విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
ప్రభుత్వ విద్యా సంస్థలలో అభ్యసిస్తున్న విద్యార్థినీ విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధన అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.బుధవారం జిల్లాలోని నస్పూర్ మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తుందని,విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పోషక విలువలు కలిగిన మెనూ అమలు చేస్తుందని తెలిపారు.విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడంతో పాటు శుద్ధమైన త్రాగునీటిని అందించాలని తెలిపారు.ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని,తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు.విద్యార్థులు చేసిన అల్లికలు,కళాకృతులను పరిశీలించారు.10వ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాలలో అందిస్తున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.వార్షిక పరీక్షలకు సన్నద్ధం కావాలని, ఏకాగ్రతతో చదివి ఉన్నత ఫలితాలు సాధించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
