
పట్టించుకోని మున్సిపల్ పాలకవర్గం, పోలీసు యంత్రాంగం…
దిద్దుబాటు చర్యలకై సామాజిక కార్యకర్త షేక్ సాబిర్ అలి డిమాండ్.
జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి:
పశువులతో పరేషాన్… పట్టించుకోని మున్సిపల్ పాలకవర్గం, పోలీస్ యంత్రాంగం. దిద్దుబాటూ చర్యలకై సామాజిక కార్యకర్త షేక్ సాబీర్ అలీ ఒక ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. జమ్మికుంట పట్టణ రద్దీ ప్రాంతాల్లో… ప్రధాన కూడళ్లలో సంచరిస్తున్న పశువులతో వాహనదారులు మరియు పట్టణ ప్రజలు పరేషాన్ అవుతున్నారన్నారు. ప్రధానంగా గాంధీ చౌరస్తా, రైల్వే స్టేషన్ రోడ్, బస్టాండ్ రోడ్లలో పశువులు గుంపులు-గుంపులు గా తిష్ట వేసుకుని ఉండి ట్రాఫిక్ నకు ఇబ్బందులు కల్పిస్తూ.. వాహనదారుల ప్రమాదాలకు కారణం అవుతూ ప్రజలకు ఇబ్బందులు కల్పిస్తున్నాయన్నారు.ఈ వర్షాకాలం సందర్భాల్లో ప్రమాదం బారిన పడకుండా వాహనదారులే వాటిని పక్కకు తరలించి ప్రయాణం కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. వీటిని నియంత్రించాల్సిన మున్సిపల్ సిబ్బంది కానీ.. ట్రాఫిక్ ను నియంత్రించాల్సిన పోలీస్ సిబ్బంది కానీ ఈ దిశగా చర్యలు చేపట్టకపోగా బదులుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తూన్నానని చెప్పారు. కావున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పశువులను గోశాలకు తరలించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.