Collector Urges Mosquito Control Measures
వ్యాధుల నియంత్రణలో భాగంగా దోమల వృద్ధిని అరికట్టాలి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
వ్యాధుల నియంత్రణలో భాగంగా దోమల వృద్ధిని అరికట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసన కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. అనిత,జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్,డిప్యూటీ మేయర్ సల్లా రమ్య, ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు డా.వేదవ్యాస్, టి-హబ్ ప్రతినిధి డా.శిల్ప లతో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 16 నుండి మే 15 వరకు జిల్లాలో వెక్టర్-బోర్న్ వ్యాధుల నివారణకు ప్రాధాన్యత ఇవ్వాలని,దోమలు, టిక్స్,ఫ్లీలు ద్వారా వ్యాప్తి చెందే మలేరియా,డెంగ్యూ,ఫైలేరియా వంటి వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి నివారించేందుకు వైద్య శాఖ ముందుండి చర్యలు చేపట్టాలని తెలిపారు.జిల్లా, మండల స్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సరిపడా నిధులు అందుబాటులో ఉన్నాయని,సరైన విధంగా వినియోగించాల్సిన అవసరం ఉందని తెలిపారు.గ్రామాలు, పట్టణాలలో గుంతలు పూడ్చడం, మురుగు కాలువలు శుభ్రపరచడం,నిల్వ నీరు తొలగించడం వంటి పనులు క్రమం తప్పకుండా చేపట్టాలని,సిబ్బంది తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కార్మికులను వినియోగించి పనులను కొనసాగించాలని తెలిపారు.ప్రభుత్వ విద్యా సంస్థలు,సంక్షేమ వసతి గృహాలలో ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలు చేపట్టి,నెలవారీ ప్రణాళికను అమలు చేయాలని తెలిపారు.జూన్ 12న విద్యా సంవత్సరం పునఃప్రారంభమయ్యే నేపథ్యంలో పాఠశాలలలో 2-3 రోజుల ముందు శుభ్రపరిచే పనులు పూర్తి చేయాలని, విద్యార్థులకు అందించే ఆహారం పరిశుభ్రంగా ఉండేలా చూడాలని తెలిపారు.రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని దోమల నివారణ చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా నిల్వ నీరు ఉండకుండా చర్యలు తీసుకోవాలని,జూన్ 5వ తేదీ నుండి 15వ తేదీ వరకు మరొక దశలో వైద్య శాఖ చర్యలు కొనసాగించాలని తెలిపారు.జిల్లాలో మందులు, ద్రావణాలు,పడకలు సమృద్ధిగా ఉన్నాయని, మండల స్థాయిలో సిబ్బంది రోగులకు తగిన సేవలు అందించాలని ఆదేశించారు.ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు,ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలోని గ్రామాలలో నెల రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, కీటక దళిత వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టడం, దోమల వృద్ధిని అరికట్టడం, దోమల ద్వారా వచ్చే వ్యాధులను నియంత్రించడం కొరకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే పాఠశాలలలో దోమల మందు పిచికారి చేయాలని తెలిపారు.నివాసాలలో దోమతెరలు,ఇంటి కిటికీలకు జాలీలు వాడటం,ఇంటి ఆవరణలో,నీళ్ళకుండీలు, బావుల వద్ద పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.బోదకాలు నివారణకు జిల్లాలో సంవత్సరానికి ఒక మోతాదు డిఇసి మాత్రలు వాడడం వ్యాధిగ్రస్తులకు ఉపశమనం కలిగిస్తుందని, జిల్లాలో కీటక జనతా వ్యాధులు వ్యాపించకుండా చర్యలు చేపట్టడంలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.జిల్లాలోని తెలంగాణ డయాగ్నొస్టిక్స్ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు జిల్లాలో వైద్య శిబిరమును ఏర్పాటు చేసి వ్యాధిగ్రస్తులను గుర్తించి తగు వైద్య చికిత్స అందించాలని తెలిపారు.వేసవి అయినందున వడదెబ్బ తగలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, తెలిపారు.మధ్యాహ్నము 12 గంటల నుండి 4 గంటల మధ్యలో ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ఆ సమయంలో ప్రజలు బయటకు రాకుండా ఉండేలా వివరించాలని, అన్ని గ్రామాలలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచడం జరిగినదని తెలిపారు.ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు గొడుగు, తెల్లటి నూలు వదులు దుస్తులు ధరించాలని,తలపై టోపీ, రుమాలు ధరించాలని తెలిపారు.ఉదయం 11 గంటల లోపు సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే ఆరు బయట పని చేసుకోవాలని.వడదెబ్బ తగిలిన వ్యక్తిని చల్లని గాలి ఉన్న నీడ ప్రదేశానికి చేర్చాలని, 108 ద్వారా ఆసుపత్రికి తరలించాలని తెలిపారు.విధులలో నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.అనంతరం కార్యక్రమాల సంబంధిత గోడ ప్రతులను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో డిపిఓ ప్రశాంతి,సబ్ యూనిట్ అధికారి సిహెచ్ వెంకటేశ్వర్లు, ఎం.టి.ఎస్. శ్రీనివాస్,కిరణ్, ఆర్ఎస్ పద్మ వసుమతి,జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్,సిబ్బంది పాల్గొన్నారు.
