నిబంధనలు పాటించలేదని పెండ్లి పెద్దలపై కేసు నమోదు

బుగ్గారం, (నేటి ధాత్రి):

కరోనా నిబంధనలు పాటించలేదని,పెళ్ళికి 20 మందికి మించి హాజరయ్యారని వధూవరుల తండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బుగ్గారం ఎస్సై మంద చిరంజీవి కథనం ప్రకారం పూర్తి వివరాల్లోకి వెళితే….. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని కొత్త ఎస్సీ కాలనీలో బుధవారం వివాహం జరిగింది. అట్టి వివాహానికి అధికారుల అనుమతి ప్రకారం 20మంది మాత్రమే హాజరు కావాలి. కాని పెండ్లికి 20మందికి మించి హాజరయ్యారని, భౌతిక దూరం పాటించలేదని, మాస్కులు ధరించలేదని స్థానిక విఆర్వో గోపాల్ పోలీసులకు పిర్యాదు చేశారు. అతని పిర్యాదు మేరకు బుగ్గారం ఎస్సై మంద చిరంజీవి వివాహం నిర్వహించిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

 

ఎక్కడా కూడా జనాలు మాస్కులు లేకుండా ఉండకూడదని, భౌతిక దూరం తప్పకుండా పాటించాలని, అత్యవసరం అయితే తప్ప ఇంటి నుండి బయటకు రావొద్దని ఎస్సై హెచ్చరించారు. ప్రతి వివాహానికి 20మందికి మించి అనుమతి లేదని, అది కూడా భౌతిక దూరం పాటిస్తూ, ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరి ధరించాలని ఎస్సై చిరంజీవి తెలిపారు. మహారాష్ర్ట, ఇతర రాష్ట్రాల నుండి, ఇతర ప్రాంతాల నుండి విదేశాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరూ 28 రోజులు హోమ్ క్వారెంటైన్ పాటించాలని సూచించారు. లేని పక్షంలో చట్టపరంగా, కోవిడ్ -19 ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఎస్సై చిరంజీవి హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *