CM Revanth to Launch ₹100 Cr Works
యాదగిరిగుట్టలో రూ.100 కోట్ల అభివృద్ధి పనులకు ఈనెల 23న సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట టెంపుల్ సిటీ అభివృద్ధిలో భాగంగా సుమారు రూ.100 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఈ నెల 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 9:37 గంటలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న సీఎం వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో భాగంగా టెంపుల్ సిటీలో నిర్మించనున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వేద పాఠశాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా మరో నాలుగు అభివృద్ధి పనులకు కూడా ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సమాచారం. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి ఈ సందర్భంగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆధ్యాత్మిక, అభివృద్ధి కార్యక్రమాలు ఒకే వేదికపై జరగనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది.ఈ కార్యక్రమానికి భక్తులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆలయ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
