వైభవంగా గోదాదేవి అమ్మవారి కల్యాణం
ముగిసిన ధనుర్మాస పూజలు
మంగపేట, నేటి ధాత్రి
ధనుర్మాస ప్రత్యేక పూజా కార్యక్రమా ల్లో భాగంగా నిర్వహించే గోదాదేవి అమ్మవారి కల్యాణ మహోత్సవం బుధవారం కమలాపురం శ్రీ సితారామ చంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో అర్చకుల వేదమంత్రోచ్ఛాణల మధ్య వైభవంగా జరిగింది. స్వామివారిని కల్యాణం చేసుకునేందుకు గోదాదేవి అమ్మవారు ధనుర్మాసంలో నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో స్వామివారిని తిరుప్పావై పారాయణంతో మేల్కొలిపి పూజించి ప్రసన్నం చేసుకుంటుందని ఆలయ పండితులు ప్రతాపురం శ్రీనివాసాచార్యులు, అర్చకులు ప్రతాపురం వంశీకుమారాచార్యులు తెలిపారు. సంవత్సరంలో ఈ ఒక్కరోజే వేంకటేశ్వరుడితో గోదాదేవి పరిణయాన్ని చూసే భాగ్యం కలుగుతుందని.. గోదాదేవి కల్యాణోత్సవం సాక్షాత్తు తిరుమలలో జరుగుతున్నట్లుగా అనుభూతి కలుగుతుందని భక్తులు పేర్కొన్నారు. భక్తులు అమ్మవారికి, స్వామివారికి పట్టువస్ర్తాలను సమర్పించారు. కల్యాణోత్సవంతో ఆలయ ప్రాంగణం గోవిందనామ స్మరణలతో మార్మోగింది.అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. గోదాదేవి కల్యాణంతో ధనుర్మాస పూజా కార్యక్రమాలు ముగిశాయి.
