సింగరేణి కాలరీస్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఎస్సీసీడబ్ల్యూ-ఐఎఫ్టియు) ఆధ్వర్యంలో మేడే పోస్టర్ల ఆవిష్కరణ

సింగరేణి కాలరీస్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఎస్సీసీడబ్ల్యూ-ఐఎఫ్టియు) ఆధ్వర్యంలో మేడే పోస్టర్ల ఆవిష్కరణ
శ్రీరాంపూర్ : నేటిధాత్రి

 

 

140 వ మే డే దినోత్సవాన్ని కార్మికులు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరుపుకోవాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐఎఫ్టియు) జాతీయ కమిటీ పిలుపునిచ్చింది.ఈ పిలుపులో భాగంగా శనివారం శ్రీరాంపూర్ కాలనీలో ఐఎఫ్టియు నాయకులు మేడే పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ( ఎస్సిసిడబ్ల్యూయు – ఐఎఫ్టియు) సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డి బ్రహ్మానందం మాట్లాడుతూ.. ఈసారి జరుపుకోబోయే 140వ మే డే కార్మిక వర్గం 1886 సంవత్సరంలో లో అమెరికా దేశంలోని చికాగో నగరంలో 8 గంటల పని కోసం పోరాడి రక్తం చిందించి ప్రాణ త్యాగం చేసి 8 గంటల పని విధానాన్ని సాధించుకోవడం జరిగిందన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా మహత్తరమైన పోరాటం. ఈ పోరాట ఫలితంగా కార్మికులు ఎనిమిది గంటల పని విధానాన్ని అనుభవిస్తున్నారని గుర్తు చేశారు. కానీ నేడు భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులు ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలలో 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్స్ తీసుకురావడం జరిగిందని విమర్శించారు. దీని ఫలితంగా ఎనిమిది గంటల పని భవిష్యత్తులో 12 గంటలు పని చేసే పరిస్థితులు ఎదురవుతాయని పేర్కొన్నారు.నేటికీ ఈ దేశంలో కార్మికులకు ఈఎస్ఐ, పిఎఫ్, పెన్షన్, సెలవులు చట్టబద్ధమైన హక్కులు అమలు కావడం లేదు. లక్షలాదిమంది కార్మికులకు కనీస సౌకర్యాలు లేకుండా పనిచేస్తున్నారని అన్నారు. 100 ఏళ్ల త్యాగాలతో కార్మిక వర్గం సాధించుకున్న చట్టాలను కొల్లగొట్టి కార్మికుల హక్కులను ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టిందని మండిపడ్డారు. 1/4/ 2026 నుండి నాలుగు లేబర్ కోడ్స్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం హుకుం జారీ చేసింది. ఈ నాలుగు లేబర్ కోడ్స్ వెనుక కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపించారు. వారి లాభాలను, పెట్టుబడులను రక్షించడానికి ఈ నాలుగు లేబర్ కోడ్స్ ను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని మండిపడ్డారు.నాలుగు లేబర్ కోడ్స్ అమలులో యూనియన్లను ఏర్పాటు చేయడంకానీ, సమ్మెకు వెళ్లడం అసాధ్యం అవుతుందన్నారు. శాశ్వత ఉద్యోగాలు అదృశ్యం అవుతాయి. వాటి స్థానంలో ఎలాంటి ఉద్యోగ భద్రత లేని ఫిక్సడ్. టర్మ్ ఉపాధి వస్తుందని అన్నారు. కార్మికులుగా గుర్తింపు, పిఎఫ్ ఈఎస్ఐ అమలకై వేతన పరిమితుల ఆధారంగా ఆంక్షలు విధించారు. తొలగింపులు, ఫ్యాక్టరీ మూసివేతలకు అవసరమైన కార్మికుల సంఖ్యను పెంచారు. 10 నుండి 12 గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రమాదకర పరిశ్రమలతో సహా అన్ని రంగాలలో మహిళలు నైట్ షిఫ్ట్ లో పనిచేయడానికి ఇప్పుడు అనుమతి ఉంది. కార్మికుల భద్రత సౌకర్యాలు, వేతనాలు, బోనస్ యాజమాన్యాల దయా దక్షిణాలకు వదిలివేయబడ్డాయి. ఇలాంటి తరుణంలో 140 మే డే జరుపుకోవాలని ఈ మేడే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరుపుకోవాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య ( ఐఎఫ్టియు) పిలుపునిస్తుందన్నారు. కార్మికులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాడుగుల శంకర్, అప్పారావు, బాపు, రాజయ్య, కనకయ్య, సుధాకర్ గద్దల శంకర్, రాంబాబు, వెంకటయ్య, నర్సమ్మ, కోమల, సత్యఅక్క, విజయ, మల్లేశ్వరి, శారద, కవిత పాల్గొన్నారు.

సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించిన ప్రజా ప్రభుత్వం…

సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించిన ప్రజా ప్రభుత్వం

సీఎం, డిప్యూటీ సీఎం కు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

సోమవారం హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో సింగరేణి 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను దసరా పండుగ సందర్భంగా కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ను ప్రకటించింది. లాభాల్లో 34 శాతం కార్మికులకు పంచింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విలేకరుల సమావేశంలో తెలిపారు. కాగా, సింగరేణి లాభం మొత్తం రూ.2360 కోట్లు. అందులో కార్మికుల వాటా మొత్తం రూ. 819 కోట్లు. ఒక్కో కార్మికునికి రూ.1,95,610 ఇవ్వనున్నారు. ఈసారి కాంట్రాక్టు కార్మికులకూ రూ.5,500 చొప్పున బోనస్ను చెల్లించనున్నారు. దీంతో, భూపాలపల్లిలో 5,500 కార్మికులకు ప్రయోజనం కలుగుతుంది. కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ ఇవ్వడం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ రావు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లను వేరువేరుగా కలిసి పుష్పగుచ్చం అందించి ధన్యవాదాలు తెలిపారు.

గెలిపిస్తే నెల రోజుల్లో వేతనాలు పెంచుతామన్నారు .. ఏమైంది?

 

గెలిపిస్తే నెల రోజుల్లో వేతనాలు పెంచుతామన్నారు .. ఏమైంది?

సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ

శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

ఎన్నికలలో గెలిపిస్తే కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచుతామన్నారని, ఏమైందని సింగరేణి కార్మిక సంఘాల ( జేఏసీ) నాయకులు ప్రశ్నించారు.బుధవారం నాయకులు గట్టు మహేందర్, ఎస్సీ కేఎస్ (సిఐటియు) డివిజన్ కార్యదర్శి మాట్లాడుతూ..సింగరేణిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా,రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 22ను వెంటనే గెజిట్ చేసి కాంట్రాక్టు కార్మికుల వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు.ఈ నెల 22న జెఎసి సంఘాల ఆధ్వర్యంలో ఛలో ప్రజాభవన్ కు కాంట్రాక్టు కార్మికులు పెద్ద ఎత్తున తరలి రావాలనే పిలుపులో భాగంగా బుధవారం శ్రీరాంపూర్ ఓసిపిలో కాంట్రాక్టు కార్మికుల అడ్డలో జెఎసి నాయకులు ప్రచారం చేశారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్లు, బడాపెట్టుబడిదారుల అనుకూల విధానాలతో కార్మికుల బతుకులు దుర్భరంగా మారుతున్నాయని ఆరోపించారు.చేసే పనులకు అనుగుణంగా కనీస వేతనాలు లేక కుటుంబాలను పోషించుకో లేక సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం గతంలో విడుదల చేసిన 5 జీవోలను (,21,22,23,24,25) గెజిట్ చేయకుండా గత కేసీఆర్ ప్రభుత్వం కాలయాపన చేస్తే, నేడు మమ్మల్ని గెలిపిస్తే నెల రోజుల్లో వేతనాలు పెంచుతామని అధికారంలోకి వచ్చి,సంవత్సర కాలం గడిచిపోయిన నేటికీ కనీస వేతనాల జీవోల గెజిట్ ప్రస్తావన తీయకుండా కార్మికుల నమ్మకాన్ని వమ్ము చేయడం దుర్మార్గం అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం జీవో నెంబర్ 22ను వెంటనే గెజిట్ చేసి కాంట్రాక్టు కార్మికుల వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు.ఈ నెల 22 న ఛలో ప్రజాభవన్ కు పెద్ద ఎత్తున కార్మికులు కదలి రావాలని కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బెల్ట్ క్లీనింగ్, రోడ్డు క్లీనింగ్ కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version