5 వేల సుపారీ కోసం గాంజా గ్యాంగ్ దాడులు..

5 వేల సుపారీ కోసం గాంజా గ్యాంగ్ దాడులు..

వరంగల్ నగరంలో భయానక వాతావరణం..

రూ.5 వేల సుపారీ కోసం ప్రణాళికాబద్ధంగా దాడి.

బండరాయితో విచక్షణారహితంగా కొట్టి వీడియో చిత్రీకరణ.

సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేసి సంచలనం.

నిందితులను పట్టుకున్న మిల్స్ కాలనీ పోలీసులు.

వరంగల్, నేటిధాత్రి.

వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దాడి ఘటనను పోలీసులు వేగంగా ఛేదించి నిందితులను కేవలం 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై క్రైం నం. 244/2026 కింద భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 140(4), 109(1), 118(1), 61(2), 49, 238 రెడ్ విత్ 190 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం, మార్చి 17, 2026న ఉదయం సుమారు 10 గంటల సమయంలో ఎస్‌ఆర్ నగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తాళ్లపెల్లి రాయలమ్మ (45), సురేష్ తన కుటుంబంపై అపవాదాలు చేస్తూ దూషిస్తున్నాడని భావించి, పసునూరి కల్యాణ్ (23)కు రూ.5 వేల సుపారీ ఇస్తానని ప్రలోభపెట్టింది. దీంతో కల్యాణ్ తన స్నేహితులు భానోతు జగన్ నాయక్ (16), పల్లపు నరేందర్ @ టింకు (20)తో కలిసి సురేష్‌ను కిరాణా దుకాణం వద్ద నుంచి బలవంతంగా బైక్‌పై ఎక్కించుకొని కోటిలింగాల గుడి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు.

అక్కడ కల్యాణ్ తన సెల్‌ఫోన్‌ను జగన్‌కు ఇచ్చి వీడియో చిత్రీకరింపజేస్తూ, సురేష్‌పై బండరాయితో దాడి చేసి, కాళ్లతో తన్నుతూ, పిడిగుద్దులు గుద్దినట్లు పోలీసులు తెలిపారు. దాడి తీవ్రతతో సురేష్ స్పృహ కోల్పోవడంతో చనిపోయాడని భావించి అక్కడే వదిలివెళ్లారు. అనంతరం ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయగా, శివ మరియు పల్లకొండ జశ్వంత్ @ నాని (18) సహాయంతో బాధితుడిని ఆటోలో తీసుకువచ్చి ఇంటి సమీపంలో వదిలివెళ్లినట్లు దర్యాప్తులో బయటపడింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ కేసులో పసునూరి కల్యాణ్, తాళ్లపెల్లి రాయలమ్మ, భానోతు జగన్ నాయక్ (జువెనైల్), పల్లపు నరేందర్ @ టింకు, పల్లకొండ జశ్వంత్ @ నాని లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా రాజ్‌కుమార్, శివ, పసునూరి సరిత పరారీలో ఉన్నట్లు తెలిపారు.

నిందితుల నుంచి ఒక ఆటో, నాలుగు మొబైల్ ఫోన్లు, దాడికి ఉపయోగించిన బండరాయి స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులపై గతంలో కూడా ఏనుమాముల మరియు గీసుగొండ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఏఎస్‌పీ వరంగల్ ఆదేశాల మేరకు మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ బి. రమేష్ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు, సిబ్బంది కలిసి వేగంగా స్పందించి 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.

ఉర్సు దర్గా ప్రాంతంలో పూలే విగ్రహ స్థలం కబ్జా ప్రయత్నం?

ఉర్సు దర్గా ప్రాంతంలో పూలే విగ్రహ స్థలం కబ్జా ప్రయత్నం?

పూలే విగ్రహ స్థలంలో వెలసిన డబ్బా..! కబ్జాదారుడికి వెనకున్న “హస్తం” ఎవరిది..?

బీసీ వర్గాల నాయకుడి విగ్రహ స్థలాన్ని కబ్జా చేయడం సమంజసమా?

నేటిధాత్రి, వరంగల్.

 

ఉర్సు దర్గా ప్రాంతంలో జ్యోతిబా పూలే దంపతుల కాంస్య విగ్రహాల నిర్మాణం జరగాల్సిన స్థలం వివాదాస్పదంగా మారింది.

ఈ విగ్రహ నిర్మాణం కోసం సిమెంట్ బ్రిక్స్, అవసరమైన సామాగ్రి ఇప్పటికే సిద్ధంగా ఉండగా, రాత్రికి రాత్రే ఆ స్థలంలో “ఓ వర్గానికి” చెందిన వ్యక్తి డబ్బా కొట్టు ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది.

