5K Run Held in Sircilla for Praja Palana Progress Plan
సిరిసిల్లలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 5కే రన్ నిర్వహణ
సిరిసిల్ల టౌన్:(నేటి ధాత్రి)
సిరిసిల్ల పట్టణంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సోమవారం ఉదయం 5కే రన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ కూడలి నుండి బతుకమ్మ ఘాట్ వరకు నిర్వహించిన ఈ రన్లో ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా బతుకమ్మ ఘాట్ వద్ద ప్రజా పాలన ప్రగతి ప్రణాళికకు సంబంధించిన ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిలో పారిశుధ్య నిర్వహణకు ప్రతి పౌరుడు బాధ్యతగా సహకరించాలని కోరారు. గతంలో సిరిసిల్ల పట్టణం సాధించిన అవార్డులను మళ్లీ సాధించేందుకు ప్రజలందరూ కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఇంటి వద్ద ఉత్పత్తి అయ్యే చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందజేయాలని సూచించారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ పారవేయకుండా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలను కోరారు. ప్రజల సహకారంతో సిరిసిల్ల పట్టణాన్ని స్వచ్ఛమైన, పర్యావరణ హిత పట్టణంగా తీర్చిదిద్దవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిల్ సభ్యులు, మెప్మా సిబ్బంది, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
