కూతురి కిడ్నాప్కు యత్నం.. తల్లిదండ్రులపై కేసు
తల్లిదండ్రులపై ఓ కూతురు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
జగిత్యాల: ఎండపల్లి మండలం రాజారాంపల్లెలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. కన్న కూతురిని కిడ్నాప్ చేయడానికి తల్లిదండ్రులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వెల్గటూర్ పోలీస్ స్టేషన్లో కన్న తల్లిదండ్రులపై కూతురు ఫిర్యాదు చేసింది. వివరాళ్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా బసంత్నగర్ పాలకుర్తి గ్రామానికి చెందిన తమ్మిశెట్టి ప్రియాంక, వెల్గటూర్ మండలం రాజక్కపల్లె గ్రామానికి చెందిన మర్రి రాకేష్ల మధ్య 6 సంవత్సరాలుగా ప్రేమాయణం నడుస్తోంది.
అయితే.. రాకేష్ దళితుడు కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు వీరిద్దరి ప్రేమను ఒప్పుకోలేదు. దీంతో జులై 2న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో.. తనను తల్లిదండ్రులు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ప్రియాంక ఆరోపిస్తుంది. అలాగే.. వారి నుంచి తనకు, తన భర్త రాకేష్కు ప్రాణహాని ఉందని తెలిపింది. ఈ మేరకు వెల్గటూర్ పోలీస్ స్టేషన్లో ప్రియాంక ఫిర్యాదు చేసింది. ప్రియాంక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