గతంలో ఇక్కడ ఉన్న విగ్రహం కూలగొట్టిన దుండగుడు. అదే స్థానంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడానికి మాజీ ఎమ్మెల్యే ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.. అయితే విగ్రహ నిర్మాణ ప్రణాళికకు ఈ చర్య పెద్ద ఆటంకం కలిగించే అవకాశముంది.

ఈ ఘటనపై స్థానిక బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “సామాజికవాద పితామహుడు జ్యోతిబా పూలే జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేయాలనుకుంటున్న స్థలాన్ని కబ్జా చేయడం సిగ్గుచేటు చర్య”గా పేర్కొన్నాయి.

విగ్రహ నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశాయి.

ఇక మున్సిపల్ అధికారులు, స్థానిక మిల్స్ కాలనీ పోలీసులు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

స్థలం కబ్జా ప్రయత్నం మధ్య పూలే విగ్రహ నిర్మాణం కొనసాగుతుందా లేదా అనే ప్రశ్న ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది

దోచిన సొమ్మును దోసుకుపోయారు..!

దోచిన సొమ్మును దోసుకుపోయారు..!

నకిలీ ఏసీబీ అధికారుల పేరిట టోకరా

వరంగల్ ఆర్టీఏ అధికారులకు ఫోన్ చేసి రూ.10లక్షల 20వేలు లాగేసిన దుండగులు

ఏసీబీ డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లిన బాధిత ఎంవీఐ

మిల్స్ కాలని పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసిన ఆర్టీఏ అధికారులు

జరిగిన సంఘటనను ధృవీకరించిన వరంగల్ ఆర్టీఏ అధికారులు

నేటిధాత్రి, వరంగల్.

 

ఏసీబీ అధికారులమంటూ చెప్పి ఆర్టీఏ అధికారులను మోసం చేసిన ఘటన వరంగల్‌లో సంచలనం సృష్టించింది. నకిలీ ఏసీబీ అధికారుల పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు వరంగల్ ప్రాంతంలోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లను (ఎంవీఐలు) సంప్రదించి రూ.10 లక్షల 20 వేల రూపాయలు లాగేశారు. ఇటీవల ఏసీబీ బృందాలు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ చెక్ పోస్టులపై దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ నకిలీ గ్యాంగ్ ఆ అవకాశం దక్కించుకుంది.

 

సమాచారం మేరకు, అక్టోబర్ 18న, 98868 26656, 98804 72272, 95919 38585 నంబర్ల నుంచి వరుసగా ఎంవీఐలకు ఫోన్లు చేశారు. “మీపై అవినీతి ఆధారాలు ఉన్నాయి, అరెస్ట్ కాకుండా ఉండాలంటే డబ్బులు పంపించండి” అంటూ బెదిరించగా, భయంతో ఎంవీఐలు దశలవారీగా రూ.10 లక్షల 20వేలు తెలియని అకౌంట్లకు పంపినట్లు సమాచారం. తర్వాత జైపాల్ రెడ్డి ఎంవీఐకి అనుమానం రావడంతో వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్యను సంప్రదించాడు. విచారణ జరిపిన డీఎస్పీ “అలాంటి కాల్స్ మేము చేయమని, ఇలాంటి వ్యక్తులు నకిలీ ఏసీబీ పేరుతో మోసం చేస్తున్నారు” అని స్పష్టం చేశారు. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు అధికారులకు సూచించారు. అయితే, మోసపోయిన అంశం బయటకు రావద్దని ఎంవీఐలు గుట్టుగా ఉంచేందుకు ప్రయత్నించినట్టు సమాచారం.

 

ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, మిల్స్ కాలనీ పోలీసులు మాత్రం ఇప్పటివరకు అధికారిక ఫిర్యాదు అందలేదని తెలిపారు. ఇదే అంశంపై నేటిధాత్రి వరంగల్ ప్రతినిధి ఫోన్ ద్వారా ఆర్టీఏ అధికారులను సంప్రదించగా నిజమే అని తెలిపారు. పోలీసు స్టేషన్ లో సైతం పిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇక ఈ ఘటనపై చర్చలు ముదురుతున్నాయి. అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడంపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏసీబీ అధికారుల పనిని, నకిలీ ఏసీబీ అధికారులు పేరిట దుండగులు చేయడంతో వరంగల్ ఆర్టీఏ కార్యాలయంలో కలకలం రేగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version