తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాలలో పాఠ్యంశంగా చేర్చాలి
సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్
కరీంనగర్, నేటిధాత్రి:
తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాలలో పాఠ్యంశంగా చేర్చాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాల సందర్భంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామంలో రైతాంగ సాయుధ పోరాట అమరులు గుండి దామోదర్ రావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈసందర్బంగా పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిందని, నాలుగు వేల ఐదు వందల మంది అమరుల ప్రాణత్యాగంతో నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణకు స్వాతంత్రం సిద్ధించిందని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న అమరులను స్మరించుకుంటూ వారి యొక్క పోరాట స్ఫూర్తితో యువ కమ్యూనిస్టులు పాలక ప్రభుత్వాల విధానాలపైన పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి ఉమ్మెంతుల రవీందర్ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చ రమేష్, సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు గంటే రాజేశం, గుండి గ్రామ ఉపసర్పంచ్ మేడి శ్రీనివాస్, ముంజాల ప్రవీణ్ గౌడ్, మేకల నాగరాజు, దికొండ కుమారస్వామి, మచ్చ నరసయ్య ,ఏగుర్ల మల్లేశం, మచ్చ హరీష్ ,ఎండి అజీమ్, మహబూబ్ తదితరులు పాల్గొన్నారు.