సాకులు మాని..క్షమాపణ వేడుకో!?

` తెలంగాణలో లేని కులచిచ్చులకు తెరతీయకు
` ఆదివాసీలలో చీలిక ఎవరితరం కాదు
` నీ సేవెంత..విరాళాలు వెనకేసుకొన్నదెంత?
` తెలంగాణలో చెట్టు, పుట్ట, పువ్వులకు కూడా పూజలు
` దేవుళ్లలో విభజనలు..ప్రత్యేక భజనలు లేవు?
` దేవుళ్లలో ఆధిపత్యాలు ఇంత వరకు తెలంగాణలో లేవు
` దళితులు కూడా వేధ పాఠశాలల్లో చదువుతున్నారు
` కాషాయం మాటున వ్యాపారానికి ఎవరూ అడ్డు చెప్పలేదు?
` దేవుళ్ల పేరుతో జనంలో చీలికలు తెస్తే చీరి చింతకు కడతారు?
` జిత్తుల మారి వేషాలు, మత చిచ్చులు చాలించుకో 

హైదరాబాద్‌ , నేటిధాత్రి :
కలం పట్టిందేనాడు లేకపోయినా కాషాయం దరిస్తే చాలు. పుస్తకం పట్టకపోయినా పురాణాలు వల్లె వేసినట్లు మాట్లాడితే చాలు. బడిబాట సరిగ్గా పట్టకపోయినా సరేకబతుకు పాఠాలు చెప్పడం వస్తే చాలు. హైందవ సమాజంలో మోసగాళ్లకు సమాజంలో పేరు… ప్రఖ్యాతులు…హారతులు, ఆహ్వానాలు…పెద్దరికాలు..పేరంటాలు…పూజలు,పునస్కారాలు…దీవెనలకోసం సాష్టాంగ నమస్కారాలు….విరాళాలు..అభిమానులు…అనుచరులు….సమూహాలు…సంఘాలు..మఠాలు, పీఠాలు….దైవాంశసంబూతులంటూ భజనలు, కొబ్బరి కాయలు……ఏళ్లకేళ్లు వేధాలు నేర్చుకున్నవారు కూడా ఇలాంటి వాళ్ల ముందు పనికిరారు. వాళ్లసలు వెలుగులోకే రారు. ఎక్కడో ఏ గుడిలోనో నెల జీతంతో బతుకుతుంటారు. నాలుగు శుభకార్యాలు చేస్తే వచ్చే సంభావనతో కాలం గడిపేస్తుంటారు. కాని కాశాయం వంటి మీద వేసుకుకొని, కషాయపు మాటలు కలగాపలం చేస్తే చాలు ప్రచారానికి ప్రచారాలు. వివాదాలకు వివాదాలు…అదే సమాజంలో గుర్తింపులు గుడులు, మనులు…మాన్యాలు..స్ధలాలు, భవంతులు, ఆశ్రమాలు…మాటకు మాట పెంచుకుంటూ పోతే అదే వేధికలు. ఇంకేముందు జనం దృష్టింతా వారిపైనా..ధ్యాసంతా వారి జపంలోనే..నాలుగు వెకిలి నవ్వులు నవ్వి, తనకంటే ఎవరూ ఎక్కువ కాదన్నట్లు పల్లికిలిస్తే అదే స్వామీగా గుర్తింపు…ఇంకేముంది సంపాదనకు సంపాదన..దనార్జనకు ధనార్జన. లెక్కా పత్రం ఏదీ అసవరంలేదు. వారి పేరు మీద బ్యాంకు అకౌంట్లు లేకుంటేనే మరీ మేలు….చెప్పుకోవడానికి, తప్పించుకోవడానికి ఎంతో పనికొస్తుంది. అయినా ఇంత వరకు కూడా బాగానే వుంటుంది. కాని సమాజంలో కులం పేరు చెప్పి కుంపట్లు పెట్టడం అన్యాయం. మతం పేరు చెప్పి మత్తును కల్పించడం పాపం. రెండూ కలగాపులంగం చేసి చిచ్చు రేపడం నేరం. దాన్ని సహిస్తూ పోవడం కూడా సమాజంలో పెద్ద లోపం.
