కమలం గూటిలో బూరకు బురదే! 

`నీతిమాలిన తనానికి పరాకాష్ట?

`రెంటికీ చెడ్డ రేవడి కావడం గ్యారంటీ?

 

`బిజేపిలో చేరిన వారి పరిస్థితి చూడడం లేదేంటి?

`బూర నిర్ణయం నమ్మకాన్ని అమ్ముకోవడం కాదా?

`వీటిని కోవర్టు రాజకీయాలనరా? 

`పదవులిచ్చిన పార్టీనే మోసం చేస్తే, అక్కడ గౌరవిస్తారా?

`వీటిని బానిస రాజకీయాలకు బాష్యమనరా?

`పదవులిస్తే అభిమానమా?

`ఆత్మాభిమానం, బానిస నిర్వచనాలు రాజకీయాలకా?

`అంత ప్రజాభిమానమే వుంటే భువనగిరి ఎందుకోడిపోయినట్లు?

`ప్రజలకు సేవ చేస్తే ఎందుకు ఓడిరచినట్లు?

`ఓడిరచిన రాజగోపాల్‌ రెడ్డి పంచన చేరి ఎవరికి మేలు చేయనున్నట్లు?

`నిన్ను ఓడిరచి, అన్నను గెలిపించుకున్న రాజగోపాల్‌ రెడ్డికి జేజేలు కొట్టడానికి సిద్ధం కావడం ఆత్మాభిమానం చంపుకోవడం కాదా?

`ఇంత పేరుకు కారణమైన పార్టీ కాదనిపోయి ఏం సాధించినట్లు?

`మునుగోడు మీద ప్రేమే వుంటే గట్టుప్పల్‌ మండలం కోసం ఎందుకు పాటుపడలేదు?

`గతంలో గెలుపుకు కారణమైన చేర్యాల రెవెన్యూ డివిజన్‌ సాధించలేదు?

`ఎంపి. అయిన తొలి వారంలోనే ఇనుగుర్తిని వద్దిరాజు రవిచంద్ర మండలం చేయించుకున్నాడు?

`ఉద్యోగుల సంఘం నేత పదవులు దక్కకపోయినా పార్టీకి సేవలు చేస్తున్నాడు?

`ఉద్యమ నాయకులెందరికో పదవులు అందలేదు…అయినా వారు ఉద్యమ త్యాగాన్ని పదవులకు ముడిపెట్టడం లేదు?

`కోదండరాం లాంటి వారికే టిక్కెట్‌ రాలేదు…భువనగిరి అవకాశం మీకు వచ్చింది?

`ప్రజలు గెలిపిస్తే బిబి నగర్‌ నిమ్స్‌ కు ఏం చేశావు?

`ఎంత మంది గౌడ సామాజిక వర్గ ప్రజలకు ఉచిత వైద్యం చేశావు?

`పదవులుంటేనే పార్టీ గొప్పదా? 

`కండువా మార్చుకోగానే ప్రభుత్వానివి తప్పులా?

`రాత్రికి రాత్రే పార్టీకి జెల్లకొట్టి పత్తిత్తు మాటలా?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

