కులగణన దేశ చరిత్రలో మైలురాయి
-ఉనికి కోసమే ప్రతిపక్షాల రాజకీయ నాటకాలు
-విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ నేత చేవ్వ శేషగిరి యాదవ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:
కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టడం దేశ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని బిజెపి నేత చేవ్వ శేషగిరి యాదవ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 1931లో చివరిసారి బ్రిటిష్ ప్రభుత్వం కులగణన చేపట్టిందని, 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కులగణనపై ఎందుకు నిర్ణయం తీసుకోలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ సిఫారసు చేసిన బీసీ కమిషన్ ను కాంగ్రెస్ పార్లమెంట్ లో చర్చకు తీసుకురాకుండా తిరస్కరించిన చరిత్ర మర్చిపోవద్దన్నారు. నెహ్రూ నుండి ఇందిరా, రాజీవ్ గాంధీ వరకు కాంగ్రెస్ నాయకులు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నారని ఆరోపించారు. కులగణన విషయంలో తెలంగాణ మోడల్ రాహుల్ గాంధీ అని రేవంత్ రెడ్డి మాట్లాడడం మొసలి కన్నీరేనన్నారు. తెలంగాణలో 12 శాతం ముస్లింలు ఉండగా..10 శాతం ఓబీసీలుగా చూపించి బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ మాదిరిగా కాకుండా..పాలనలో అనుభవం కలిగిన గొప్ప నాయకుడిగా ప్రధాని మోడీ పారదర్శకంగా జనాభా లెక్కలతో పాటు కులగణన చేపడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.