రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత..

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

నేటి ధాత్రి:-( శ్రీరాంపూర్)

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటుచేసిన అరైవ్-ఆలైవ్ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు ఎవరైనా సరే తప్పని సరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరిస్తూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ట్రాఫిక్ నియమాల,ప్రాముఖ్యత వివరించారు.

ఖచ్చితంగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని, అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా భావించినప్పుడే రోడ్డు ప్రమాదాలను సమర్థవంతంగా నివారించవచ్చన్నారు. రోడ్డు ప్రమాదాలను ఎక్కువ శాతం నిర్లక్ష్యం వాళ్లే జరుగుతున్నాయని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, ఇలాంటి కారణాలే దీనికి ప్రధాన కారణాలు అన్నారు. వీటిని అధిగమించే ప్రతి ఒక్కరూ సురక్షితమైన ప్రయాణం దిశగా ప్రయాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జైపూర్ సిఐ నవీన్ కుమార్, శ్రీరాంపూర్ సీఐ అశోక్, ఎస్సై లు మేకల సంతోష్, రాజశేఖర్, లక్ష్మీ ప్రసన్న, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.

రోడ్డు భద్రతపై డీజీపీ హెచ్చరిక…

రోడ్డు భద్రతపై డీజీపీ హెచ్చరిక.

హెల్మెట్ తప్పనిసరి.. ప్రాణ రక్షణే లక్ష్యం.

మహబూబ్ నగర్/ నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లి చౌరస్తాలో గురువారం పోలీసులు నిర్వహించిన అరైవ్–అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి హాజరై వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడంతో పాటు బటన్ సరిగా పెట్టుకోవాలని సూచించారు.

ప్రమాదాల సమయంలో హెల్మెట్ బిగించకపోతే అది ఎగిరిపోవడంతో తలకు తీవ్ర గాయాలు జరిగి ప్రాణనష్టం కలుగుతోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా.. ప్రతి ఏడాది సుమారు 8 వేల మంది వివిధ కారణాలతో..మృతి చెందుతుండగా.. వారిలో దాదాపు 7,500 మంది రోడ్డు ప్రమాదాల వల్లే ప్రాణాలు కోల్పోతున్నారని డీజీపీ వెల్లడించారు. నాలుగు చక్రాల వాహనదారులు తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలని సూచించారు. అనంతరం వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి, గద్వాల రేంజ్ డీఐజీ ఎల్.ఎస్ చౌహన్, ఎస్పీ డి. జానకి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, మండలంలోని పలు గ్రామాలకు చెందిన వాహనదారులు పాల్గొన్నారు.

నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి..

నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

వాహనదారులు రహదారి భద్రతా నిబంధనలను పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం నుండి జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ లో భాగంగా ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీలో డి.సి.పి. ఎ.భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, గుడిపేట పోలీస్ బెటాలియన్ అడ్మిన్ వెంకటరాములు,జిల్లా రవాణా అధికారి గోపికృష్ణ లతో కలిసి జెండా ఊపి ప్రారంభించి పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రహదారి భద్రత నిబంధనలను పాటించాలని, ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అరైవ్ – అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ప్రతి వాహనదారుడు రహదారి భద్రత నిబంధనలను పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని తెలిపారు.వాహనదారులు జాగ్రత్తగా వాహనాలను నడపాలని,రోడ్డు ప్రమాదం అంటే ఒక కుటుంబానికి జరిగే ప్రమాదమని తెలిపారు.జిల్లాలో రహదారులపై లైట్లు,బ్లైండ్ స్పాట్లను గుర్తించి తగు ఏర్పాట్ల చేయడం జరుగుతుందని,సిగ్నల్ వ్యవస్థలను ఏర్పాటు చేసి వాహనాలను నియంత్రించడం జరుగుతుందని తెలిపారు.అనుభవానికి, ప్రమాదానికి సంబంధం లేదని, వాహనం నడిపే సమయంలో ఏకాగ్రతతో నడపాలని తెలిపారు.ద్విచక్ర వాహనదారులు,వెనుక కూర్చునే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,కార్ లో ప్రయాణించే ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ ధరించాలని తెలిపారు.ప్రతి వాహనానికి సంబంధించి ధ్రువపత్రాలు కలిగి ఉండాలని, వాహనదారులు మద్యం సేవించి, మొబైల్ వినియోగిస్తూ వాహనాలు నడపకూడదని,రాంగ్ రూట్ లో వాహనం నడపకూడదని తెలిపారు.తనిఖీలలో మద్యం సేవించి వాహనం నడుపుతూ దొరికినట్లైతే సంబంధిత వాహనదారుడి లైసెన్స్ సస్పెండ్ చేయడం జరుగుతుందని,18 సంవత్సరాల వయసు నిండని వారు వాహనాలు నడపకూడదని, ఒకవేళ నడిపినట్లయితే వారి తల్లితండ్రులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.రహదారులపై పరిమిత వేగాన్ని పాటించాలని,రవాణా వాహనాలు పరిమిత లోడ్ రవాణా చేయాలని తెలిపారు.పోలీస్,రవాణా శాఖల సమన్వయంతో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకున్నప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వామ్యలై వాహనాలను నిబంధనలకు లోబడి జాగ్రత్తగా నడపాలని తెలిపారు.అతివేగం చాలా ప్రమాదమని,వేగం పరిమితిలో ఉండి నిబంధనలు పాటించినట్లయితే గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకోవచ్చని తెలిపారు.రోడ్డు భద్రత నిబంధనలను కఠినంగా అమలు చేయడం జరుగుతుందని, ఇందులో భాగంగా బ్రీత్ ఎనలైజర్స్,స్పీడ్ గన్స్ అవసరం మేరకు సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.వాహనం నడిపే సమయంలో మనం పాటించే చిన్న చిన్న విషయాలే మన ప్రాణాలను కాపాడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version