ఎన్నికల నేపథ్యంలో పోలీసుల తనిఖీలు
– పట్టుబడ్డ అనుమతి లేని వెండి గొలుసులు
సిరిసిల్ల(నేటి ధాత్రి):
శనివారం ఉదయం సుమారు 10:57 గంటలకు, కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల రగుడు వద్ద ఉన్న ఎస్ ఎస్ టి చెక్పోస్ట్లో వాహన తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు. ఈ సందర్భంగా
టీఎస్ 08 ఎఫ్ ఎస్ 6726 నంబర్ గల కారును పోలీస్ బృందం ఆపి తనిఖీ చేయగా, కార్ డ్రైవర్/యజమాని తోగిటి సత్యానారాయణ, తండ్రి: వెంకట్రాములు, నివాసం: మెట్పల్లి గ్రామము మరియు మండలం, జగిత్యాల జిల్లా గల వ్యక్తి, తన కారులో లెక్కలలో లేని మరియు అనుమానాస్పదమైన 2.342 కే.జి ల వెండి పట్టగోలుసులు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు.
అట్టి వెండి పట్టగోలుసులు ఎన్నికల నిబంధనలు మరియు చట్టపరమైన విధానాల ప్రకారం, ఎస్ ఎస్ టి బృంద ఇన్చార్జ్ జి. ఆనంద్, ఏపీవో సమక్షంలో, మధ్యవర్తుల (పంచనామా సాక్షుల) సమక్షంలో స్వాధీనం చేసుకోవడమైనది. ఆ అట్టి వెండి పట్టగోలుసుల యొక్క మూలం మరియు ఉపయోగ ఉద్దేశ్యం తెలుసుకునేందుకు తదుపరి విచారణ / దర్యాప్తు కొనసాగుతోందనీ టౌన్ ఇన్స్పెక్టర్ కృష్ణ తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు, మద్యం, ఇతర విలువైన వస్తువులు తీసుకొని వెళ్తున్నట్లు సమాచారం ఉంటే పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించాలని,శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడితే వారిపై ఎన్నికల నియమావళి ప్రకారం ప్రకారం చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