మనకు సంస్కృతీ సంప్రదాయాలు ఒకరు మనకు నేర్పించాలా? చరిత్రలో క్రీపూ ఐదు శతాబ్ధాలకు ముందే దేశంలో జైన, బౌద్ద మతాలు వెలిశాయి. తర్వాత ఇస్లాం, కిస్టియన్‌ మతాలు ప్రవేశించాయి. బౌద్దం పుట్టిన మన దేశంలోనే దాని ఆనవాలు చెప్పుకోవడానికి మిగల్లేదు. జైనం కనిపించినా హిందూ సమాజంలో బాగమే అంటున్నాము. ఇక మిగతా రెండు మతాలు కూడా ప్రపంచమంతా విస్తరించినా మన దేశంలో పెద్దగా ప్రభావం చూపలేదు. క్రీశ.726లోనే మన దేశంపై మొదటి సారి అరబ్బుల దాడి మొదలైంది. ఆ తర్వాత వచ్చిన సుల్తానులు, లోడీలు, తుక్లలు, ఖిల్జీలు, లోడీలు, మొగలలు ఇలా మన దేశాన్ని పాలించారు. వారంతా ముస్లింలే. అంత దాకా ఎందుకు మన తెలంగాణలో 1948 సెప్టెంబర్‌ 17 వరకు కూడా పాలన చేసింది ముస్లింలే. కాని నాడైనా, నేడైనా నూటికి 80శాతం మంది హిందువులే….ఎంత మంది పరాయి పాలకులొచ్చినా హైందవ సంస్కృతిని నాశనం చేసింది లేదు. కొత్తగా ఎవరూ సమానత్వం గురించి, మానవత్వం గురించి కొత్తగా చెప్పాల్సిన అసవరం లేదు. కాని కొంత మంది సమాజోద్దరణ, సంస్కృతి పరిరక్షణ పేరుతో కషాయం ధరించి నామాల పేరుతో పంగనామాలు పెట్టడానికి, సమాజాన్ని రెండుగా చీల్చడానికి భయలుదేరుతున్నారు. నోరుంది కదా! అని ఏది పడితే అది మాట్లాడొచ్చన్న అహంభావంలో వున్న కొంత మంది చిన్న జీయర్‌ లాంటివారు తమను తాము అధికంగా ఊహించుకున్నప్పుడే సమాజంలో కొన్ని ఇబ్బంది కరమైన పరిస్ధితులు ఎదురౌతున్నాయి.


కుడి చేతితో చేసిన సాయం ఎడమ చేతికి తెలియకుండా వుండాలన్నది పురాణాలు చెప్పిన మాట. ఆ మాట చిన్న జీయరుడికి తెలుసా? తెలంగాణలోనే, దేశంలో అనేక ఆశ్రమాలున్నాయి. అనాధలైన పిల్లలను చేరదీస్తున్నాయి. కొన్ని లక్షల మందికి సేవ చేస్తున్న సంస్థలున్నాయి. కొంత కాలం క్రితం వరకు ఆంధ్రప్రదేశ్‌లో సత్యసాయి బాబా సేవలంటే అవి. ఆయన బతికున్నంత కాలం ఏనాడు కులాల ప్రస్తావన రాలేదు. మతాల ప్రస్తావన తేలేదు. హైందవ సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపజేశాడు. హిందూ మత గొప్పదానాన్ని మాత్రమే వివరించాడు. దేశ, విదేశాలన్న భేధం చూపలేదు. విద్వేశాలకు తావు లేకుండా ప్రవచనాలు చెప్పే వారు. ప్రభుత్వాల నుంచి కాని పనిని ఆయన చేసి చూపించారు. అనంత పురం మొత్తానికి ఆ రోజుల్లోనే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇంటింటికీ మంచినీళ్లందిచాడు. ఉమ్మడి రాష్ట్రమే కాదు, ఇప్పటికీ గుండె ఆపరేషన్ల విషయంలో ముందు గుర్తొచ్చేది సత్య సాయిబాబా ఆశ్రమం. అక్కడ వైద్యాలయం…ఆయన చేసినసేవలకు దేశమంతా ప్రశంసించింది. ప్రపంచం కొనియాడిరది. ఎంతో మంది విదేశీలు కూడా హిందుత్వం స్వీకరించేలా చేసింది. వారంతా వారి వారి దేశంలో కూడా హైందవ సంస్కృతిని ఫరిడమిల్లేలా చేసింది. అందుకే మనమంతా ఆయన్ను దైవంగా కొలిచింది. అంతే కాని ఆయన నామాల గురించి, నాటకాల గురించి, కులాల గురించి చెప్పలేదు. ఆ బేధాలు ఏనాడు చూపలేదు. ప్రజలనుంచి వచ్చిన విరాళాలతో ఆయన ప్రజా సేవ చేశారు. పేదలను ఆదుకున్నాడు. ఆరోగ్యాలు కాపాడాడు. అంతే కాని చినజీయర్‌లాగా విగ్రహాల పేరుతో వందల కోట్లు ఖర్చు చేయలేదు. గుడులు నిర్మించి వ్యాపారం చేయలేదు. ఆశ్రమాలకు టిక్కెట్లు ఏర్పాటు చేయలేదు.
