సింగరేణి సంస్థ నిర్విర్యానికి కుట్రలు
బి ఎం ఎస్ ఏరియా ఉపాధ్యక్షులు నాతాడి శ్రీధర్ రెడ్డి
శ్రీరాంపూర్,నేటి ధాత్రి:
గత ప్రభుత్వం బీఆర్ఎస్ బాటలోనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థ నిర్వీర్యానికి కుట్రలు పన్నుతుందని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్(బిఎంఎస్) శ్రీరాంపూర్ ఉపాధ్యక్షులు నాతాడి శ్రీధర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఏరియాలోని బిఎంఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మణుగూరు ఏరియాలోని పీకే ఓసి–2 డీప్ సైడ్ (ఎక్స్టెన్షన్) బొగ్గు బ్లాక్ విషయంలో సింగరేణిని పక్కన పెట్టి జెన్కోను ముందుపెట్టి ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేయడం సింగరేణి మనుగడపై జరిగిన ప్రత్యక్ష దాడి అని విమర్శించారు.గతంలో తాడిచెర్ల బొగ్గు బ్లాక్ను ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించడం వల్ల సింగరేణికి జరిగిన నష్టాన్ని కార్మికులు మాత్రమే కాదు,రాష్ట్ర ప్రజలంతా చూశారని గుర్తు చేశారు.అదే విధానాన్ని ఇప్పుడు మణుగూరులో కూడా అమలు చేయాలనే ప్రయత్నం కార్మికుల ఉపాధిని, సంస్థ భవిష్యత్తును,రాష్ట్ర ప్రజల ఆస్తిని తాకట్టు పెట్టడమేనని ఆందోళన వ్యక్తం చేశారు.మూడు నెలల క్రితం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రెస్ మీట్లో సింగరేణి బొగ్గు బ్లాక్ వేలంలో పాల్గొనకపోతే సంస్థ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందిని హెచ్చరించిన విషయాన్ని ప్రస్తావించారు.గత ప్రభుత్వం కావాలని సింగరేణిని వేలంపాటల నుంచి దూరం పెట్టిందని విమర్శిస్తూ.. సింగరేణికి వేలంపాటల్లో పాల్గొనే అనుమతి ఇస్తామని స్పష్టంగా ప్రకటించారు.అదే సమయంలో ఎఐటియుసి గుర్తింపు సంఘం, ఐఎన్టీయూసీ ప్రాతినిధ్య సంఘం,సిఎంఒఎఐ అధికారుల సంఘం,సింగరేణి యాజమాన్యం హైదరాబాద్ ప్రెస్ మీట్లో వేలంపాట ద్వారానే బొగ్గు గనులు సాధిస్తే సింగరేణి లాభసాటిగా కొనసాగుతుందని తేల్చి చెప్పారన్నారు.ఇంత స్పష్టమైన ప్రకటనలు, అభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఇప్పుడు మళ్లీ సింగరేణిని పక్కన పెట్టి జెన్కో ద్వారా ప్రైవేటు సంస్థలకు బొగ్గు బ్లాక్ అప్పగించాలనే నిర్ణయం తీసుకోవడం ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా అని ప్రశ్నించారు.సింగరేణి పరిరక్షణ పేరుతో ఎఐటియుసి, ఐఎన్టీయూసీ సంఘాలు ఇప్పుడు ఐక్య పోరాటాలు అంటూ కొత్త నాటకాలకు తెరలేపడం పూర్తిగా కార్మికులను మోసం చేయడమేనని ఆరోపించారు.ఎన్నికల సమయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను మెడలు వంచి బొగ్గు గనులు సాధిస్తామని ప్రగల్భాలు పలికిన ఈ సంఘాలు,అధికారం చేజిక్కిన తర్వాత అధికార పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మికుల నమ్మకాన్ని తాకట్టు పెడుతున్నాయని మండిపడ్డారు.కోల్ బెల్ట్ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు,సీపీఐ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ సింగరేణికి న్యాయం చేయడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే బొగ్గు గనుల వేలంపాటల్లో పాల్గొని సింగరేణికి రావాల్సిన ప్రతి బొగ్గు బ్లాక్ను సాధించగల శక్తి ఉందన్న విషయం కార్మికులు గమనించాలని అన్నారు.మణుగూరు పీకే ఓసి ఎక్స్టెన్షన్ బొగ్గు బ్లాక్ను సింగరేణికే వేలంపాట ద్వారా కేటాయించేందుకు వెంటనే అనుమతి మంజూరు చేయాలి.జెన్కో వేలంపాటల్లో పాల్గొనకుండా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు.జెన్కో పేరుతో ప్రైవేటీకరణకు దారితీసే అన్ని నిర్ణయాలను వెంటనే రద్దు చేయాలని అన్నారు.సింగరేణి మనుగడపై రాజీ పడితే, కార్మికుల నుంచి తీవ్ర ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.సింగరేణి సంస్థను నాశనం చేసే ఏ ప్రయత్నాన్నైనా బీఎంఎస్ సహించదని,అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నామనిహెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి రాగం రాజేందర్,కుంట రాజు,కొమ్మ బాపు,కుమ్మరి చంద్రశేఖర్, కాంపల్లి తిరుపతి,బొమ్మ కంటి కిషన్,సామల కిషోర్,చొప్పరి శ్రీకాంత్,బోరకుంట శ్రీధర్ పాల్గొన్నారు.
