Teachers Call for “Delhi Chalo” Protest
ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం – “ఢిల్లీ చలో”
కంకణ బద్ధులై తరలిరండి.
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ పిలుపు
ప్రాథమిక ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు కల్పించాల్సిందే…
సిపిఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
ప్రభుత్వ పాఠశాలలనే బలోపేతం చేయాలి
కేసముద్రం/ నేటి ధాత్రి
దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అన్యాయాలు, విధానపరమైన దాడులు, జీవన భద్రతపై ముప్పును నిరసిస్తూ… ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్ ఏ ఐ జెఏ సిటిఓ( జాక్టో) ఆధ్వర్యంలో తలపెట్టిన
ఫిబ్రవరి 5, 2026న ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ – “ఢిల్లీ చలో” ధర్నా కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ పిలుపునిచ్చారు.
మంగళవారం కేసముద్రం గ్రామ ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ( టి పి టి ఎఫ్ ) కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ నేతృత్వంలో చలో ఢిల్లీ కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సురేందర్ మాట్లాడుతూ
ప్రస్తుతం
ఉపాధ్యాయులను టెట్ భారంతో వేధించడం, ఎన్ పి ఎస్/ యుపిఎస్ పేరుతో పెన్షన్ భద్రతను లాక్కోవడం,
ఎం ఈ పి–2020 ద్వారా ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేయడం,
పాఠశాలల విలీనాలు, మూసివేతలు,
ఉపాధ్యాయులను బోధనేతర పనులతో ఇబ్బంది పెట్టడం,
కాంట్రాక్ట్ ఉద్యోగులపై వివక్ష,
8వ వేతన సంఘం( 8వ సిపిసి) అమలులో తీవ్ర జాప్యం మొదలగు సమస్యలు అన్ని
కలిసి ప్రభుత్వ విద్యా వ్యవస్థను కూల్చివేసే ప్రమాదకర పరిస్థితికి తీసుకెళ్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో( టెట్) నుండి మినహాయింపు,
ఎన్ పి ఎస్/ యు పి ఎస్, రద్దు చేసి ఓ పి ఎస్, పునరుద్ధరణ,
ఎన్ ఈ పి–2020 ఉపసంహరణ,
ప్రాథమిక ఉపాధ్యాయులకు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు,
పాఠశాలల విలీనాలు–మూసివేతలకు తక్షణమే బ్రేక్,
బోధనేతర పనుల నుండి ఉపాధ్యాయులకు విముక్తి,
కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ మరియు కనీస వేతనాల అమలు,
8వ వేతన సంఘాన్ని వెంటనే అమలు చేయాలి
అనే డిమాండ్లపై ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయుల సహనం ఇక చరమాంకానికి చేరుకుందని,
ఇది వ్యక్తిగత సమస్య కాదనీ, ప్రభుత్వ విద్యను, భవిష్యత్ తరాలను కాపాడుకునే పోరాటం అనీ ఆయన ఉద్ఘాటించారు.
ఈ హక్కుల సాధన కోసం
ఫిబ్రవరి 5, 2026 – ఢిల్లీ చలోకు కంకణ బద్దులై తరలి రావాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులను కోరారు.
ఒక్క ఉపాధ్యాయుడు – ఒక్క అడుగు ముందుకేస్తే…
ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందేననీ,
“ఐక్యతే మన బలం…పోరాటమే మన మార్గం”….అని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో కార్యదర్శి వీసం నర్సయ్య, కోడం శ్రీనివాస్, అప్పాల నాగరాజు, తమ్మే శ్రీనివాస్, రణధీర్,శ్రీధర్ ఇనుగుర్తి మండల కార్యదర్షులు గంగుల వేణు, సారంగపాణి, వెల్దండి సతీష్, నర్సింహా చారీ, రాహుల్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
