ఉద్రిక్తతల నడుమ సరిహద్దు రాష్ట్రాల్లో నీటి జగడం సమంజసం కాదు
సింధూనది జలాల ఒప్పందం రద్దు నేపథ్యంలో మళ్లీ రగిలిన నీటివివాదం
ఆప్ ప్రభుత్వం వైఖరితో కేంద్రానికి ఇరకాటం
దేశ సమస్యను పట్టించుకోని పంజాబ్
పాక్కు ప్రయోజనం కలిగించే రీతిలో పంజాబ్ వైఖరి
ఆప్ ప్రభుత్వానికే కాంగ్రెస్ మద్దతు
ఎవరి కారణాలు వారికున్నా, ప్రస్తుత పరిస్థితుల్లో నీటి వివాదం నిర్హేతుకం
హైదరాబాద్,నేటిధాత్రి:
హర్యానాకు 4500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని భాక్రా బీయాస్ మేనేజ్మెంట్ బోర్డ్ (బీబీఎంబీ)ని శుక్రవారం ఆదేశించింది. మే 3వ తేదీనుంచి ఎనిమిది రోజుల వరకు ఈ నీటిని విడుదల చేయాలని స్పష్టం చేసింది. శుక్రవారం పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థా న్ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశానంతరం కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మో హన్ ఈమేరకు ఆదేశించారు. ఈ నాలుగు రాష్ట్రాలు బీబీఎంబీలో సభ్యులుగా వున్నాయి.
బీబీఎంబీ కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ నియంత్రణలో వుంది. బీబీఎంబీకి చెందిన కమిటీలో హర్యానా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, చండీగఢ్కు చెందిన సాంకేతిక నిపుణులు సభ్యులుగా వుంటారు. కేంద్రం ఆదేశాల మేరకు నీటివిడుదలకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వీరు సిద్ధం చేసి అమలు చేస్తారు.
సమస్య ప్రారంభం
తమరాష్ట్రానికి అదనపు జలాలు విడుదల చేయాలని ఏప్రిల్ 28న హర్యానా ముఖ్యమంత్రి నా యబ్ సింగ్ సైనీ కోరారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టునుంచి హర్యానా 4వేల క్యూసెక్కుల నీటిని పొందుతోంది. కాగా ఆయన డిమాండ్ మేరకు రాష్ట్రానికి భాక్రా డ్యాం నుంచి 8500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని నిర్ణయించింది. పంజాబ్లో అధికారంలో వున్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించడమే కాదు, మే 1వ తేదీన భాక్రాకు దిగువన 13 కి లోమీటర్ల దూరంలో వున్న నంగల్ డ్యామ్ వద్దకు డీఐజీ స్థాయి పోలీసు అధికార్లను పంపి అక్కడినుంచి నీటి విడుదలను అడ్డుకుంది. విచిత్రమేమంటే బీబీఎంబీ బోర్డులో సభ్యురాలిగా వున్న రాజస్తాన్ నిపుణులు హర్యానాకు 8500 క్యూసెక్కుల నీటిని సరఫరా చేసేందుకు మద్దతు పలు కగా, హిమాచల్ ప్రదేశ్ నిపుణులు మాత్రం మౌనంగా వుండిపోయారు. ఒక్క పంజాబ్ ప్రతిధు లు మాత్రమే నీటి విడుదల నిర్ణయాన్ని వ్యతిరేకించారు. హర్యానాకు అదనపు జలాల కేటాయింపును అడ్డుకొని తీరతామని పంజాబ్కు చెందిన ప్రధాన రాజకీయ పార్టీలు స్పష్టం చేయడం గ మనార్హం. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేతృత్వంలో ఏడు ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు చండీగఢ్లో మే 1న సమావేశమై, హార్యానాకు చుక్క అదనపు నీటిని తరలించినా అడ్డుకొని తీరతామని శపథం చేయడంతో సమస్య జఠిలమైంది. ఇది కేవలం తమ నీటిని దోపిడీ చేయడమేనని పంజాబ్ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో, హర్యానా ముఖ్యమం త్రి నాయబ్ సింగ్ సైనీ ఈ విషయంలో సంయమనం పాటించాలంటూ హితవు పలికారు.
