పించిన రైతులు ఎవరు? ఏఏ ఐకేపి సెంటర్ల నుంచి వచ్చిన వడ్లో జగన్కు ఎలా తెలుసు? ఖమ్మం నుంచి హన్మకొండకు వడ్లు వచ్చిన తర్వాతే జగన్ వాటిని తన మిల్లులకు మరల్చుకున్నాడు. అలాంటప్పుడు ఏ రైతులను జగన్ ఒప్పించుకున్నాడో చెప్పాలి. ఆ రైతులు ఎవరో జగన్ వెల్లడిరచాలి. వారి చేత చెప్పించాలి? తప్పు చేసి కూడా ఇంకా ప్రబుత్వాన్ని మోసం చేస్తూ, రైతుల పేరు చెప్పి మాయమాటలు చెబుతున్న జగన్ మిల్లులను సీజ్ చేయాలి. విజిలెన్స్ ఎంక్వౌరీ చేయించి, జగన్పై కేసులు నమోదు చేయాల్సి వుంటుంది. జగన్ వివరణతో రిపోర్టు తయారు చేసిన అదికారులు ఈ చిన్న విషయాన్ని కూడా పసిగట్టలేకపోయారా? జగన్ చెబుతున్నది అవాస్తవమని తేలిపోతుందని గమనించలేకపోయారా? జగన్ ఏది చెబితే దానిని సమర్దిస్తూ హన్మకొండ జిల్లా అదికారులు రిపోర్టు తయారుచేస్తారా? ఇలాంటి తప్పుడు వివరణల ద్వారా మళ్లీ జగన్ తనగోతిని తానే తవ్వుకుంటున్నాడని అదికారులు కూడా గుర్తించలేకపోయారా? అసలు ఈ ఆలోచన జగన్కే వచ్చిందా? లేక అదికారులే జగన్కు ఇలాంటి సలహా ఇచ్చారా? రైతులను ఒప్పించుకున్నానని చెప్పు. సమస్య తీరిపోతుందని భరోసా ఇచ్చారా? ఎందుకంటే గతంలో జగన్కు కాపాడేందుకు కొంత మంది అదికారులు సన్నిహితులతో చెప్పిన మాటలు కూడా నేటిధాత్రి ప్రస్తావించింది. తమకు కులమే ముఖ్యమని, తమ కులానికి చెందిన జగన్న కాపాడతామని చెప్పిన అదికారులే కాపాడుతున్నట్లు స్పష్టమౌతోంది. గతంలో వారు చెప్పినట్లే జగన్ను వెనకేసుకొస్తున్నారనిపిస్తోంది. అందుకే ఆర్వోలు జారీ అయిన మిల్లులకు కాకుండా, జగన్ మిల్లులకు వడ్లు తరలించారు. ఆర్వోలు జారీ అయిన మిల్లర్లను అన్యాయం చేశారు. జగన్కు ఖమ్మం నుంచి వచ్చిన వడ్లన్నీ అంటగట్టారు. జగన్కు ఎల్ల వేళలా అండదండలు అందిస్తున్నారు. ఇక జగన్కు వెనక మిల్లర్ల అసోసియేషన్కు చెందిన ఓ నాయకుడు వున్నట్లు కూడా సమాచారం. అంతా ఆయన వెనకుండి నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ నాయకుడి స్వలాభం కోసం జగన్కు మద్దతు పలుకుతున్నట్లు చెప్పుకుంటున్నారు. జగన్కు అదికారుల పూర్తి లభించడంలో కూడా యూనియన్ రాష్ట్ర నాయకుడి హస్తం వుందని అంటున్నారు. ఏది ఏమైనా జగన్ రైతులను మోసం చేయడం నేరం. తప్పు చేసిన దొరికిన జగన్ తప్పును అంగీకరించకుండా ఇంకా కుప్పిగంతులు వేయడం విడ్డూరం. అదికారుల సహాకారం వుందన్న దీమాతో వారి చేత కూడా తప్పులు చేయిస్తున్నాడు. ఉద్యోగులు తమ ఉద్యోగాలకు ఎసరు వచ్చే పరిస్దితులు తెచ్చుకుంటున్నారు. జగన్పై చర్యలు తీసుకునేందుకు కమీషనర్ స్ధాయిలో కసరత్తు జరుగుతోంది. అప్పుడు జగన్ బండారం, ఉద్యోగుల వ్యవహారం అంతా బట్టబయలౌతుంది.