భగత్ సింగ్ జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలి
ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు దిడ్డి పార్థసారథి
నర్సంపేట,నేటిధాత్రి:
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో విప్లవ వీరుడు భగత్ సింగ్ 96వ వర్ధంతి సందర్భంగా ఏఐఎస్ఎఫ్ (అఖిల భారత విద్యార్థి సమాఖ్య) ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు ఘటించారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షులు దిడ్డి పార్థసారథి మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో యుక్తవయసులోనే బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన ధైర్యశాలి భగత్ సింగ్ అని తెలిపారు. చిరునవ్వుతో ఉరికంబం ఎక్కిన మహా వీరుడు భగత్ సింగ్ అని అన్నారు. భగత్ సింగ్ జీవితం భారత యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
భగత్ సింగ్ జయంతి, వర్ధంతులను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని, అలాగే భగత్ సింగ్కు దేశ అత్యున్నత పురస్కారం భారత్ రత్న ప్రదానం చేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. భగత్ సింగ్ వంటి మహనీయుల త్యాగాలను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత పాలకులదేనని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు జేరిపోతుల జనార్థన్, కుమ్మరి సాగర్, డివిజన్ నాయకులు అరె పవన్, కిరణ్, నవీన్, ఉదయ్, సుకుమార్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
