నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
వాహనదారులు రహదారి భద్రతా నిబంధనలను పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం నుండి జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ లో భాగంగా ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీలో డి.సి.పి. ఎ.భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, గుడిపేట పోలీస్ బెటాలియన్ అడ్మిన్ వెంకటరాములు,జిల్లా రవాణా అధికారి గోపికృష్ణ లతో కలిసి జెండా ఊపి ప్రారంభించి పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రహదారి భద్రత నిబంధనలను పాటించాలని, ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అరైవ్ – అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ప్రతి వాహనదారుడు రహదారి భద్రత నిబంధనలను పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని తెలిపారు.వాహనదారులు జాగ్రత్తగా వాహనాలను నడపాలని,రోడ్డు ప్రమాదం అంటే ఒక కుటుంబానికి జరిగే ప్రమాదమని తెలిపారు.జిల్లాలో రహదారులపై లైట్లు,బ్లైండ్ స్పాట్లను గుర్తించి తగు ఏర్పాట్ల చేయడం జరుగుతుందని,సిగ్నల్ వ్యవస్థలను ఏర్పాటు చేసి వాహనాలను నియంత్రించడం జరుగుతుందని తెలిపారు.అనుభవానికి, ప్రమాదానికి సంబంధం లేదని, వాహనం నడిపే సమయంలో ఏకాగ్రతతో నడపాలని తెలిపారు.ద్విచక్ర వాహనదారులు,వెనుక కూర్చునే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,కార్ లో ప్రయాణించే ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ ధరించాలని తెలిపారు.ప్రతి వాహనానికి సంబంధించి ధ్రువపత్రాలు కలిగి ఉండాలని, వాహనదారులు మద్యం సేవించి, మొబైల్ వినియోగిస్తూ వాహనాలు నడపకూడదని,రాంగ్ రూట్ లో వాహనం నడపకూడదని తెలిపారు.తనిఖీలలో మద్యం సేవించి వాహనం నడుపుతూ దొరికినట్లైతే సంబంధిత వాహనదారుడి లైసెన్స్ సస్పెండ్ చేయడం జరుగుతుందని,18 సంవత్సరాల వయసు నిండని వారు వాహనాలు నడపకూడదని, ఒకవేళ నడిపినట్లయితే వారి తల్లితండ్రులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.రహదారులపై పరిమిత వేగాన్ని పాటించాలని,రవాణా వాహనాలు పరిమిత లోడ్ రవాణా చేయాలని తెలిపారు.పోలీస్,రవాణా శాఖల సమన్వయంతో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకున్నప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వామ్యలై వాహనాలను నిబంధనలకు లోబడి జాగ్రత్తగా నడపాలని తెలిపారు.అతివేగం చాలా ప్రమాదమని,వేగం పరిమితిలో ఉండి నిబంధనలు పాటించినట్లయితే గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకోవచ్చని తెలిపారు.రోడ్డు భద్రత నిబంధనలను కఠినంగా అమలు చేయడం జరుగుతుందని, ఇందులో భాగంగా బ్రీత్ ఎనలైజర్స్,స్పీడ్ గన్స్ అవసరం మేరకు సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.వాహనం నడిపే సమయంలో మనం పాటించే చిన్న చిన్న విషయాలే మన ప్రాణాలను కాపాడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
