పి.ఆర్.సి మరియు పెండింగ్ లో ఉన్న డి.ఏలు వెంటనే ప్రకటించాలి
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ డిమాండ్
రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉద్యోగ విరమణ చేసిన రోజే చెల్లించాలి.
హెల్త్ కార్డుల మంజూరీ ప్రక్రియ వేగవంతం చేయాలి.
సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి.
కేసముద్రం/ నేటి ధాత్రి
ఉద్యోగ,ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న అన్ని డి. ఏ లను ప్రకటించాలని, మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పీఆర్సీని వెంటనే అమలు చేయాలని తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గురువారం కేసముద్రం స్టేషన్ ఉన్నత పాఠశాలలోటిపిటిఎఫ్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ అధ్యక్షుతన మండల కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా సమావేశాన్ని ఉద్దేశించి మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ మాట్లాడుతూ
మారుతున్న జీవన ప్రమాణాలను, ధరలను, అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఒక డీ.ఏ ను, ఐదు సంవత్సరాలకు ఒకసారి పి ఆర్ సి ని ప్రకటిస్తుందని కానీ ఆర్థిక మాంధ్యాన్ని సాకుగా చూపించి
ఏళ్లు గడిచినా పి.ఆర్.సి మరియు డి.ఏ లను ఇంకా ఆలస్యం చేస్తూ ఉద్యోగ ఉపాధ్యాయులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తుందని ఆయన విమర్శించారు. ఇది సరైన పద్ధతి కాదని, తక్షణమే వీటి అమలుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయులు 30 -35 సంవత్సరాలు విద్యార్థులకు సేవలందించి ఉద్యోగ విరమణ పొందుతున్న ఉపాధ్యాయులకు రిటైర్ అయిన రోజే గ్రాట్యుటీ, పీఎఫ్, పెన్షన్ మొదలైన అన్ని రిటైర్మెంట్ బెనిఫిట్స్ పూర్తిగా చెల్లించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేయాలని, పెండింగ్ అన్ని రకాల బెనిఫిట్స్ ని తక్షణమే మంజూరు చేయాలని కోరారు.
ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత కోసం ఇటీవలే ప్రభుత్వం ప్రారంభించిన హెల్త్ కార్డుల ప్రక్రియను వేగవంతం చేయాలని, వాటి వినియోగంలో ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని, ఏ కార్పొరేట్ ఆస్పత్రిలో అయినా అన్ని రకాల నగదు రహిత వైద్యం అందేలా రూపొందించాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల భవిష్యత్ భద్రత, జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతున్న , వారి జీవితాలను అగమ్యగోచరం చేస్తున్న
సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించి వారి కుటుంబాలలో వెలుగులు నింపాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల శాఖ ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు, జిల్లా కార్యదర్శి చీకటి వెంకట్రాం నర్సయ్య, ఉపాధ్యక్షులు కొమ్ము రాజేందర్, అంజన్న,కార్యదర్శులు ఊట్కూరు ప్రణయ్ కుమార్, వీసం నర్సయ్య, మోహనకృష్ణ,, బొల్లెద్దు చందర్ , ఆడిట్ కమిటీ కన్వీనర్ బి శ్రీనివాస్ అక్కడ మీకు సెల్ కన్వీనర్ జి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
