Ambedkar Statue Unveiled in Modampalli
మోదంపల్లిలో.. ఘనంగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ
జడ్చర్ల/ నేటి ధాత్రి.
జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని మోదంపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మంగళవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విగ్రహానికి పూలమాలలు అర్పించి, అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలు సమాజానికి ఎల్లప్పుడూ మార్గదర్శకమని, సమానత్వం, సామాజిక న్యాయం, విద్యాభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. యువత అంబేద్కర్ బాటలో నడిచి సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు.
