టిజి పాలిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహణ పై సమీక్ష
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):
జిల్లాలో మే 13న సజావుగా టిజి పాలిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో టిజి పాలిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహణ పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ,పాలిటెక్నిక్ డిప్లమా కోర్సులలో ప్రవేశాల నిమిత్తం మే 13న ఉదయం 11 గంటల నుంచి 1.30 వరకు జరిగే టీజీ పాలిసెట్ ప్రవేశ పరీక్ష సజావుగా నిర్వహించేందుకు అవసరమైన సకల ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల జిల్లాలో మొత్తం 2136 మంది విద్యార్థులు టిజి పాలిసెట్ ప్రవేశ పరీక్ష రాస్తున్నారని, వీరి కోసం 7 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో సిసి టివి కేమేరా తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రశ్నా పత్రాల తరలింపు అవసరమైన బందోబస్తు కల్పించాలని అన్నారు.పరీక్షా సమయంలో పరీక్ష కేంద్రాల వద్ద కరెంట్ కోతలు ఉండవద్దని అన్నారు. విద్యార్థులకు అవసరమైన రూట్ లలో బస్సులు నడిచేలా చూడాలని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్, ఓఆర్ఎస్ ప్యాకేట్లతో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో సిరిసిల్ల రెవెన్యూ డివిజన్ అధికారీ వెంకటేశ్వర్లు, అదనపు ఎస్పీ చంద్రయ్య,పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకరాచారి, జిల్లా వైద్యాధికారి డా.రజిత, సెస్, ఆర్.టి.సి, విద్యా, మున్సిపల్ శాఖల అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.