# భారీగా పిర్యాదులు చేసిన రైల్వే ఉద్యోగులు
హన్మకొండ,నేటిధాత్రి :
రైల్వే అధికారులు కాజీపేటలోని రైల్వే కమ్యూనిటీ హాల్ లో ఉద్యోగస్తుల సమస్యల పట్ల గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు.ఈ నేపథ్యంలో ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున పాల్గొని పిర్యాదులు చేశారు.సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ కాజీపేట అన్ని బ్రాంచ్ ల సభ్యులు పాల్గొని రైల్వే కార్మికులకు ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడంలో ఎంతోగానో సహకరించారు.అంతేకాకుండా గత కొంతకాలంగా రైల్వే కార్మికులను వేధిస్తున్న మెడికల్, ఐడెంటిటీ కార్డు సమస్యను అలాగే ఉమ్మిద్ కార్డ్ సమస్యను గట్టిగా లేవనెత్తారు.సంఘ్ డిప్యూటీ డివిజనల్ సెక్రటరీ చింతా మురళి, కేంద్ర కార్యవర్గ సభ్యులు వెంకట్ నారాయణ,జోనల్ యువజన కార్యవర్గ సభ్యులు పాక రాజ్ కుమార్ ఆధ్వర్యంలో సంఘ్ కార్యవర్గం అసిస్టెంట్ పర్సనల్ అధికారికి మెమోరాండం సమర్పించారు.ఈ సందర్భంగా వారి డిమాండ్లను ప్రకటిస్తూ ఉమ్మిద్ కార్డును ఉద్యోగి యొక్క బేసిక్ పే లో మార్పుకు అనుగుణంగా ఆటోమేటిక్ గా అప్డేట్ అయ్యే విధంగా చేయాలని తదనుగునంగా హాస్పిటల్ లో వార్డు అలాట్మెంట్ కూడా ఆటోమేటిక్ గా మార్పు జరగాలన్నారు.రైల్వే కార్మికుల పిల్లల ఉమ్మిద్ కార్డు వ్యాలిడిటీ కనీసం వారి వయసు 21 సంవత్సరములు వచ్చేవరకు ఉండాలని కోరారు.ప్రస్తుతం వచ్చిన సమస్యలల్లో 70 శాతం మెడికల్ కం ఐడెంటిటీ కార్డుకు సంబంధించినవే కావున ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని, అంతేకాకుండా ఐడెంటిటీ కార్డును వెంటనే ఇచ్చే విధంగా డిజిటలైజ్ ఐడెంటిటీ సిస్టమ్ ను అమలు చేయాలని పేర్కొన్నారు. కొత్త పెన్షన్ విధానం నుండి పాత పెన్షన్ విధానంలోకి మారిన కార్మికుల ఎన్పీఎస్ సొమ్మును వెంటనే వారి పీఎఫ్ ఖాతాలలో జమచేయాలని,ఎంఎసిపిఎస్ కు అర్హులైన కార్మికులందరికీ వెంటనే ఇంక్రిమెంట్లుస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ డిమాండ్లను సంఘ కార్యవర్గం అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్ తో కూడిన అడ్మినిస్ట్రేషన్ బృందానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో లోకో రన్నింగ్ బ్రాంచ్ చైర్మన్ రవి, ట్రెజరర్ సుధాకర్, ఎలక్ట్రిక్ లోకో షెడ్ సెక్రెటరీ బల్విందర్, చైర్మన్ మాధవరావు, డీజిల్ లోకో షెడ్ సెక్రటరీ జగదీష్, సిఎండబ్ల్యూ సెక్రటరీ అభిలాష్, సంఘ సభ్యులు పాల్గొన్నారు.