బీబీఎంబీ నిర్వహణ
భాక్రా మరియు పొంగ్ డ్యామ్ల నుంచి నీటి నిర్వహణ బాధ్యతను భాక్రా బీయాస్ మేనేజ్మెంట్బోర్డ్ (బీబీఎంబీ) చూస్తుంటుంది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్లు ఈ రెండు డ్యామ్లనుంచి ఏటా తమ నీటి అవసరాలను తీర్చుకుంటుంటాయి. బీబీఎంబీ ఈ రాష్ట్రాలకు మే 21 నుంచి మరసటి ఏడాది మే 20 వరకు ఏ రాష్ట్రానికి ఎంత వాటా నీటిని కేటాయించాలో నిర్ణయించి ఆమేరకు అమలు చేస్తుంటుంది. కాగా హర్యానా ముఖ్యమంత్రి కోర్కె మేరకు 8500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని బీబీఎంబీ నిర్ణయించడంతో వివాదం చెలరేగింది. ఈ నిర్ణయాన్ని కమిటీ లోని పంజాబ్ ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే హర్యానా తనకు రావలసిన నీటిని వాడుకుందని, అటువంటప్పుడు అదనపు నీటిని కేటాయించడం అన్యాయమని వారు వా దించారు. ఈ నేపథ్యంలోనే పంచాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ‘కేంద్రం, హర్యానా ప్రభు త్వాలు కుమ్మక్కయ్యాయని, బీజేపీ ఎన్నడూ పంజాబీలది కాదు’ అంటూ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం, హర్యానా ముఖ్యమంత్రి సైనీ, కేంద్ర మంత్రి మనోహర్లాల్ ఖట్టర్లు కుట్రపూరితంగా ఈవిధంగా చేస్తున్నారంటూ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆరోపించారు. ఇప్పటికే తనకు కేటాయించిన దాంట్లో హర్యానా 103శాతం నీటిని, రాజస్థాన్ 110% నీటిని వాడుకున్నాయి. అదే పంజాబ్ ఇప్పటివరకు కేవలం తన వాటా నీటిలో 89% నీటిని మాత్రమే వాడుకుందని పంజాబ్ ఆర్థిక శాఖ మంత్రి హర్పాల్ సింగ్ ఛీమా పేర్కొన్నారు.
ఆయన అందించిన వివరాల ప్రకారం పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలకు వరుసగా 5.512 మిలియన్ యాకర్ ఫీట్ (ఎంఏఎఫ్), 2.987 ఎంఏఎఫ్, 3.398 ఎంఏఎఫ్ నీటిని కేటా యించగా, ఇప్పటివరకు హర్యానా 3.091 ఎంఏఎఫ్, రాజస్థాన్ 3.738 ఎంఏఎఫ్ మరియు పంజాబ్ 4.925 ఎంఏఎఫ్ నీటిని వాడుకున్నాయి. ప్రస్తుతం భాక్రా డ్యామ్లో 1557.10 అడుగులు (పూర్తి సామర్థ్యం 1680 అడుగులు), పోంగ్ డ్యామ్లో 1293.73 అడుగులు (పూర్తి సామర్థ్యం 1390 అడుగులు), రంజిత్ సాగర్ డ్యామ్లో 1642 అడుగులు (పూర్తి సామర్థ్యం 1732 అడుగులు) నీటి నిల్వ వుంది. అంటే ఇప్పటికే ఈ డ్యామ్ల్లో నీటినిల్వ తక్కువగా వున్న నేప థ్యంలో హర్యానాకు అదనపు నీరు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని సైనీ ప్రశ్నిస్తున్నారు. హర్యానా తనకు కేటాయించిన నీటిని మే 21 వరకు ఉపయోగించుకోవచ్చు. గడువు తేదీకి చాలా కాలం ముందుగానే తన వాటా నీటిని పూర్తిగా వాడుకున్నదంటే, ఆ రాష్ట్రం నీటిని దుబారా చేసేస్థాయి ఏవిధంగా వున్నదో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. తాగుకు కేటాయించిన నీటిని వ్యవసాయానికి, పరిశ్రమలకు సరఫరా చేయడమే ప్రస్తుత దుస్థితికి కారణమని ఆయన ఆరోపించారు.
దీనిపై హర్యానా ముఖ్యమంత్రి సైనీ తీవ్రంగా స్పదించారు. ‘పంజాబ్ అంటే గురువుల ప్రదేశం. మేం గురువులనుంచి ఎంతో నేర్చుకున్నాం. పంజాబ్ అంటే మా సోదర రాష్ట్రం, అక్కడి ప్రజలు నీటికి కటకటపడుతుంటే మా వాటా నీటిని అందిస్తాం. అదీ మా సంస్కృతి. అంతేకాని నీటి పే రుతో తుచ్ఛ రాజకీయాలు చేయడం సమంజసం కాదు’ అంటూ పంజాబ్ రాజకీయ నేతలపై విరుచుకుపడ్డారు. అంతేకాదు తమకు తాగునీరు సరఫరా చేయాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆయనకోరారు. ఆవిధంగా చేయకపోతే అదనపు నీరు వృధాగా పాకిస్తాన్లోకి పోతుందని గుర్తుచేశారు.పహల్గామ్ దాడులకు నిరసనగా పాకిస్తాన్తో సింధూ జలాల ఒప్పందాన్ని కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో సైనీ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడిరది. జూన్ నెలాఖరు లోగా భక్రా డ్యాంను ఖాళీ చేస్తే, రుతుపవన వర్షాలతో మళ్లీ డ్యాం నిండుతుంది. లేదంటే అదనపు నీరు హరి కా పట్టణ్ ద్వారా పాకిస్తాన్లోకి వెళుతుందన్నారు. ఇది పంజాబ్కు లేదా మనదేశానికి ఎంతమాత్రం ప్ర యోజనకరం కాదని గుర్తుచేశారు.
