Stop Illegal Deductions in Paddy Procurement: BJP
‘తరుగు’, ‘తేమ’ పేరుతో అక్రమ కోతలను నిలిపివేయాలి
– కలెక్టర్ కార్యాలయంలో ఏఓకి వినతిపత్రం
– బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి
సిరిసిల్ల(నేటి ధాత్రి):
భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏ .ఓ కి జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న ధాన్యం కొనుగోలు సమస్యలపై వినతిపత్రం సమర్పించడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎంతో కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తున్నప్పటికీ, అక్కడ నెలకొన్న అవ్యవస్థ, సరైన మౌలిక వసతులలేమి, కొనుగోళ్లలో జాప్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత, కాంటాల కొరత, హమాలీల సమస్య, రవాణా సౌకర్యాల లోపం, ధాన్యం నిల్వచేసే స్థలాల లేమి కారణంగా రైతులు రోజుల తరబడి కేంద్రాల వద్దే నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అకాల వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.
అలాగే కొన్ని చోట్ల ‘తరుగు’, ‘తేమ’ పేరుతో రైతుల ధాన్యానికి అన్యాయంగా కోతలు విధిస్తున్నారని, మధ్యవర్తుల జోక్యం పెరిగి రైతులు తీవ్ర నష్టపోతున్నారని ఆరోపించారు. రైతు పండించిన పంటకు సరైన ధర, సమయానికి చెల్లింపులు అందేలా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
భారతీయ జనతా పార్టీ ప్రధాన డిమాండ్లు:
* జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో వెంటనే మౌలిక వసతులు కల్పించాలని కోరారు.
* ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.
* గన్నీ బ్యాగులు, హమాలీలు, రవాణా సదుపాయాలను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
* ‘తరుగు’, ‘తేమ’ పేరుతో జరుగుతున్న అక్రమ కోతలను నిలిపివేయాలని కోరారు.
* కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన చెల్లింపులు రైతుల ఖాతాల్లో వెంటనే జమ చేయాలని కోరారు.
* అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని రక్షించే చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని, లేనిపక్షంలో రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ మరింత తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేపట్టేందుకు వెనుకాడదని జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు లింగంపల్లి శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు, జిల్లా కార్యదర్శులు కర్నే హరీష, గొప్పడి సురేందర్రావు, నంద్యాడపు వెంకటేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కౌడిపల్లి గోపాల్ రెడ్డి, జిల్లా కోశాధికారి ఆసాని రామలింగారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బర్కం నవీన్ యాదవ్, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్, బిజెపి సీనియర్ నాయకులు అన్నాడి జలపతి రెడ్డి, రాజిరెడ్డి, గజబింకర్ చందు తదితరులు పాల్గొన్నారు.
