CM Meet Draws Sharp Criticism
సీఎం సభలో ప్రజలకు మాటలు కాంట్రాక్టర్లకు పనులు
సాధారణ ప్రజలకు ఒరిగింది ఏం లేదు
కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి అతుకూరి శ్రీధర్
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా నస్తూరుపల్లి గ్రామంలో నిర్వహించిన ముఖ్యమంత్రి సభపై కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి అతుకూరి శ్రీధర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వెనుకబడిన ఈ ప్రాంతానికి అభివృద్ధి బాటలు వేస్తారని, పరిశ్రమలు తీసుకొస్తారని ప్రజలు ఆశగా ఎదురు చూశారు కానీ సభ ముగిసేసరికి ప్రజలకు మాటలు తప్ప ఏమీ దక్కలేదని విమర్శించారు.
కాటారం సబ్ డివిజన్ పరిధిలోని అనేక గ్రామాల్లో ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం సరిగా లేకపోవడం, రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. తాగునీరు, వైద్యం, విద్య, ఉపాధి వంటి కనీస అవసరాలు కూడా అందుబాటులో లేక ప్రజలు నానా కష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు.ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులలో ఇప్పటివరకు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదని ఆరోపించారు. ప్రజల సమస్యలు వినేందుకు ఏర్పాటు చేసిన వేదిక కూడా ప్రహసనంగా మారిందని విమర్శించారు.
ముఖ్యమంత్రి రాక సందర్భంగా కాటారంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని అతుకూరి శ్రీధర్ మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులను అణగదొక్కి, కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టే ప్రభుత్వ ధోరణి ప్రమాదకరమన్నారు.
ప్రజలకు హామీలు, కాంట్రాక్టర్లకు లాభాలు, నిరసన తెలిపిన పేదలకు అరెస్టులు — ఇదే ఈ ప్రభుత్వ అసలు ముఖచిత్రమని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికైనా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై స్పష్టమైన చర్యలు తీసుకోకపోతే ప్రజలతో కలిసి ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు
