ఏఐసిడబ్ల్యూఎఫ్ ఆఫీస్ బేరర్ గా అల్లి రాజేందర్
మందమర్రి నేటి దాత్రి
ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్(ఏఐసిడబ్ల్యూఎఫ్) ఆఫీస్ బేరర్ గా పట్టణానికి చెందిన సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్(సిఐటియు) బ్రాంచ్ కార్యదర్శి అల్లి రాజేందర్ నియమితులయ్యారు. గత మూడు రోజులుగా జార్ఖండ్ రాష్ట్రం రాంచీ లో నిర్వహించిన మహాసభలకు సింగరేణి నుండి 30 మంది సిఐటియు యూనియన్ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ మహా సభలలో ఆఫీస్ బేరర్ లను ఎన్నుకోగా, యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి ని ఉపాధ్యక్షుడిగా, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వేజ్ బోర్డు కమిటీ సభ్యుడు మంద నరసింహారావు ను కార్యదర్శిగా, యూనియన్ మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి అల్లి రాజేందర్ ను ఆఫీస్ బేరర్ గా నియమితులయ్యారు. వీరితోపాటు మరో ఎనిమిది మందికి సైతం వర్కింగ్ కమిటీలో స్థానం కల్పించారు. ఈసందర్భంగా యూనియన్ బ్రాంచ్ అధ్యక్షుడు ఎస్ వెంకటస్వామి మాట్లాడుతూ, రానున్న రోజుల్లో వీరి నాయకత్వం లో యూనియన్ నిర్మాణం పెంచే విధంగా కమిటీ పని చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మందమర్రి బ్రాంచ్ నుండి అల్లి రాజేందర్ ను ఏఐసిడబ్ల్యూఎఫ్ ఆఫీస్ బేరర్ గా ఎన్నుకున్నందుకు ఫెడరేషన్ కమిటీకి, సిఐటియు రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. బ్రాంచ్ నుంచి ప్రతినిధికి ఫెడరేషన్ లో మంచి అవకాశం కల్పించడం హర్షనీయమని ఆనందం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో రాజేందర్ మరింత ఉన్నత స్థానానికి ఎదిగి, యూనియన్ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అల్లి రాజేందర్ కు బ్రాంచ్ తరపున శుభాకాంక్షలు తెలిపారు.