న్యాల్కల్ లో ఉర్సు: గంధం ఊరేగింపుతో ఆధ్యాత్మిక వాతావరణం
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలో ఉర్సు సందర్భంగా సోమవారం రాత్రి గంధం ఊరేగింపు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. దర్గా ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఈ ఊరేగింపులో అలంకరించిన గుర్రం, డప్పుల మోగుడు, భక్తుల నినాదాలతో పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయాయి. గంధపు సువాసన, దువాలు, సలాం మధ్య ఊరేగింపు ప్రధాన వీధుల గుండా కొనసాగింది. ఊరేగింపును తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఉర్సు సందర్భంగా దర్గా పరిసరాలను విద్యుత్ దీపాలు, పతాకాలతో అందంగా అలంకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు తాగునీరు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయగా, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