సమ్మక్క సారక్క బ్రహ్మలోకం నుంచి ఊడిపడ్డారా? అంటావా ఎంత ధైర్యం. ఎంత అహంభావం. వాళ్లేమైనా దేవుళ్లా..కాదా..అని నువ్వెలా డిసైడ్‌ చేస్తావు? అలా అనడానికి నీకు వున్న అర్హతేమిటి? దాంతోపాటు కులాలుండాలా? సమతా మూర్తిగా పిలువబడుతున్న రామానుజాచార్యులు సమాజంలో అందరూ సమానమే అన్నప్పుడు కులాలెందుకు? వాటి అడ్డుగోడలెందుకు? ఆధిపత్యాలెందుకు? అణగారిన వర్గాలన్న మాటలెందుకు? వారిని పై ఈ చిన్న చూపులెందుకు? కుల రహిత సమాజం కోసం ప్రజాస్వామిక వాదులు, మేధావులు కృషి చేస్తుంటే తప్పా…? నీ కెలాగు విద్య లేదు. విజ్ఞానం అసలే లేదు. చరిత్ర తెలియదు. చారిత్రక సత్యాలు నేర్చుకోలేదు. దేవుళ్లతోనే పరాచికాలాడేంత లేకి మాటలు మాట్లాడడం నీ పతనానికి పరాకాష్ట. చిన్న జీయరా! నీ ఆశ్రమంలో ఉద్యోగ నియమాకాలపై వస్తున్న వార్తలు నిజమే అని తేలితే మాత్రం ఇక సమాజం నుంచి ముఖ్యంగా తెలంగాణ బహుజనుల నుంచి వ్యతిరేకత తప్పదు. తెలంగాణ నుంచి తరుముడు తప్పదు. నువ్వు పారిపోక తప్పదు. పోరాటం తెలంగాణకు కొత్త కాదు. కప్పం కట్టమని దండెత్తి, దాడి చేయాలని చూసిన కాకతీయులనే సహించని సమాజం సమ్మక్కది. అడవుల్లో పశువులను మేపుకుంటే గడ్డికి పన్ను కట్టమని ఒత్తిడి చేస్తే తిరుగుబాటు చేసిన కొమరభీం చరిత్ర తెలంగాణది. జల్‌, జంగిల్‌, జమీన్‌ అని ఆది వాసి బిడ్డల కోసం కొట్లాడిన రాంజీ, ఆయన మనవడు కొమరం భీమ్‌లతో పెట్టుకున్న నిజామే పారిపోక తప్పలేదు. పోయి, పోయి ఆ తెగతోనే పెట్టుకున్నావు. మరోవైపు నీ ఆశ్రమంలో పని వారిగా దళితులు కావాలన్న ప్రకటనలతో బ్యానర్లున్నట్లు చెప్పుకుంటున్నారు. దళిత సమాజం ఒక్కసారి కన్నెర్ర చేస్తే ఇక ముచ్చింతల్‌లో ఆశ్రమం ఆదోగతి పాలే…
` రామేశ్వరరావు అనుకున్నదొక్కటీ…అయిందొక్కటీ?
భక్తికి రామేశ్వరరావు వైబోగం తెవాలనకున్నాడు. దాంతో తన భూముల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు చేసుకోవాలనుకున్నాడు. పేదరికం అనుభవించిన కసితో సంపాదన మార్గంలో పడ్డాడు. కాస్తో కూస్తో భూమి మీద పెట్టిన సంపాదనకు రెట్టింపు రావడం చవి చూశాడు. ఎన్ని మందులమ్మినా రాని సంపాదన నాలుగు మాటలు చెబితే రావడం చూశాడు. నాలుగు ప్లాట్లమ్మితే ఏడాది సంపాదన పోగౌతుంది. ఇదేదో మంచిగా వుందనుకున్నాడు. తన వ్యాపారం పెరగాలంటే పక్కన కాషాయం వుంటే ఎదరులేదనుకున్నాడు. చినజీయర్‌ను పక్కన పెట్టుకున్నాడు. తన నెత్తిన తానే కుంపటి తెచ్చి పెట్టుకున్నాడు. ఇప్పుడు దించుకోలేడు. వుంచుకోలేదు. తెలంగాణలో ఇంత కాలం వ్యాపారి అన్న పేరున్న రామేశ్వరరావు, గ్రామీణ వ్యవస్ధలో అలజడి రేపే వాడిని తెచ్చిపెట్టుకున్నాడు. భోగిని తెచ్చుకున్నాని అనుకున్నాడు… దేవతలనే తూలనాడే మానసిక రోగిని తెచ్చుకున్నానని అనుకోలేదు…. తనును కాదని వైభోగం చూసుకునే కషాయ స్వామిని తెచ్చుకున్నానని తెలుసుకోలేకపోయాడు. పులి మీద స్వారి…కూర్చోలేడు..దిగలేదు…..ఒకనాడు నేను వ్యాపారిని అని గర్వంగాచెప్పుకున్న రామేశ్వరరావు, నేనేంటో అని చెప్పుకోవడానికి కూడా ధైర్యం చేయలేని స్ధితికి నెట్టబడ్డాడు. అంతా మాయా…భూమాయ!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!