విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్లు ఇంటర్న్‌షిప్ సమస్య..

*విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్లు ఇంటర్న్‌షిప్ సమస్య..

*లోక్‌సభలో ప్రశ్నించిన తిరుపతి ఎంపి గురుమూర్తి..

తిరుపతి( నేటి ధాత్రి)జూలై 25:

ఆంధ్రప్రదేశ్‌లో విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్లు ఎదుర్కొంటున్న ఇంటర్న్‌షిప్ సమస్యల గురించి తిరుపతి ఎంపి మద్దిల గురుమూర్తి పార్లమెంటులో ప్రశ్నించారు. ఇదే సమస్యపై గతంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన ఎంపి శుక్రవారం మరోసారి పార్లమెంటు ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు.
ఆంధ్రప్రదేశ్‌లో విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్లు తప్పనిసరిగా మూడేళ్ల కోర్సు చేయాలని నిబంధన ఉందని కేంద్ర ప్రభుత్వానికి తెలుసా,ఈ నిబంధన ఇతర రాష్ట్రాలలో ఉన్న ఇంటర్న్‌షిప్ వ్యవధి, స్టైపెండ్‌కు భిన్నంగా ఉన్నాయా, ఆంధ్రప్రదేశ్‌తో సహా ఇతర రాష్ట్రాలలో ఇంటర్న్‌షిప్ పరిస్థితులలో వ్యత్యాసాలకు కారణాలు ఏమిటి, జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకాల ప్రకారం, అన్ని రాష్ట్రాలలో ఇంటర్న్‌షిప్ వ్యవధిలో ఒకటే నిబంధన ఉండేలా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది,
ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందా, అలా అయితే వివరాలు తెలుపగలరు అని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ సమాధానం ఇచ్చారు. విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లు భారతదేశంలో వైద్యం చేయడానికి లైసెన్స్ లేదా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ పొందడానికి నేషనల్ మెడికల్ కమిషన్ 2021లో జారీ చేసిన నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు.ఈ నియమాలు దేశవ్యాప్తంగా విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లు అందరికీ ఒకేలా వర్తిస్తాయని పేర్కొన్నారు. కంపల్సరీ రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్‌షిప్ కు సంబంధించిన నియమాలను నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలు 2021ని అనుసరించి నిర్వహించబడతాయని తెలిపారు.
కోవిడ్-19 మహమ్మారి, యుద్ధాలు వంటి పరిస్థితుల వలన విద్యను అభ్యసించడంలో వచ్చిన అడ్డంకులను దృష్టిలో ఉంచుకుని, నేషనల్ మెడికల్ కమిషన్ 2023 డిసెంబర్ 7న, 2024 జూన్ 19న పబ్లిక్ నోటీసుల ద్వారా కొన్ని మార్గదర్శకాలను జారీ చేసిందని తెలియజేసారునేషనల్ మెడికల్ కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలు గురించి వివరిస్తూ..
విదేశాలలో వైద్య, విద్యను అభ్యసిస్తూ చివరి సంవత్సరంలో బ్రేక్ వచ్చి, ఆన్‌లైన్ ద్వారా కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు 1 సంవత్సరం క్లినికల్ క్లర్క్‌ షిప్ చేయాలి. ఆ తర్వాత వైద్య కళాశాల నుండి లేదా గుర్తింపు పొందిన సంస్థలో 1 సంవత్సరం కంపల్సరీ రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్‌షిప్ చేయాలని పేర్కొన్నారు.
చివరి సంవత్సరానికి ముందు సంవత్సరంలో బ్రేక్ వచ్చి, ఆన్‌లైన్ ద్వారా కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు 2 సంవత్సరాల క్లినికల్ క్లర్క్‌ షిప్ చేయాలి. ఆ తర్వాత 1 సంవత్సరం కంపల్సరీ రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్‌షిప్ చేయాలని తెలిపారు.
ఆన్‌లైన్ క్లాసులకు బదులుగా నేరుగా హాజరై, సరిపడా ప్రాక్టికల్ శిక్షణ పొంది, పూర్తి కోర్సు ఉత్తీర్ణులైన విద్యార్థులు 1 సంవత్సరం కంపల్సరీ రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్‌షిప్ పూర్తయిన తర్వాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్‌కు అర్హులని తెలియజేశారునేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలు దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండేలా రూపొందించబడ్డాయని, వీటి విషయంలో రాష్ట్రాలు వేర్వేరు నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని కేంద్రం ప్రభుత్వం స్పష్టంగా చెప్పినట్లుగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
ఎంపి గురుమూర్తి స్పందన ; ఆంధ్రప్రదేశ్‌లో విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లకు మూడు సంవత్సరాల ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేస్తున్నారని, ఇది ఇతర రాష్ట్రాలలో అమలవుతున్న నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలలో వేర్వేరు ఇంటర్న్‌షిప్ వ్యవధి, స్టైపెండ్ పాలసీలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఈ విధానాన్ని అనుసరించడం వల్ల విద్యార్థులకు తీవ్ర ఆర్థిక, వృత్తి పరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఇటీవల విదేశీ వైద్య గ్రాడ్యుయేట్ల నిరసన కార్యక్రమంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఒకే విధమైన నిబంధనలు ఉండేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎంపి గురుమూర్తి డిమాండ్ చేసారు…

