ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి చల్లా ధర్మారెడ్డి
నడికూడ,నేటిధాత్రి:
రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని ఓడిన గెలిచిన ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీ తరఫున సర్పంచ్ పదవికి పోటీ చేసి ఓటమిపాలైన కంఠాత్మకూర్, సర్వాపూర్ గ్రామాల అభ్యర్థులను మాజీ ఎమ్మెల్యే పరామర్శించారు.ఈ సందర్భంగా వారు అభ్యర్థులకు మనోధైర్యం కల్పిస్తూ,ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, ఓటమితో పోరాటస్ఫూర్తి తగ్గదని స్పష్టం చేశారు.
గ్రామాల అభివృద్ధి,ప్రజల సమస్యల పరిష్కారం కోసం అంకితభావంతో పనిచేయాలన్నారు.ఎన్నికల్లో ఫలితం ఎలా ఉన్నా,పార్టీ కోసం నిలబడి పోరాడిన ప్రతి నాయకుడికి,కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ ఎన్నికల ఫలితాలను పునఃసమీక్ష చేసుకొని, లోపాలను సరిదిద్దుకుంటూ రాబోయే ఎన్నికల్లో మరింత సన్నద్ధంగా ప్రజల్లోకి వెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
