ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి.
కొనుగోలు కేంద్రలలో రైతులకు మౌలిక వసతులు కల్పించాలి
రోజుకు 10వేల మెట్రిక్ టన్నుల ధాన్యం.సేకరణ లక్ష్యం
జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్
కోదాడ, నేటి ధాత్రి:
జిల్లాలో ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. మంగళవారం కోదాడ మండలం తమ్మర బండపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందన్న అంచనా మేరకు జిల్లా వ్యాప్తంగా 340కి పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 25వేల మెట్రిక్ టన్నుల పైగా ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, సోమవారం ఒక్కరోజే 8900 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు వివరించారు. గతంలో రోజుకు 5వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తుండగా వరి కోతలు ఎక్కువ కావడంతో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేశామని రోజుకు 10వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసె లా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు అన్ని మౌళిక వసతులతో పాటు తేమ కొలిచే యంత్రలు, టార్ఫలిన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని సెంటర్ నిర్వాహకులను ఆదేశించారు. లోడింగ్ చేసిన ధాన్యాన్ని మిల్లులలో వేగంగా అన్ లోడింగ్ చేసి తిరిగి కొనుగోలు కేంద్రాలను వచ్చేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. కొనుగోలుకు అనుగుణంగా లారీలను ఏర్పాటు చేయాలని, అవసరం అయితే లారీల సంఖ్య పెంచాలని అధికారులను ఆదేశించారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఉదయం సమయంలోనే ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇచ్చామని, అదే విదంగా ప్రతి కొనుగోలు కేంద్రంలో నీడ, తాగునీటి సౌకర్యం, ఓఆర్ఎస్ లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. వాతావరణ మార్పుల దృష్ట్యా అకాల వర్షాలతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ సూర్యనారాయణ, తహసిల్దార్ వాజిద్ అలీ, కోదాడ సొసైటీ సీఈవో మండ వెంకటేశ్వర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