ఇదిలావుండగా హర్యానాకు అదనపు నీటిని ఇవ్వొద్దన్న పంజాబ్ ప్రభుత్వ డిమాండ్ను కాంగ్రెస్ సమర్థించడమే కాదు, ఆమ్ ఆద్మీ పార్టీకి తన మద్దతు తెలిపింది. ఇదిలావుండగా రెండు రాష్ట్రాలమధ్య సట్లెజ్`యమున లింక్ కాల్వ సమస్య కూడా రావణకాష్టంలా రగులుతోంది. ఇప్పుడు హర్యానాకు అదనపు నీటి వివాదంతో ఇదికూడా ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సట్లెజాయమున లింక్ కెనాల్ (ఎస్వైఎల్) వివాదం
నిజానికి ఈ వివాదం ఇప్పటిది కాదు 1960లో భారత్`పాకిస్తాన్ల మధ్య సింధూనదీ జలాల ఒప్పందం కుదిరినప్పుడు, రావీ, బీయాస్, సట్లెజ నదుల నీటిని స్వేచ్ఛగా మనదేశం వినియోగించుకునేందుకు వీలైంది. ఒకరకంగా చెప్పాలంటే కర్ణాటక`తమిళనాడు మధ్య కావేరీ జలాల పంపిణీ వివాదం లాంటిదే ఇది కూడా. 1966లో పంజాబ్ నుంచి హర్యానా విడిపోయింది. ఈ నేపథ్యంలో ఈ నదులనుంచి హర్యానాకు కూడా న్యాయబద్ధంగా నీటి వాటాను కేటాయించాల్సి వచ్చింది. ఇందులో భాగంగా రూపొందించిందే సట్లెజ్`యమున లింక్ కెనాల్ (ఎస్వైఎల్) పథ కం. అయితే విభజన చట్టాల ప్రకారం తమ రాష్ట్రంలోని నీటిని పంపిణీ చేయాల్సిన అవసరంలేదంటూ పంజాబ్ ఈ ఒప్పందాన్ని తిరస్కరించింది. తర్వాతికాలంలో సామరస్య వాతావరణం నెలకొన్ని నేపథ్యంలతో1981లో రెండు రాష్ట్రాలు ఎస్వైఎల్జలాలను పంచుకోవాలని ఒక అంగీకారానికి వచ్చాయి. దీంతో పంజాబ్లోని కాపూరీ గ్రామంలో ఈ కాల్వ తవ్వకాన్ని ప్రారంభించారు.ఈ కాల్వ మొత్తం పొడవు 214 కి లోమీటర్లు. ఇందులో 122 కిలోమీటర్లు పంజాబ్లో, 92 కిలోమీటర్లు హర్యానాలో కాల్వ కొనసాగుతుంది. అ యితే హర్యానా తనకు కేటాయించిన ప్రాజె క్టు పనులను పూర్తిచేయగా, పంజాబ్ మాత్రం 1982 నుంచి ఇప్పటివరకు దీన్ని పూర్తిచేయలేదు. కాగా ఈ కాల్వ విషయంలో పంజాబ్లో తీవ్రస్థాయిలో నిరసనలు, ఆందోళనలు చోటుచేసుకొని చివరకు దేశ భద్రతకు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. దీంతో1985 లో అప్పటి ప్రధానిరాజీవ్గాంధీ, అకాళీదళ్ అధినేత సంత్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీని ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య నదీజలాల పంపిణీని నిర్ణయించేందుకు ఒక కొత్త ట్రై బ్యునల్ ఏర్పాటుకుఈ ఒప్పందం వీలు కల్పించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బాలకృష్ణ ఎరాడీ నేతృత్వం లో ట్రిబ్యునల్ ఏర్పాటైంది. 1987లో ఈ ట్రైబ్యునల్ తన నివేదికను సమర్పించింది. ఈ నదీ జలాల్లో పంజాబ్కు 5ఎంఏఎఫ్, హర్యానాకు 3.83 ఎంఏఎఫ్నీటిని పంపిణీ చేయాలని ట్రైబ్యునల్ సిఫారసు చేసింది. అయితే ఈ ప్రాజెక్టు ఎంతకూ ముందుకు పోకపోవడంతో హర్యానా 1996లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కాల్వ పనులను పూర్తిచేయాలని 2002లో సుప్రీంకోర్టు పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించగా, 2004లో ఈ ఒప్పందాన్నే రద్దు చేస్తూ పంజాబ్ అసెంబ్లీ తీర్మానం చేసింది. దీని చట్టబద్ధతపై విచారించిన సుప్రీంకోర్టు, పంజాబ్ ప్రభుత్వం ముందుగా తాను అంగీకరించిన ఒప్పందం నుంచి పంజాబ్ పక్కకు తప్పు కోవడం రాజ్యాంగ విరుద్ధమని