10 ఎకరాల్లోపు రైతులకు రైతు భరోసా అందించాలి

# రైతు సమస్యలను పరిష్కరం కోసం మండల కేంద్రాల్లో ఆందోళనలు

# ఏఐకెఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశ నిర్ణయం
నర్సంపేట,నేటిధాత్రి :

రైతుల పెట్టుబడి సహాయం కోసం తక్షణమే 10 ఎకరాల లోపు సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా అమలు చేసి ఎకౌంట్లో డబ్బులు జమ చేయాలని, రైతులు పండించే అన్ని రకాల వరి ధాన్యాలకు క్వింటాకు 500 రూపాయల బోనస్ వర్తింపచేయాలని, రైతుల రెండు లక్షల రుణాలను బేషరతుగా మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకెఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు. (ఏఐకేఎఫ్) రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు వసుకుల మట్టయ్య అధ్యక్షతన నర్సంపేటలోని ఓంకార్ భవన్ కార్యాలయంలో జరుగగా రాష్ట్రంలో ప్రస్తుత రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వ విధానాలపై చర్చించారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి 30 లక్షల ఎకరాల సాగు అవుతున్న అధిక వర్షాలు ప్రభుత్వ విధానాలతో రైతుల పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందన్నారు. ఒకవైపు ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోయి మరోవైపు అధిక వర్షాలతో పంటలు కోల్పోయి ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారని ప్రధాన పంటలైన పత్తి మొక్కజొన్న తీవ్రంగా దెబ్బతిన్నాయని కేవలం వారి పంట మాత్రమే కొంత ఆశాజనకంగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం రైతులకు అనేక ఆశాజనకమైన హామీలు ఇచ్చి ఆచరణలో మొండి చేయి చూయిస్తున్నదని వర్షాలతో పంటలు కోల్పోయిన రైతులను ఆదుకునేందుకు ఎకరాకు పదివేలు ఇస్తామని చెప్పి నేటికీ క్షేత్రస్థాయిలో పంటల సర్వే చేపట్టకుండా ఎలా ఆదుకుంటారని ప్రశ్నించారు.రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నామని అంటూనే ఆచరణలో కుంటి సాకులతో అమలు చేయడం లేదని 72 లక్షల మంది రైతులలో బ్యాంకర్స్ ఇప్పటివరకు కేవలం 12 లక్షల మందికి మాత్రమే పంట రుణాలు ఇచ్చారని అలాగే రైతులు అనేక దశాబ్దాలుగా భూములు సాగు చేసుకుంటూ వారసత్వంగా వస్తున్న భూములను సైతం రికార్డులోంచి తొలగించి అనేక ఇబ్బందులకు గత ప్రభుత్వం గురిచేసిందని సరిచేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేటికీ సరి చేయకపోవడం విడ్డురంగా ఉందన్నారు. అలాగే రైతులు పండించిన వరి ధాన్యానికి ఎకరాకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ప్రస్తుతం సన్న రకం వరి ధాన్యానికే ఇస్తామని అనడం సరైంది కాదన్నారు.ఇలాంటి పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకోవాలని ఎన్నికల హామీలను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతాంగ పోరాటాలను ఉదృతం చేయాలని నిర్ణయించినట్లు ఈ క్రమంలో అక్టోబర్ 15న రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టనున్నట్లు రైతులంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వల్లెపు ఉపేందర్ రెడ్డి,రాష్ట్ర నాయకులు గుండెబోయిన చంద్రయ్య,మహమ్మద్ ఇస్మాయిల్, వక్కల కిషన్, సింగతి మల్లికార్జున్, నాగేల్లి కొమరయ్య, కర్ర రవీందర్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, మారయ్య,అంజయ్య, పెంటయ్య, ఓడ్డే నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!