AIFTU Backs RTC Workers’ Strike
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఏఐఎఫ్టియు సంపూర్ణ మద్దతు
మంచిర్యాల నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన న్యాయమైన సమ్మెకు ఏఐఎస్టియు సంపూర్ణ మద్దతు తెలుపుతుందని రాష్ట్ర కార్యదర్శి ఎం.పోషమల్లు తెలిపారు.రాష్ట్రంలో సుమారు 7,000 బస్సులు నడుస్తుండగా,ఎలక్ట్రిక్ బస్సులు ప్రైవేట్ సంస్థ జేబీఎం ఆధీనంలో నడుస్తున్నాయి అని అన్నారు.మరోవైపు,ఆర్టీసీ కార్మికులకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి చెల్లించాల్సిన పిఆర్సి ని గత పది సంవత్సరాలుగా అమలు చేయలేదన్నారు.రెండు దఫాలుగా చెల్లించాల్సిన పిఅర్సి ని ఇప్పటికీ ఇవ్వకుండా,గత నాలుగు నెలలుగా కార్మికులతో ఎలాంటి చర్చలు జరపకపోవడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుందన్నారు.కార్మికులు కనీసం ఒక దఫా అయినా పిఆర్సి అమలు చేయాలని నిరంతరం విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ,ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకర విషయం అని అన్నారు.మహిళల కోసం మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం,దానికి తగిన విధంగా బస్సుల సంఖ్య పెంచడంలో మాత్రం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందని వారు వాపోయారు.కార్మికుల ప్రధాన డిమాండ్లు,ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలి
డ్రైవర్లు,కండక్టర్లకు విశ్రాంతి గదులు,మూత్రశాలలు ఏర్పాటు చేయాలి,ఆర్టీసీ కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి
పెండింగ్లో ఉన్న పిఆర్సి ని తక్షణమే అమలు చేయాలి
ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకుండా కాంట్రాక్ట్ డ్రైవర్లు,కండక్టర్ల కోసం ప్రకటనలు ఇవ్వడం అనైతిక చర్య అని ధ్వజమెత్తారు.ఇది కేవలం కార్మికుల సమ్మెను బలహీనపరచడానికి చేసే ప్రయత్నం అని దీనిని పూర్తిగా ఖండిస్తున్నామని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకుని ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించి, సమ్మెను ముగించే దిశగా చర్యలు తీసుకోవాలని ఏఐఎఫ్టీయు డిమాండ్ చేస్తున్నది తెలిపారు.