నిత్య అసంతృప్తి వాది ఎక్కడున్నా అంతే..ఎంత కాలం ఏ పార్టీలో వున్నా అంతే అని సామెత…ఎందుకంటే బూర నర్సయ్య గౌడ్‌ ఉద్యమ కాలంలో రాజకీయ నాయకులతో సఖ్యతతక్కువ. తెలంగాణ రాష్ట్రం సాధించాక ముఖ్యమంత్రి కేసిఆర్‌ పిలిచి భువనగిరి ఎంపి సీటిచ్చి, బిసీ నేతగా గుర్తింపు వ చ్చేలా చూసుకున్నారు. కాని చేసుకున్నంత వారికి చేసుకున్నంత మహదేవా! అన్నట్లు ఎంపిగా వున్నంత కాలం ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్వరెడ్డితో ఏనాడు సఖ్యత లేదు. ఇప్పటికీ ఆయనతో గిట్టడం లేదు. భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖరరెడ్డితో ఏనాడు పడలేదు. ఆలేరుఎమ్మెల్యే గొండిగి సునీతను కలుపుకొని పోయింది లేదు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డితో కలిసి సాగింది లేదు. ఆ నాయకులతో ఎప్పుడూ గిల్లికజ్జాలే…ఆనాడు వాళ్లెవరూ నాకు పిలిచి పీటేయడం లేదు? నాకు గౌరవం ఇవ్వడం లేదని నిత్య అసంతృప్తితోనే ఐదేళ్లు పదవి పుణ్యం కాలం పూర్తి చేసుకున్నాడు. పదవిలో వున్నంత కాలం ప్రజలకు అందుబాటులో వున్నది లేదు. ప్రజలకు పెద్దగా మేలు చేసింది లేదు. ఎంత సేపు ఎమ్మెల్యేలతో చిక్కులు…చింతలు తప్ప, ప్రజల సంగతి ఏనాడు పట్టలేదు. ఎంపిగా పెద్దగా పనితనం చూపింది లేదు. అయినా ముఖ్యమంత్రి కేసిఆర్‌ రెండోసారి కూడా ఎంపిగా అవకాశం ఇచ్చారు. కాని బూర నర్సయ్య గౌడ్‌ ఓడిపోయాడు. కారణం ఆయన స్వయం కృతాపరాధం….ప్రజలతో మమేకం కాలేని తనం… అయినా మళ్లీ పిలిచి పీటెయ్యలేదు…నాకు సీటు సీటివ్వడం లేదు…మునుగోడు సీటు అడుగుడు తప్పా…మా సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ…! అంటూ కొత్త పల్లవి అందుకున్న నాడే బూరనర్సయ్యగౌడ్‌ కోవర్టు అవతారం ఎత్తిండన్న సంగతి టిఆర్‌ఎస్‌ శ్రేణులకు అర్ధమైపోయింది. గతంలో అసంతృప్తి నేతలు కూడా ఇలాగే చాలా మంది చేశారు. టిఆర్‌ఎస్‌ కాదంటే బిజేపిలో చేరారు..టిఆర్‌ఎస్‌ టిక్కెట్టు ఇయ్యకుంటే బిజేపికి తీర్ధం పుచ్చుకున్నారు…..టిఆర్‌ఎస్‌ నుంచి తీసేస్తే బిజేపిలో చేరారు? మొత్తం మీద టిఆర్‌ఎస్‌కు పనికి రానివారంతా బిజేపిలో చేరిపోయారు… పని తనం లేని వాళ్లంతా బిజేపి గుంపులో చేరుతారన్నది సుస్పష్టమైంది. బిజేపికి క్యాడర్‌ లేదు…లీడర్లు లేరు…సహజంగా ఏ పార్టీ అయినా క్యాడర్‌ను తయారు చేస్తే లీడర్‌ తయారౌతాడని అనుకుంటుంది. కాని బిజేపి లీడర్లను తీసుకొని క్యాడర్‌ లేకపోయినా ఫరవాలేదనుకుంటోంది. టిఆర్‌ఎస్‌లో పనికి రాని స్క్రాప్‌ అంతా బిజేపిలో నిండుతోంది. టిఆర్‌ఎస్‌లో ఔట్‌డేటెడ్‌ నాయకులంతా బిజేపిలో చేరి చేతులు కాల్చుకుంటున్నారు. కోవర్టు ఆలోచనలు వున్న నేతలు టిఆర్‌ఎస్‌లో ఎంత ప్రాధాన్యత వున్నా నచ్చడం లేదు..బిజేపిలో చేరి మూలన కూర్చొని దిగులు పడుతున్నారు. ఇప్పుడు వాళ్లు పైకి చెప్పుకోలేక..బైటకు ఏడ్వలేక..పిలిచేవ వారులేక సతమతమౌతున్నారు…ఎందుకొచ్చామా? అని దిగులు పుడుతున్నారు….వారి సరసన ఇప్పుడు బూర నర్సయ్య గౌడ్‌చేరిపోయాడు..అయిన కాడే ఇలాంటి నేతల పెత్తనం.. బైటకు పోతే ఉత్తదే మనం..

అని ఇప్పటికే అనేక మందినేతలు నిరూపించారు. ఎందుకంటే అయినోడు భుజాల మీదకు ఎక్కించుకున్నా చాలదు…కాని వాడు కాళ్ల కింద వేసుకుంటే గాని తత్వం భోధ పడదు…ఇప్పుడు బైటకు పోతే బాగానే వుంటుంది. నాలుగు రోజులైన తర్వాత అక్కడ గుంపులో గోవిందయ్య కూడా కాలేకపోతే గాని పోగొట్టుకున్నదేమిటో అర్ధమౌతుంది. బూరది ఇంత పచ్చి అవకాశ వాదమా? పిల్లి కళ్లుమూసుకొని పాలు తాగడం అంటే ఇదే! మూడు రోజుల క్రితం నా అవసరం జాతీయ రాజకీయాల్లో వుందని ముఖ్యమంత్రి కేసిఆర్‌ చెప్పాడు. మా పార్టీ అభ్యర్ధి గెలుపుకోసం అందరం కలిసి కృషి చేస్తామని చెప్పి రెండు రోజులు కాలేదు…కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ కూడా తన చేతుల మీదుగా వేసిన బూర నర్సయ్య గౌడ్‌… పార్టీకి రాజీనామా! దీనిని ఏమంటారు? అవకాశ వాదమనరా? మోసమనుకుండా ఏంటారు? గతంలో ఎన్నికల సార్వత్రిక ఎన్నికల సమయంలో టిక్కెట్లు దక్కకపోతే ఆఖరు నిమిషంలో ఇతర పార్టీలలో చేరి టిక్కెట్లు తెచ్చుకున్నవారు వున్నారు.

