సింగరేణి కాలరీస్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఎస్సీసీడబ్ల్యూ-ఐఎఫ్టియు) ఆధ్వర్యంలో మేడే పోస్టర్ల ఆవిష్కరణ
శ్రీరాంపూర్ : నేటిధాత్రి
140 వ మే డే దినోత్సవాన్ని కార్మికులు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరుపుకోవాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐఎఫ్టియు) జాతీయ కమిటీ పిలుపునిచ్చింది.ఈ పిలుపులో భాగంగా శనివారం శ్రీరాంపూర్ కాలనీలో ఐఎఫ్టియు నాయకులు మేడే పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ( ఎస్సిసిడబ్ల్యూయు – ఐఎఫ్టియు) సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డి బ్రహ్మానందం మాట్లాడుతూ.. ఈసారి జరుపుకోబోయే 140వ మే డే కార్మిక వర్గం 1886 సంవత్సరంలో లో అమెరికా దేశంలోని చికాగో నగరంలో 8 గంటల పని కోసం పోరాడి రక్తం చిందించి ప్రాణ త్యాగం చేసి 8 గంటల పని విధానాన్ని సాధించుకోవడం జరిగిందన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా మహత్తరమైన పోరాటం. ఈ పోరాట ఫలితంగా కార్మికులు ఎనిమిది గంటల పని విధానాన్ని అనుభవిస్తున్నారని గుర్తు చేశారు. కానీ నేడు భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులు ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలలో 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్స్ తీసుకురావడం జరిగిందని విమర్శించారు. దీని ఫలితంగా ఎనిమిది గంటల పని భవిష్యత్తులో 12 గంటలు పని చేసే పరిస్థితులు ఎదురవుతాయని పేర్కొన్నారు.నేటికీ ఈ దేశంలో కార్మికులకు ఈఎస్ఐ, పిఎఫ్, పెన్షన్, సెలవులు చట్టబద్ధమైన హక్కులు అమలు కావడం లేదు. లక్షలాదిమంది కార్మికులకు కనీస సౌకర్యాలు లేకుండా పనిచేస్తున్నారని అన్నారు. 100 ఏళ్ల త్యాగాలతో కార్మిక వర్గం సాధించుకున్న చట్టాలను కొల్లగొట్టి కార్మికుల హక్కులను ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టిందని మండిపడ్డారు. 1/4/ 2026 నుండి నాలుగు లేబర్ కోడ్స్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం హుకుం జారీ చేసింది. ఈ నాలుగు లేబర్ కోడ్స్ వెనుక కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపించారు. వారి లాభాలను, పెట్టుబడులను రక్షించడానికి ఈ నాలుగు లేబర్ కోడ్స్ ను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని మండిపడ్డారు.నాలుగు లేబర్ కోడ్స్ అమలులో యూనియన్లను ఏర్పాటు చేయడంకానీ, సమ్మెకు వెళ్లడం అసాధ్యం అవుతుందన్నారు. శాశ్వత ఉద్యోగాలు అదృశ్యం అవుతాయి. వాటి స్థానంలో ఎలాంటి ఉద్యోగ భద్రత లేని ఫిక్సడ్. టర్మ్ ఉపాధి వస్తుందని అన్నారు. కార్మికులుగా గుర్తింపు, పిఎఫ్ ఈఎస్ఐ అమలకై వేతన పరిమితుల ఆధారంగా ఆంక్షలు విధించారు. తొలగింపులు, ఫ్యాక్టరీ మూసివేతలకు అవసరమైన కార్మికుల సంఖ్యను పెంచారు. 10 నుండి 12 గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రమాదకర పరిశ్రమలతో సహా అన్ని రంగాలలో మహిళలు నైట్ షిఫ్ట్ లో పనిచేయడానికి ఇప్పుడు అనుమతి ఉంది. కార్మికుల భద్రత సౌకర్యాలు, వేతనాలు, బోనస్ యాజమాన్యాల దయా దక్షిణాలకు వదిలివేయబడ్డాయి. ఇలాంటి తరుణంలో 140 మే డే జరుపుకోవాలని ఈ మేడే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరుపుకోవాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య ( ఐఎఫ్టియు) పిలుపునిస్తుందన్నారు. కార్మికులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాడుగుల శంకర్, అప్పారావు, బాపు, రాజయ్య, కనకయ్య, సుధాకర్ గద్దల శంకర్, రాంబాబు, వెంకటయ్య, నర్సమ్మ, కోమల, సత్యఅక్క, విజయ, మల్లేశ్వరి, శారద, కవిత పాల్గొన్నారు.
