సమాచార హక్కు చట్టం ద్వారా పౌరులు కోరిన సమాచారం ఇవ్వాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి నేటిధాత్రి
సమాచార హక్కు చట్టం ద్వారా పౌరులు కోరిన సమాచారాన్ని నిర్దేశిత వ్యవధిలోగా అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన “సమాచార హక్కు చట్టం 2005” వారోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంలో సమాచార హక్కు చట్టం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
పౌరులు కోరిన సమాచారాన్ని సకాలంలో అందించడం ప్రతి అధికారి బాధ్యతగా భావించాలని సూచించారు. అలాగే స్వచ్ఛందంగా ఇవ్వాల్సిన సమాచారాన్ని పౌరులకు సులభంగా అందుబాటులో ఉంచే విధంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.
అంతకుముందు ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బందితో సమాచార హక్కు చట్టాన్ని గౌరవిస్తూ పౌరులు కోరిన సమాచారాన్ని సకాలంలో అందిస్తానని, స్వచ్ఛందంగా ఇవ్వవలసిన సమాచారాన్ని పౌరులకు అందుబాటులో ఉండేలా వ్యవహరిస్తారని, పనితీరులో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పాటిస్తూ పని చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఎస్డిసి రమేష్, ట్రైని డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
