Land Survey for ATC in Parkal
అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్కు భూమి పరిశీలన
పరకాల,నేటిధాత్రి
పట్టణ కేంద్రంలో నిర్మించనున్న అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ (ఏటీసీ) ఏర్పాటుకు సంబంధించి భూమిని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరకాల ప్రాంత యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలను పెంచేందుకు అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ కీలకంగా మారుతుందని తెలిపారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శిక్షణ అందించడం ద్వారా యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగావకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నదని ఆయన తెలిపారు.ఈ నేపథ్యంలో పరకాలలో ఏర్పాటు చేయనున్న ఏటీసీ పట్టణ అభివృద్ధికి దోహదపడటంతో పాటు యువతకు నైపుణ్య కేంద్రంగా నిలుస్తుందని చెప్పారు.పట్టణాన్ని విద్యా కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాజుపేట సమీపంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్,నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాల,ప్రభుత్వ ఆసుపత్రి, అలాగే ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేపడుతున్నట్లు వెల్లడించారు.పట్టణానికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలంటే ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