బాజాప్తా వాళ్లు వెళ్లిపోయేవారు. కాని బూర నర్సయ్య గౌడ్‌లాగా మాత్రం గతంలో ఏనాయకుడు వ్యవహరించలేదు. ఇది నీతి మాలిన తనానికి పరాకాష్ట కాదా? తాను బిజేపిలో చేరిపోవడం అన్నది స్వయం కృతాపరాధం అని తెలియడానికి బూర నర్సయ్య గౌడ్‌కు ఎంతో కాలం పట్టదు. ఏగేసేవారు….ఎగదోసే వారు…ఎటూ కాకుండా చేయాలని చూసేవారు చాల మంది వుంటారు…అలాంటి వారి మాటలు నమ్ముకుంటే ఇలాగే అవుతుంది. ఇప్పటికే బిజేపిలో చేరిన వారి పరిస్ధితి బూర నర్సయ్య గౌడ్‌ చూస్తూనే బిజేపి వైపు అడుగులేయడం అంటేనే నమ్మకాన్ని అమ్ముకున్నట్లు…ఆయనకు ఇచ్చిన గౌరవాన్ని తాకట్టు పెట్టినట్లు…!పదవులిచ్చిన టిఆర్‌ఎస్‌ను నిండా ముంచిపోతే బిజేపిలో సముచిత స్ధానం ఇస్తారని అనుకోడం వెర్రితనమే అవుతుంది. 2014 ఎన్నికల్లో భువనగిరి ఎంపిగా అవకాశం కల్పించింది పార్టీ. మళ్లీ 2019 ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రి కేసిఆర్‌ టిక్కెట్టు ఇచ్చారు. కాని బూర నర్సయ్య గౌడ్‌ ఓడిపోయాడు. దానికి పార్టీ భాధ్యత కాదు…ఆయన నాయకత్వ లేమి తనం? బూర నర్సయ్యకు వుంటే ఎంతకు ఓడిపోయినట్లు? ప్రజాభిమానం చూరగొననట్లే కదా? సరే…ఆనాడు ఎవరి చేతిలో ఓడిపోయాడో…బూర నర్సయ్య గౌడ్‌ను ఎవరు దగ్గరుండి ఓడిరచారో…ఆ నాయకుడైన రాజగోపాల్‌ రెడ్డి ఎన్నికకే మునుగోడులో సపోర్టు చేసేందుకు కమలం గూటికి చేరితే…నమ్మకం అన్న పదానికి అర్ధముంటుందా? విశ్వాసమన్నది బూర నర్సయ్య గౌడ్‌లో వుందని అనుకునేందుకు అవకాశం వుందా? బూర నర్సయ్య ఓడిపోవడానికి ప్రధాన కారకుడైన రాజగోపాల్‌ రెడ్డికి మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం చేయడం అంటే ఆత్మాభిమానం చంపుకోవడం కదా? ఇంత పేరు కు కారణమైన టిఆర్‌ఎస్‌ తాను ఏమిచ్చానని ఏనాడైనా ఆలోచిస్తే ఇలాంటి నిర్ణయం తీసుకునేవాడు కాదు. 

 సరే మునుగోడు మీద బూర నర్సయ్య గౌడ్‌కు ఎంతో ప్రేమ వుందనే అనుకుందాం…

 మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఏనాటినుంచో గట్టుప్పల్‌ మండలం కావాలని డిమాండ్‌ చేస్తూ వున్నారు. దానిని ఏనాడైనా భుజాన వేసుకున్నావా? గట్టుప్పల్‌ ప్రజల కోరిక తీర్చమని ఏనాడైనా ముఖ్యమంత్రి కేసిఆర్‌నొ కోరావా? ఒత్తిడి తెచ్చావా? ఖచ్చితంగా మండలం చేయాలని అడిగావా? ఇటీవల రాజ్యసభ సభ్యుడైన వద్దిరాజు రవిచంద్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపే సమయంలో తన గ్రామమైన ఇనుగుర్తిని మండలం చేయాలని కోరారు…ప్రకటిస్తేగాని ఇక్కడినుంచి కదలనని కోరాడు…నా గ్రామ ప్రజల కోరిక నెరవేచ్చిన ఘనత నాకు దక్కాలన్నాడు. మండలం ప్రకటిస్తే ఇనుగుర్తిని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానన్నాడు. ప్రజల కోరిక నెరవేర్చిన నాయకుడిగా తన గౌరవం పెరుగుతుందని చెప్పి, ఇనుగుర్తిని మండలం చేయించుకున్నాడు. అదీ నాయకుడికి వుండాల్సిన లక్షణం. కాని అలాంటి పనులు ఏమైనా బూర నర్సయ్య గౌడ్‌ చేశాడా? అంటే ఒక్కటికూడా కనిపించదు. అలాంటి సంఘటనలు కూడా భువనగరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో వున్నాయి. జిల్లాల ఏర్పాటు సమయంలో గుండాల మండలాన్ని భువనగిరి నియోజక వర్గంలో కలిపితే ప్రజలు ఆక్షేపించారు. వారి అభీష్టాన్ని ఆలేరు ఎమ్మెల్యే తీర్చి తిరిగి ఆ గుండాల మండలాన్ని ఆలేరు నియోజకవర్గంలో కలిపించారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ దృష్టికి తీసుకెళ్లి గుండాలను ఆలేరులో కలిపారు. కాని ఆ సమయంలో బూర నర్సయ్య పట్టించుకున్న దాఖలాలు లేవు.

