మహిళ మృతి కేసు నిందితుడు అరెస్ట్….
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్ లో మహిళను హత్య చేసిన నిందితుడు పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో పత్రిక ప్రకటన లో డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. సత్యారం రమేశ్ అనే వ్యక్తి చిలమామిడి గ్రామానికి చెందిన మ్యాతరి లక్ష్మితో సహజీవనంచేస్తున్నాడు. అయితే, అతని ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో లక్ష్మి అతనికి దూరమైంది. కోపోద్రిక్తుడైన రమేశ్, తొలుత ఆమెపై పెట్రోల్ పోసి దాడి చేయడానికి ప్రయత్నించగా, స్థానికుల కారణంగా అది విఫలమైంది. తర్వాత, ఆమె ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకొని, ఖాళీ గ్యాస్ సిలిండర్తో తలపై కొట్టి ఆమెను హత్య చేశాడు. అనంతరం మృతురాలి సెల్ఫోన్ తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. జహీరాబాద్ బస్టాండ్ వద్ద హైదరాబాద్కు పారిపోడానికి ప్రయత్నిస్తుండగా, పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నిందితుడిని త్వరగా పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని, సమర్థవంతంగా చర్యలు తీసుకుని అతడిని అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరిచామని తెలిపారు. ఈ ఆపరేషన్ పాల్గొన్న పోలీసు అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శివలింగం, ఎస్పై కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.