Summer Safety Awareness
వేసవిలో తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
జైపూర్,నేటి ధాత్రి:
వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా పాటించవలసిన జాగ్రత్తలపై ప్రజలకు వివరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శుక్రవారం జిల్లాలోని లక్షెట్టిపేట మండల కేంద్రంలో గల 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అవుట్ పేషంట్ రిజిస్టర్,మందుల నిల్వలు, ఆసుపత్రిలోని వార్డులు, పరిసరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని,వేసవి అయినందున వడదెబ్బ తగలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు వివరించాలని తెలిపారు.వైద్యులు,సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని,వేసవి దృష్ట్యా వడదెబ్బ విషయమై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.ఆసుపత్రిలో కొనసాగుతున్న పోస్టుమార్టం పనులను పరిశీలించి త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి భోజనశాల,అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు.విద్యార్థుల సంఖ్యను పరిశీలించి మరింత పెంపొందించే విధంగా ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.వంటశాలను సందర్శించి విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం,శుద్ధమైన త్రాగునీటిని అందించాలని,విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
