ఏం డౌట్ వద్దు.. మళ్లీ వచ్చేది డీఎంకే పాలనే
ఏం డౌట్ అవసరం లేదు.. మళ్లీ వచ్చేది డీఎంకే పాలనే.. అని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. ఆయన మాట్లాడుతూ… డీఎంకే ఎన్నికల మేనిఫెస్టో తయారీ చేసే బాధ్యత కూడా ఎంపీ కనిమొళికి అప్పగించానని తెలిపారు. డీఎంకేకు అధికారం ఖాయం అని ఆయన అన్నారు.
ఈ మహానాడులో పాల్గొన్న ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ ఈ మహానాడుకు హాజరైన మహిళలను చూస్తూంటే మరోమారు డీఎంకేకు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారనే భావన తనకు కలుగుతోందన్నారు. మహానాడును ఇంత గొప్పగా ఏర్పాట్లు చేపట్టిన తన సోదరి కనిమొళి బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. రానున్నది మహిళా సంక్షేమ పాలన కనుకనే ప్రస్తుతం డీఎంకే ఎన్నికల మేనిఫెస్టో తయారీ చేసే బాధ్యత కూడా కనిమొళికి అప్పగించానని తెలిపారు. రాష్ట్రంలో పెరియార్, అన్నాదురై వంటి మహాపురుషులు మహిళాభ్యుదయం కోసమే తీవ్రంగా పాటుపడ్డారని గుర్తు చేశారు.డీఎంకేకు ముందున్న జస్టీస్ పార్టీ తొలి సమావేశం 1914లో జరిగిందని, ఆ సమావేశంలో తొలిసారిగా ఓ మహిళ పాల్గొందని, ఆమే పేరే అలమేలు మంగతాయరమ్మాళ్ అని స్టాలిన్ తెలి పారు. 1949లో డీఎంకే ఆవిర్భావంలో సత్యవాణి ముత్తు వంటి మహిళా ప్రముఖులు కీలక పాత్ర పోషించారన్నారు. 1956లో అన్నాదురై పార్టీలో మహిళలకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారని, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆ విభాగానికి మరింత జవసత్వాలు కలిగించారని, అప్పటి నుండి డీఎంకేలో ఈ మహిళా విభాగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
