RTC Driver Death Sparks Outrage
వరంగల్ జిల్లా నర్సంపేట ఘటన విషాదాంతం
డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి
మృతికి కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
మంచిర్యాల,నేటి ధాత్రి:
నర్సంపేట డిపో ప్రాంగణంలో జరిగిన దుర్ఘటనలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మరణించడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.సుమారు 80 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న ఆయనకు మొదట వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స అందించారు.పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, అక్కడికి చేరుకున్న అనంతరం ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.ఈ ఘటనతో ఆర్టీసీ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది.కార్మికుల సమస్యల నేపథ్యంలో జరిగిన ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.కార్మిక సంఘాల ఆరోపణల ప్రకారం, 32 డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను గత నాలుగు నెలలుగా అధికారులకు సమర్పించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు పేర్కొన్నారు.ఈ నిర్లక్ష్యం కారణంగా కార్మికుల్లో అసంతృప్తి పెరిగి,సమ్మె పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.విప్లవ కార్మిక సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ,శంకర్ గౌడ్ మృతికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశాయి.అలాగే ఈ ఘటనకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.కార్మికులు ఆత్మహత్యల వంటి తీవ్ర నిర్ణయాలకు పోకుండా,హక్కుల సాధన కోసం సంఘటితంగా పోరాటం చేయాలని సంఘ నాయకులు పిలుపునిచ్చారు.భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సింగరేణి గని కార్మిక సంఘం ఎస్ జి కె ఎస్ నాయకులు అంబాల మహేందర్, టియుసిఐ నాయకులు గోగర్ల శంకర్, ఏఐఎఫ్టీయు నాయకులు ఎం.పోశమల్లు,టియుసిఐ బెల్లంపల్లి బాధ్యులు అడ్డూరి సంపత్ తదితరులు పాల్గొన్నారు.