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బిజెపి చీకటి ఒప్పందం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో
బీఆర్ఎస్, బిజెపి చీకటి ఒప్పందం

కోట్లాది రూపాయల ధన
ప్రవాహంతోనే బిజెపి గెలుపు

కాంగ్రెస్ అభ్యర్థికి అండగా నిలిచిన నిరుద్యోగులు, పట్టభద్రులు, ఉద్యోగులు ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు

కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు

కరీంనగర్, నేటిధాత్రి:

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బిజెపి చీకటి ఒప్పందం చేసుకున్నాయని, కేసులకు భయపడే కెసిఆర్ బిజెపికి మద్దతు ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ఆరోపించారు. ఎన్నికల్లో బిజెపి కోట్లాది రూపాయలను వెదజల్లి ధన ప్రవాహంతోనే గెలిచిందని విమర్శించారు. గురువారం వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీకి భయపడే బిజెపితో కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకొని, లోపల నుంచి మద్దతు ఇచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలువద్దనే దురుద్దేశంతోనే బీఆర్ఎస్ బిజెపి ఒకటయ్యాయని పేర్కొన్నారు. కేసుల నుంచి బయటపడందుకే కేసీఆర్ కొత్త నాటకం ఆడారని, చేసిన పాపం ఊరికే పోదని చెప్పారు. నరేంద్ర మోడీ ఎక్కడ తమ కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేస్తాడని భయంతోనే కెసిఆర్ బిజెపికి సపోర్ట్ ఇచ్చారని మండిపడ్డారు. బిజెపి నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్లాది రూపాయలను విచ్చలవిడిగా వెదజల్లారని ఆరోపించారు. ఆ పార్టీ రోజు రోజుకు ఆదరణ కోల్పోతున్నదని, ప్రజలు నమ్మడం లేదని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నిరుద్యోగులకు పదేళ్ల కాలంలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారు వారికి ఏం న్యాయం చేశారు బిజెపి నేతలు ఆత్మవంచన చేసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి పిట్టకథలు చెప్పుకుంటూ కాలం వెళ్ళదిస్తున్నారు తప్ప గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించలేక పోయారని మండిపడ్డారు. దమ్ముంటే బిజెపి నేతలు కేంద్ర ప్రభుత్వం పదకోండు ఏళ్ల కాలంలో నిరుద్యోగులకు ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిందో వెల్లడించాలని సవాల్ విసిరారు. తమ ప్రభుత్వం ఏడాది కాలంలోనే యాభై ఐదువేల ఉద్యోగాలను కల్పించి నిరుద్యోగులకు అండగా ఉంటున్నదని, నిరుద్యోగుల పక్షపాతిగా తమ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి అండగా నిలిచిన నిరుద్యోగులు, ఉద్యోగులు, పట్టభద్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నరేందర్ రెడ్డి గెలుపు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబుతో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఎంతో కష్టపడి పని చేశారని పేర్కొన్నారు. వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు నిరంతరం అండగా ఉంటుందని రాజేందర్ రావు పేర్కొన్నారు. నిరుద్యోగులు, పట్టభద్రులు ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు పాటుపడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని వెలిచాల రాజేందర్ రావు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version