Employees Protest at Collector Office
కలెక్టర్ కార్యాలయం ముందు ఉద్యోగ సంఘాలు నిరసన
భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు, ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులు కార్మిక సంఘాల ప్రతినిధులు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో భారీగా జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ బూరుగు రవి, కన్వీనర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా 51 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలని, ప్రభుత్వ హెల్త్ స్కీమ్ను సమర్థవంతంగా అమలు చేయాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు.
అలాగే, సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ పద్ధతి (ఓపీఎస్)ను అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న డీఏలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల సంక్షేమాన్ని కాపాడే చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరింత తీవ్ర ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల కు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లింపు చేయాలని డిమాండ్ చేశారు. పదవి విరమణ తదుపరి బెనిఫిట్స్ రాక మనోవేదన కు గురై మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నిరసన కార్యక్రమానికి వివిధ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులు కార్మిక సంఘాల నాయకులు పెద్ద ఎత్తున హాజరై సంఘీభావం తెలిపారు.
