తాగునీటికి దిక్కులేని పెద్దాసుపత్రి

తాగునీటికి దిక్కులేని పెద్దాసుపత్రి

100 కోట్లు ఖర్చుపెట్టినా బుక్కెడు నీళ్లు లేవు–ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం

ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆర్ఎంఓలకు హెచ్చరిక

బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాణా ప్రతాప్ రెడ్డి ధ్వజం

నర్సంపేట, నేటిధాత్రి:

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో కోట్ల రూపాయలతో జిల్లా పెద్దాస్పత్రి ఏర్పాటు చేస్తే ఇప్పుడు తాగడానికి నీళ్లు లేక దిక్కులేని పరిస్థితికి వచ్చిందని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి మండిపడ్డారు. మెడికల్ కాలేజీ, ఆసుపత్రిని 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని చెప్పుకునే ప్రభుత్వాలు చెప్పుకోవడానికే “కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక పోయింది అన్నట్లు ఉందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కుక్క కాటుకు గురై చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న రోగులు తాగడానికి కనీసం బుక్కెడు మంచినీరు లేక ఇబ్బందులు పడుతున్నామని తనతో చెప్పారని తెలిపారు. రోగులకు తాగడానికి తాగునీరు లేని పరిస్థితి ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పూర్తి వైఫల్యమని ఆయన విమర్శించారు. ఆసుపత్రిలో ఉన్న సూపరింటెండెంట్, ఆర్ఎంఓలతో రోగులు పడుతున్న ఇబ్బందులను వివరించి, వెంటనే సంబంధిత అధికారులు దృష్టి పెట్టి మంచినీటి ఏర్పాటు చేయకపోతే తామే స్వయంగా ఏర్పాటు చేస్తామని రాణా ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version