తీర్పు చెప్పింది. అంతేకాదు కేంద్రం మధ్యవర్తిత్వంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలు జరిపి ఎస్వైఎల్పై ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్దేశించింది. అయితే పంజాబ్ మాత్రం తమ నదీజలాలను పంచుకోవడానికి ఇష్టపడటంలేదు. ఇప్పటికే రాష్ట్రంలో భూగర్భ జలాలను విపరీ తంగా వినియోగిస్తున్న నేపథ్యంలో 2029 తర్వాత క్షామ పరిస్థితులు నెలకొంటాయని పంజాబ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ముఖ్యంగా రిజర్వాయర్లలో నీటి మట్టాలు కూడా గతంలో మాదిరి కాకుండా తగ్గిపోతుండటం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోం ది. ఇప్పటికే రాష్ట్రంలోని 79శాతం భూభాగంలోని నీటిని విపరీతంగా వినియోగిస్తున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాలతో నీటిని పంచుకునే అవకాశం లేదని పంజాబ్ ప్రభుత్వం స్పష్టం చేస్తున్నది. అయితే హర్యానా మా త్రం తమకు రావలసిన న్యాయమైన వాటా నీటిని కూడా పంజాబ్ విని యోగిస్తున్నదని ఆరోపిస్తోంది. తమ రాష్ట్రంలో భూగర్భ జలాలు 1700 అడుగుల కిందికి పడిపోయిన నేపథ్యంలో, దక్షిణ ప్రాంతంలో తాగునీటికే ఇబ్బందులు ఏర్పడుతున్నాయని హర్యానా పేర్కొంటున్నది. ఈ నేప థ్యంలో ట్రైబ్యునల్ తమ వాటాగా పేర్కొన్న నీటిని అందించాల్సిందేనని స్పష్టం చేస్తోంది. ఈవి ధంగా రెండు రాష్ట్రాల మధ్య ఎస్వైఎల్ ఒక రావణకాష్టంగా మారింది.
కోర్టు ఆదేశంతో రగడ మొదలు
అసలు పంజాబ్లో ఎస్వైఎల్కు సంబంధించి భూసేకరణ, సర్వే ఎంతవవరకు వచ్చాయో తెలుసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు గత అక్టోబర్ 4న అదేశించింది. కోర్టు ఆదేశించిన మరునాడే, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఒక ప్రకటన చేస్తూ ‘హర్యానాతో నీటి పంపకం ఒప్పందం తమకు లేనందువల్ల ఈ కాల్వ నిర్మాణం చేపట్టే ప్రసక్తే లేదు’ అని కుండబద్దలు కొట్టారు. అప్పటి హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అసలు సమస్యపై ఆయనకు అవగాహన లేదంటూ దెప్పి పొడిచా రు. ఈ విషయంలో హర్యానా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం వున్నదన్నారు. అయితే పంజాబ్లోని పార్టీల వైఖరి మాత్రం కాల్వ నిర్మాణానికి వ్యతిరేకంగానే వుంది. కాల్వ నిర్మాణం ద్వారా హర్యానాతో నీటిని పంచుకోవడమంటే పంజాబ్ రైతులను ఆత్మహత్యలకు పురికొల్పడమేనని కాంగ్రెస్, శిరోమణి అకాళీదళ్ వంటి విపక్ష పార్టీలు పేర్కొంటున్నాయి. ఏతావాతా చెప్పాలంటే సరిహద్దు రాష్ట్రాల్లో ఈవిధంగా నీటి జగడాలు కొనసాగడం వర్తమాన ఉద్రిక్త పరిస్థితుల్లో ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. సింధూ జలాల ఒప్పందం రద్దు నేపథ్యంలో ఈ నదీ జలాలకు చెందిన చుక్క నీరు కూడా పాకిస్తాన్లోకి వెళ్లకూడదనేది కేంద్రం ఉద్దేశం కాగా, పట్టువిడుపులు ప్రదర్శించకుండా పంజాబ్లోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం వ్యవహరించడం ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే హర్యానాకు నదీ జలాల విడుదలకు కేంద్రం ఆదే శించాల్సి వచ్చిందనుకోవచ్చు.