ఇక ఆయన పార్లమెంటు పరిధిలోని చేర్యాలలో గత ఐదారేళ్లుగా రెవిన్యూ డివిజన్‌ చేయాలని కోరుతూ పెద్దఎత్తున ఉద్యమాలు సాగుతున్నాయి. ఆ డిమాండ్‌ను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఎంపిగా వున్న సమయంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ను కలిసి, చేర్యాల సమస్య తీర్చలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే నాయకుడిగా నర్సయ్య గౌడ్‌ది ఫెయిల్యూర్‌ స్టోరీయే…తనకు తాను లీడర్‌ను అనుకుంటే చాలా…ప్రజలు కూడా అనుకోవాలి. గుర్తించి ఎన్నికల్లో గెలిపించాలి…నర్సయ్య గౌడ్‌ బిజేపిలో చేరితే వచ్చే ఎన్నికల్లో మునుగోడు నుంచి టిక్కెట్టు ఇచ్చే అవకాశం వుంటుందా? ఇప్పుడు ఇన్నికోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో నిలబడుతున్న రాజగోపాల్‌ రెడ్డిని కాదని బిజేపి టిక్కెట్టు ఇస్తుందా? అందులోనూ జనరల్‌ సీట్లలో రెడ్డీని కాదని బిసికి ఇచ్చేంత సమర్ధవంతమైన నాయకుడివా…అదీ కాకపోతే వచ్చే ఎన్నికల్లో బిజేపి భువనగిరి నుంచి ఎంపిగా అవకాశం ఇస్తుందన్న గ్యారెంటీ ఏమైనా వుందా? ఇక్కడున్నా కనీసం మళ్లీ భువనగిరి టిక్కెట్టైనా దక్కేది….ఇప్పుడు అదీ లేదు…ఇదీ లేదు…రెంటికీ చెడ్డ రేవడి కావడం ఖాయం కాదా? నిన్నటిదాకా పార్టీలో వుండి…రాత్రికి రాత్రి రాజీనామా చేయగానే పత్తిత్తు మాటలు మాట్లాడితే చాలా…సచ్చీలుడివైపోతావా? టిఆర్‌ఎస్‌ కండువా తీసేయగానే ప్రభుత్వం తప్పులు గుర్తుకొస్తున్నాయా…ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎప్పుడూ ఒళ్లో కూర్చోబెట్టుకుంటే తప్ప పార్టీలో కొనసాగలేవా? పదవులంటేపార్టీ గొప్పది? లేకుంటే కాదా? ఇలా పదవుల కోసం మాత్రమే పని చేసే నాయకులను ఏ పార్టీ క్షమించదు. పార్టీ కోసం పనిచేసే నాయకులే పార్టీ పట్టుగొమ్మలౌతారు…పార్టీకి నిజమైన కార్యకర్తలౌతారు..! సామాజిక వర్గంపేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తాం…అనుకుంటే సరిపోదు…ఒక వైద్యుడిగా తన సామాజిక వర్గానికిచెందిన ఎంత మందికి ఉచిత వైద్యం చేశాడో చెప్పగలడా? సామాజిక వర్గం కేవలం పదవుల కోసమేనా?…గౌడ సామాజిక వర్గానికి గతంలో ఎన్నడూ లేనంత ప్రాధాన్యత, వారి వృత్తికి గైరవం దక్కుతున్నది ఇప్పుడు మాత్రమే…టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం మూలంగానే…అది మర్చిపోయి…తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది…అన్నట్లు కమలం గూటికి చేరుతున్నాననుకొని బూర నర్సయ్య బురద రుద్దుకుంటున్నాడన్నది మాత్రం నిజం…అని ప్రజలు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *