సానుభూతి రాజకీయాలు మాకొద్దు!

 

కడిగిన ముత్యంలా కవిత బైటకొస్తుంది చూడు.

ఆడంబరాలు బీఆర్‌ఎస్‌కు అవసరం లేదు.

తెలంగాణ గుండెల్లో కేసీఆరే వున్నాడు.

ఆరోపణలు ఎదుర్కొవడం కొత్త కాదు.

వాటిని ఎదిరించి నిలబడతాం ఏనాడు? ఆ తెగువే తెలంగాణ తెచ్చింది ఆనాడు.

తెగింపు బీఆర్‌ఎస్‌ కు మాత్రమే సొంతం.

పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను కోరుకోవడం ఖాయం.

ఇప్పుడున్న పరిస్ధితుల్లో సానుభూతి రాజకీయాలు కేసిఆర్‌కు అవసరంలేదు. రాజకీయంగా ఆయన మేరు పర్వతం. ఉద్యమ శ్రీకారంలో ఎవరెస్టు శిఖరం. ఆయనతో పోటీ పడడం అంటే కైలాసంతో పుంజీతం ఆడడం. ఈ సంగతి తెలియక కొందరు ఎగిరెగిరి పడుతున్నారు. కొందరు స్వార్ధపరులు తమ దారి తాము చూసుకుంటున్నారు. శత్రుపక్షం చేరి, చరిత్ర హీనులుగా మిగిలిపోతున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుతో బిఆర్‌ఎస్‌ ప్రజలనుంచి స్పందన కరువైందని కొందరు..కవిత అరెస్టును పాపమంటున్నవారు లేరంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలు నీతిమాలినవి. బిఆర్‌ఎస్‌ అనేది ఉద్యమ పార్టీ. కేసిఆర్‌ అనే నాయకుడు పోరాటాల వీరుడు. ఆయన కవిత అరెస్టు లాంటి అంశాలను సానుభూతిగా మల్చుకొని రాజకీయాలు చేస్తానుకోడం వారి అజ్ఞానం. ధైర్యం నేర్పిన ఏ తండ్రి పిల్లలకు పిరికి మందు పేరు కూడా చెప్పడు. దాని వాసన కూడా తెలియనీయడు. అందుకే కవితకు అంతధైర్యం. చెక్కు చెదరని మనోనిబ్బరం. కేసిఆర్‌ ఉక్కు సంకల్పం నుంచి పాఠాలు నేర్చుకున్న కవితను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలని బిజేపి చూస్తోంది. దాన్ని అలుసుగా తీసుకొని శిఖండి రాజకీయాల కోసం కాంగ్రెస్‌ పాకులాడుతుంది. ఆరోపణలు, నిందలు కేసిఆర్‌ కుటుంబానికి కొత్త కాదు. కాకపోతే ఇప్పుడు బిజేపి రూపంలో అణచివేత కనిపిస్తోంది. బిఆర్‌ఎస్‌ను నిలబడకుండా చేయాలని చూస్తోంది. కాని బిఆర్‌ఎస్‌ ప్రజల పార్టీ. బిఆర్‌ఎస్‌ తెలంగాణ ఆత్మ పార్టీ. బిఆర్‌ఎస్‌ తెలంగాణ ఆత్మగౌరవాన్ని నింపుకున్న పార్టీ. కేసిఆర్‌ తెలంగాణ సాధించిన నాయకుడు. తెలంగాణ కోసం పరితపించి, ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాటం చేసిన నాయకుడు. అలాంటి నాయకుడు తన ఉద్యమ పోరాట రాజకీయ జీవితంలో అనేక డక్కామొక్కీలు తిన్నారు. కవిత కూడా ఉద్యమ కాలంలో అనేక నిర్భంధాలను ఎదుర్కొన్నారు. అలాంటి కవిత మీద ఆరోపణలను తెలంగాణ సమాజం నమ్మదు. బిజేపి నిందలను లెక్క చేయదు. ఏనాటికైనా తెలంగాణకు దశ…దిశ కేసిఆరే…అందుకే బిజేపి కక్ష కట్టింది. కేసిఆర్‌ను ఆత్మరక్షణలో పడేయాలని చూసింది. కాని కేసిఆర్‌ ఉక్కు గుండె..అది ఎండకు, వానకు, నిర్భంధాలకు తట్టుకొని నిలబడిరది. చిన్న చిన్న నిందలకు భయపడేది కాదు. కవిత ఎలాంటి తప్పు చేయలేదని అందరకీ తెలుసు. ఆ నమ్మకమే కేసిఆర్‌ మౌనానికి నిదర్శం. ఇప్పటికే కేసిఆర్‌ నాయకత్వాన్ని వదులకొని తెలంగాణ సమాజం చింతిస్తోంది. రామ రాజ్యం లాంటి పాలన కాదనుకొని, తిప్పలు కొని తెచ్చుకున్నామని మధనపడుతోంది. అందుకే పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ప్రభంజన ఖాయం. మళ్లీ కేసిఆర్‌ పునరాగమనం తధ్యం.

నిన్నటిదాకా కారు ఎక్కేవారే తప్ప, దిగేవారు కనిపించలేదు. కారు నిండినా చిన్న చోటు దొరక్కపోదా? కనీసం నీడ దొరికినా సరిపెట్టుకుంటామనుకున్నారు. కేసిఆర్‌ కరణ చాలనుకున్నారు. ఫక్తు రాజకీయ పార్టీ మాది అని కేసిఆర్‌ తలుపులు తెరిచి కాంగ్రెస్‌, బిజేపిలను ఖాళీ చేశాడు. అయితే కాలం కలిసి రాకపోతే కారు ఖాళీ అవుతుందని కేసిఆర్‌కు కూడా తెలుసు. అందుకే కేసిఆర్‌ కారు దిగుతున్న వారిని చూసి ఆందోళన చెందడం లేదు. పైకి ఎన్ని ప్రచారాలు జరిగినా కేసిఆర్‌ గుండెధైర్యం పెద్దది. అది చాల మందికి తెలియనంత గట్టిది. ఉద్యమ కాలంలోనే టిఆర్‌ఎస్‌ గుడారాన్ని లేపాలని ఎంతో మంది ప్రయత్నం చేశారు. పార్టీని అల్లకల్లోలం చేయాలని చూశారు. పార్టీని చిల్లం చిల్లం చేయాలని ప్రయత్నం చేశారు. నాయకులను ప్రలోభాలకు గురి చేసి లాగేసుకున్నారు. కేసిఆర్‌ను ఒంటరి చేయాలనుకున్నారు. కాని కుదరలేదు. వైఎస్‌. రాజశేఖరరెడ్డి లాంటి వారు కేసిఆర్‌ను ఎన్నొ రకాలుగా దెబ్బకొట్టాలని చూశారు. కాని కుదరలేదు. కేసిఆర్‌ రూపంలో తెలంగాణ సమాజంలో ఒక్కసారిగా కదలిక వచ్చింది. జనం మళ్లీ తెలంగాణ అన్న పదం సమాజనికి జపమైంది. కేసిఆర్‌ రూపంలో ఒక కొత్త శక్తి వచ్చినంత బలమొచ్చింది. కేసిఆర్‌ రూపంలో ప్రభంజనం లాంటి ఉద్యమం, ఉప్పెన లాంటి పోరాటం వస్తుందని ఎవరూ ఊహించలేదు. కాని కేసిఆర్‌కు తెలుసు. తెలంగాణ ఎలా తెచ్చుకోవాలో తెలుసు. ఉద్యమాన్ని ఎలా రచించాలో తెలుసు. ఉద్యమాన్ని ఎలా ఉరలెత్తించాలో తెలుసు. తెలంగాణ సమాజాన్ని ఎలా కదిలించాలో తెలుసు. తెలంగాణలో వున్న చైతన్యాన్ని ఎలా ప్రేరేపించాలో తెలుసు. తెలంగాణ భావజాలాన్ని ఎలా ప్రపంచానికి చాటాలో తెలుసు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఎలా ప్రతిధ్వనించేలా చేయాలో తెలుసు. దిక్కులు పిక్కటిల్లేలా తెలంగాణ నినాదాన్ని నినదించాలో ఆయనకు మాత్రమే తెలుసు. అందుకే తెలంగాణ వచ్చింది. తెలంగాణ స్వరాష్ట్రమై స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నది. పద్నాలుగేళ్లపాటు తెలంగాణ వాదాన్ని నమ్మి, ప్రజల కోసం తన జీవితం త్యాగం చేసిన నాయకుడు కేసిఆర్‌.
కారులో ఇంత కాలం ప్రయాణం చేసిన స్వార్ధపరులకు కృతజ్ఞత లేదు. అందుకే వెళ్లిపోతున్నారు. తెలంగాణ ఉద్యమంలో లేని నాయకులు రాజకీయంగా ఆదరణ కోసం, నీడ కోసం కారు పంచన చేరిన వాళ్లు వెళ్లిపోతున్నారంటే ఒక అర్ధముంది. ఎందుకంటే వాళ్లు ఎప్పుడూ కాని వాళ్లే..అవకాశవాదులే..కాని పద్నాలుగేళ్లు కేసిఆర్‌తో ఉద్యమంలో, తర్వాత ప్రభుత్వంలో పదవులు అనుభవించిన వారు కూడా వెళ్లిపోవడం అన్నది దుర్మార్గం. ఉద్యమ కాలంలో కేసిఆర్‌ వెంట ఏ పదవులు ఆశించి నడిచామంటూ కొంత మంది కొత్త భాష్యాలు చెబుతున్నారు. ఆనాడు ఉద్యమంలో లేకపోతే, కాంగ్రెస్‌లో కార్యకర్తలుగా కూడా గుర్తింపు వుండేది కాదు. నాడు కేసిఆర్‌ వెనక నడిచినందువల్లే ఈ రోజు కాంగ్రెస్‌ మళ్లీ చెంతకు చేర్చుకుంటుంది. అది తెలుసుకోలేక, తాత్కాలిక రాజకీయ అవసరాల కోసం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దుతున్నారు. పరాయి పంచన చేరి ఎంగిలి మెతుకులు తినేందుకు అర్రులు చాచుతున్నారు. చెరువులో నీళ్లు నిళ్లు నిండినప్పుడు వచ్చి చేరే కప్పలుగా వచ్చారు. చెరువు ఎండిపోయిందని వదిలేసి వెళ్తున్నారు. ఇలాంటి స్వార్ధపరులే తెలంగాణను నాశనంచేసేది. నిలబెట్టిన తెలంగాణలో కూడా స్వార్ధ రాజకీయాలు ఇంకా పోలేదంటే కేసిఆర్‌ నాయకత్వం ఇంకా చాలా కాలం పాటు కావాలి. తెలంగాణలో స్వార్ధపూరిత శక్తులకు జనంలో స్ధానం లేకుండా కావాలి. నమ్మకం వదిలేసే నాయకులను ప్రజలు పక్కనపెట్టే రోజులు రావాలి.

