గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి
భూపాలపల్లి నేటిధాత్రి
మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
బుధవారం ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో మొదటి విడత గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 27వ తేదీ ఉదయం 10.30 గంటల లోపు ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించి గ్రామ పంచాయతీ కార్యాలయం, గ్రామపంచాయతీ ప్రధాన కూడళ్లలో ప్రదర్శింపచేయాలని అన్నారు. అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఓటరు జాబితా కూడా ప్రదర్శింపజేయాలని సూచించారు. నామినేషన్లు ప్రక్రియ ఉదయం 10:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందని ఈనెల 29వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించాలని తెలిపారు. 30వ తేదీన నామినేషన్లు పరీశీలన, డిసెంబర్ 1వ తేదీన అప్పీళ్లు, 2వ తేదీన డిస్పోజల్, 3వ తేదీన ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. నామినేషన్లు స్వీకరణకు 25 మంది 25 రిటర్నింగ్ అధికారులను నియమించామని తెలిపారు.
ప్రతి రిటర్నింగ్ అధికారుల కేంద్రాల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఒక వ్యక్తి గరిష్టంగా నాలుగు సెట్లు నామినేషన్ సెట్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. నామినేషన్ లో ఖచ్చితంగా తేదీ, సమయం, క్రమ సంఖ్య నమోదు చేయాలని సూచించారు. నామినేషన్లలో అభ్యర్థి సంతకం, ధ్రువీకరణ ప్రతిపాదకుని సంతకం ఉండాలని తెలిపారు. మొదటి విడతలో 4 మండలాల్లోని 82 గ్రామపంచాయతీల పరిధిలోని 712 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారి విధులు చాలా కీలకమని ఎన్నికలపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.
అనంతరం మాస్టర్ ట్రైనర్లు ఎన్నికల విదులపై పవర్ పాయింట్ ద్వారా అవగహన కల్పించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ట్రైని డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి , డిపిఓ శ్రీలత ఎంపీడీవోలు, రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
