జ్యోతిరావు పూలే ఆశయాలు యువతకు మార్గదర్శకం
కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వివేకవర్థిని హైస్కూల్లో శనివారం మహానీయుడు జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి పూలే చేసిన సేవలు అపారమని పేర్కొన్నారు. విద్య ద్వారా మాత్రమే సమానత్వం సాధ్యమని, అజ్ఞానం, మూఢనమ్మకాల నుంచి బయటపడేందుకు పూలే చూపిన మార్గం ప్రతి ఒక్కరూ అనుసరించాలని సూచించారు. మహిళా విద్యకు ఆయన చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని తెలిపారు.
పూలే ఆశయాలను జీవితంలో ఆచరణలో పెట్టుకుంటేనే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని, విద్యార్థులు మంచి విలువలతో ఎదిగి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మారాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