రాజకీయాల్లో నైతికత పెరగాలి. అందుకు అలాంటి రోజులు మళ్లీ కేసిఆర్‌తోనే రావాలి. ఒకనాడు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడేందుకు ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు. తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలకు తెలంగాణ రావాలనే వుండేది. తమ ప్రాంతం బాగుపడాలన్న కోరిక బలంగానే వుండేది కాని నోరు మెదపలేకపోయేవారు. తమ వాణి వినించేవారు కాకపోయే వారు. కేసిఆర్‌ తర్వాతే తెలంగాణ వాదానికి ఊపిరి వచ్చింది. ఉరకలెత్తే ఉద్వేగం పురుడుపోసుకున్నది. ఎవరిని కదిలించినా తెలంగాణ నాదం వినిపించింది. ఎవరు గొంతెత్తినా తెలంగాణ వాదం బలంగా వినపడిరది. అయినా ఆనాటి కాంగ్రెస్‌ నేతలు, తెలుగుదేశం నేతలు నోరు మెదిపేందుకు కూడా భయపడేవారు. తమ రాజకీయ భవిష్యత్తు కోసమే ఆలోచించేవారు. ప్రజలకు వున్నంత స్వేచ్ఛ నాయకుల్లో కనిపించేది కాదు. అలాంటి రాజకీయ సమాజానికి చైతన్యాన్ని నింపిందే కేసిఆర్‌. అలాంటి కేసిఆర్‌ను కట్టడి చేయాలనుకోవడం భ్రమ. తెలంగాణ వచ్చేదాకా పోరాటానికి విరామం లేదు. ఉద్యమాలు ఆగలేదు. పల్లెనుంచి పట్నం దాకా తెలంగాణ తప్ప మరో నినాదం లేదు. పార్లమెంటు కూడా కొన్ని సంవత్సరాల పాటు తెలంగాణ నినాదాలతోనే సాగింది. నాయకుడుగా ఒక్కడే మొదలుపెట్టి, రాజకీయంగా ఒంటరి పోరాటం చేసి, తెలంగాణ సమాజాన్ని ఏకం చేసిన కేసిఆర్‌, ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఒంటరి తనాన్ని అనుభవించాల్సి వస్తోంది. అయితే ఇది ఆయాచితంగా వచ్చిందా? లేక కేసిఆర్‌ చేసుకున్న స్వయం కృతాపధాధమా? లేక కావాలనే చేస్తున్నాడా? అన్నది కూడా చాల మందికి అవగాహన లేదు. ఒక గ్రద్ద తన జీవిత కాలాన్ని పెంచుకోవడానికి తన ముక్కును నేలకు కొట్టుకుంటుంది. తన ఈకలన్నీ తానే వదిలేసుకుంటుంది. ఎక్కడో అడవిలో కొంత కాలం తనను తాను హింసించుకుంటూ బతుకుతుంది. కొంత కాలానికి మళ్లీ అరిగిపోయిన ముక్కు స్ధానంలో కొత్త ముక్కు వస్తుంది. తొలగిన ఈకెల స్ధానంలో కొత్తవి వస్తాయి. కొత్త జీవితం మొదలౌతుంది. కేసిఆర్‌ నాయకత్వంలో మళ్లీ కొత్త చిగురు వస్తుంది. ఉగాదితో బిఆర్‌ఎస్‌లో కొత్త నీరు చేరుతుంది. కొత్త ఆశలతో కొంగొత్త ప్రయాణం మొదలౌతుది. కారు మళ్లీ తిరుగులేని, ఎదురులేని వేగం అందుకుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!