దిగ్విజయంగా 180వ వారం అన్నదాన కార్యక్రమం.పాల్గొన్న హోప్ ఫౌండేషన్ సభ్యులు అన్నె అపర్ణ
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-
సమాజం పట్ల బాధ్యతతో, మానవతా దృక్పథంతో హోప్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు ఎంతో గొప్పవని స్థానిక ప్రజలు కొనియాడారు. హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో గత 180 వారాలుగా కొనసాగుతున్న ఉచిత అన్నదాన కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించబడింది.
ఈ వారం అన్నదాన కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ సభ్యులు అన్నె అపర్ణ పాల్గొని భక్తులకు, పేదలకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి వారం క్రమం తప్పకుండా అన్నదానం నిర్వహించడం సామాన్యమైన విషయం కాదని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా హోప్ సభ్యులు తీసుకుంటున్న జాగ్రత్తలు అభినందనీయమని అన్నారు.
అత్యధిక సంఖ్యలో ప్రజలు విచ్చేసినప్పటికీ, క్రమశిక్షణతో అందరికీ భోజన వసతి కల్పించడం ఫౌండేషన్ యొక్క అంకితభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. పేద ప్రజల ఆకలి తీర్చడమే పరమావధిగా చైర్మన్ కొండా విజయ్ కుమార్ చేపడుతున్న అనేక ఇతర సేవా కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా స్థానికులు గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, సభ్యులు మరియు స్థానికులు పాల్గొన్నారు.
