ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో ప్రజలు భాగస్వామ్యం కావాలి
10వ వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్
నర్సంపేట,నేటిధాత్రి:
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో ప్రజలు చురుకుగా భాగస్వామ్యం కావాలని 10వ వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా 10వ వార్డు పరిధిలోని పోచమ్మ ఆలయం వద్ద వార్డు సభ నిర్వహించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల వద్దకు చేర్చడం, ప్రజా సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడం కోసం వార్డు సభలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రజలు అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని పేర్కొన్నారు.
వార్డులో డ్రైనేజ్ సమస్యలు, మట్టి రోడ్లు, మంచినీటి సరఫరా, వీధి దీపాలు, పరిశుభ్రత వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని తెలిపారు.వార్డు అభివృద్ధి కోసం ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని, చెట్లను పెంచుతూ పరిశుభ్రమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని చెప్పారు.అనంతరం వార్డు ప్రజలతో వివిధ సమస్యలపై చర్చించి, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్, డీఎల్పీఓ రాజీవ్ కుమార్, వార్డు ఆఫీసర్ మహమ్మద్ రహీం పాషా, పల్లె దవాఖాన డాక్టర్ భావన, విద్యుత్ లైన్మన్ రాజు, ఆర్పి సువర్ణ, బీసీ హాస్టల్ వార్డెన్ భాస్కర్, వార్డు సభ్యులు కొలువుల వెంకట్, అరెపెల్లి బాబు, లక్క రాజు, ఆవుల శ్రీకాంత్, పున్నం రాజు, ఎడెల్లి అశోక్, మామిడాల సదాలక్ష్మి, ఉదయగిరి నాగమణి, సరిత తదితరులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
